బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి వెన్నులో వణుకుపుట్టించే పరిణామం చోటు చేసుకుంది. బెంగాల్లో 107 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ సీనియర్ నేత ముకుల్ రాయ్ బాంబు పేల్చారు. కమలదళంలో చేరేవారిలో టీఎంసీతో పాటు కాంగ్రెస్, సీపీఎం శాసనసభ్యులు ఉన్నారని చెప్పారు. పార్టీలో చేరబోయే నాయకులు జాబితాను తయారు చేశామని, వాళ్లంతా తమతో టచ్లో ఉన్నారని వివరించారు.ఇప్పటికే బెంగాల్లో ఫిరాయింపులు జోరుగా సాగుతున్నాయి. తృణమూల్, CPM, కాంగ్రెస్ పార్టీల నుంచి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు దశలవారీగా బీజేపీలో చేరుతు న్నారు. 40 మంది టీఎంసీ శాసనసభ్యులు తనతో టచ్లో ఉన్నారని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ ఎన్నికల ప్రచారంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఏకంగా 107 మంది శాసన సభ్యులు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారంటూ సీనియర్ నాయకుడు ముకుల్ రాయ్ చెప్పడం కల కలం రేపుతోంది.బెంగాల్లో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 294. 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీకి 211 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్కు-44, వామపక్షాలు-32 స్థానాల్లో గెలుపొందాయి. బీజేపీకి మూడు స్థానాలే వచ్చాయి. ఐతే, ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బలమైన ఎదురుదెబ్బ తగి లింది. రాష్ట్రంలోని 42 లోక్సభ స్థానాల్లో బీజేపీ 18 సీట్లలో విజయం సాధించింది. ఆ తర్వాత కమలదళం దూకుడు పెంచింది.
మమతకు బెంగాల్ షాక్

Related tags :