Business

2వేల నోట్లు తగ్గిస్తున్నారు

RBI To Reduce Printing 2000 Rupees Note

అది 2016 నవంబరు 8.. సాయంత్రం 8 గంటలు కావస్తోంది.. ఉన్నఫలంగా ప్రధాని మోదీ సమావేశం నిర్వహించి ఇప్పటికిప్పుడు రూ.వెయ్యి, రూ.500 నోట్లను రద్దు చేస్తున్నామని సంచలన ప్రకటన చేసి యావత్తు దేశాన్ని ఆశ్చర్యానికి గురిచేశారు.. ఆ తర్వాత రెండు రోజులకు కొత్త రూ.2వేలు, రూ.500 నోట్లను ఆర్బీఐ వాడుకలోకి తీసుకొచ్చింది. అయితే, అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా రూ.2 వేల నోట్లను భారీ స్థాయిలో ప్రింట్ చేయాల్సి వచ్చింది. నోట్ల కష్టాలను తీర్చడానికి ఆర్బీఐ పెద్దమొత్తంలో రూ.2 వేల నోట్లను బ్యాంకులకు సరఫరా చేసింది. పరిస్థితి అదుపులోకి వచ్చాక రూ.2వేల నోట్లను మళ్లీ రద్దు చేసే అవకాశాలున్నాయని ఊహాగానాలు వినిపించాయి. అలాంటిదేమీ లేదని ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేశాయి. కానీ, తెర వెనుక నుంచి ఆర్బీఐ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందా? రూ.2 వేల ప్రింటింగ్‌ను భారీగా తగ్గించేస్తోందా? అంటే గణాంకాలను పరిశీలిస్తే.. అవుననే అనిపిస్తోంది.

దశల వారీగా రూ.2వేల నోట్లను మార్కెట్ నుంచి దూరం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికే రూ.2వేల నోట్లు చాలా చోట్ల కనిపించడం లేదు. రూ.2 వేల నోట్లను తగ్గిస్తూ మిగతా నోట్ల ప్రింటింగ్‌ను పెంచుతున్నట్లు సమాచారం. 2018-2019 మధ్య కాలంలో బ్యాంకులకు చేరిన నోట్ల శాతం 6.2 శాతం నుంచి 17 శాతానికి పెరిగింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2018-19లో రూ.2వేల నోట్ల సరఫరా 68.9 శాతం తగ్గింది. అంతకుముందు ఏడాది 151 మిలియన్ల రూ.2వేల నోట్లు అందుబాటులో ఉండగా, అది 47 మిలియన్ నోట్లకు తగ్గాయి.

2018 మార్చిలో మార్కెట్‌లో ఉన్న మొత్తం నోట్లలో రూ.500, రూ.2వేల నోట్లు 80.2 శాతం ఉండగా, 2019 మార్చి నాటికి 82.2 శాతానికి పెరిగాయని.. కానీ, రూ.500 నోట్ల సరఫరా 42.9 శాతం నుంచి 51 శాతానికి పెరిగిందని ఆర్బీఐ ఓ నివేదికలో స్పష్టం చేసింది. అంటే.. రూ.2వేల నోట్ల సరఫరాను తగ్గిస్తున్నట్లేనని స్పష్టం అవుతోంది. 2017 మార్చిలో రూ.2వేల నోట్లు 50 శాతం సరఫరా ఉండగా, 2018 మార్చి నాటికి 37 శాతానికి, 2019 మార్చి నాటికి 31 శాతానికి పడిపోయినట్లు సమాచారం.