విద్య, ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లేవారికి వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు రూపొందించింది. టోక్యో ఒలింపిక్స్ క్రీడాకారులు, విద్య, ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే వారు పాస్పోర్ట్తో కొవిడ్ టీకా సర్టిఫికెట్లు లింక్ చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఇతర సర్టిఫికెట్లు చూపించాల్సిన అవసరం లేదని తెలిపింది. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. కొవిషీల్డ్ వ్యాక్సిన్ తొలి డోసు వేసుకున్న 28 రోజుల తర్వాతే వారు రెండో డోసు కూడా వేసుకొనే వెసులుబాటు కల్పించింది. ఈ కేటగిరీకి చెందిన వారు రెండో డోసు కోసం 84 రోజుల వరకు వేచి చూడాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టంచేసింది. విద్య, ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లే వారికి ఆగస్టు 31వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉంచుతున్నట్టు పేర్కొంది. రెండో డోసు కోసం 84 రోజుల పాటు వేచిచూడాలన్న నిబంధనతో ఇబ్బందులు ఎదుర్కొంటొన్న పలువురి నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆరోగ్యశాఖ తెలిపింది. మరోవైపు, ఈ నెల 21 నుంచి దేశ వ్యాప్తంగా ఉచిత వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. 18 ఏళ్లు దాటిన వారందరికీ టీకాలు ఉచితంగా అందించే బాధ్యతను కేంద్రమే తీసుకొంటున్నట్టు ఆయన జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో వెల్లడించారు. కొత్త వ్యాక్సినేషన్ డ్రైవ్ నిబంధనలు ఈ నెల 21 నుంచి అమలులోకి రానున్నాయి.
ఆధార్-పాన్ లంకె అయింది. ఇప్పుడు కోవిద్ టీకా-పాస్పోర్ట్ కలపండి.

Related tags :