* విద్యుత్ వినియోగదారులకు మరో షాక్ తగలబోతోందా?. 2014-15 నుంచి 2018-19 వరకు అయిదేళ్ల కాలానికి ట్రూఅప్ కింద రూ.3,669 కోట్ల భారాన్ని ఇప్పటికే వినియోగదారులపై వేసిన విద్యుత్ పంపిణీ సంస్థలు మరో సర్దుబాటు (ట్రూఅప్)కు సిద్ధమయ్యాయి. 2019-20లో టారిఫ్లో అనుమతించిన వ్యయానికి.. వాస్తవ ఖర్చులకు మధ్య వ్యత్యాసం రూ.2,542.70 కోట్లుగా తేల్చాయి. ఇందులో దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) రూ.1,841.58 కోట్లు, తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) రూ.701.12 కోట్ల సర్దుబాటుకు అవకాశమివ్వాలని ఇటీవల ఏపీఈఆర్సీకి ట్రూఅప్ పిటిషన్ను దాఖలు చేశాయి. దీనిపై విచారించి వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరాయి. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత.. ఎంతమేర సర్దుబాటుకు అనుమతించాలో ఏపీఈఆర్సీ నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే అనుమతించిన రూ.3,669 కోట్ల ట్రూఅప్నకు సంబంధించి ఈ నెల బిల్లు నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. తాజా సర్దుబాటును అనుమతిస్తే ఈ భారం మరింత పెరగనుంది.
* కరోనా నేపథ్యంలో దవాఖాన ఖర్చులు భారీగా పెరిగిపోయాయి. ఇప్పుడు చాలామందికి ఉద్యోగ రిత్యా కంపెనీ ఇచ్చే గ్రూప్ హెల్త్ పాలసీ, ఫ్యామిలీ ఫ్లోటర్, వ్యక్తిగత బీమా ఇలా ఒకటికి మించి ఆరోగ్య బీమా పాలసీలు ఉంటున్నాయి. ఇలాంటప్పుడే ఏ పాలసీ నుంచి క్లెయిమ్ చేయాలి? అసలు ఒకటి కన్నా ఎక్కువ పాలసీలను క్లెయిమ్ చేయవచ్చా? అనే ప్రశ్నలు తలెత్తడం సహజం. అయితే ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకరు ఎన్ని పాలసీలైనా క్లెయిమ్ చేయవచ్చు. దాదాపు గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీలకు నోక్లెయిమ్ బోనస్ ఉండదు. వ్యక్తిగత బీమా పాలసీని ఏడాదిలో క్లెయిమ్ చేయకపోతే నోక్లెయిమ్ బోనస్తో వచ్చే ఏడాదికి బీమా కవరేజీ పెరుగుతుంది. కాబట్టి ఒకవేళ దవాఖాన బిల్లు.. గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ కవరేజీకి దిగువనే ఉంటే నిస్సందేహంగా దాన్నే క్లెయిమ్ చేయండి. అంతకన్నా ఎక్కువగా ఉంటే తొలుత గ్రూప్ పాలసీని, మిగతా మొత్తానికి వ్యక్తిగత పాలసీని ఉపయోగించండి.
* సీనియర్ సిటిజన్లు తమకు వస్తున్న పింఛను, ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) వడ్డీ ఆదాయంపై డిక్లేరేషన్ ఇవ్వాలంటూ ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) నోటిఫికేషన్ ఇచ్చింది. దీని ప్రకారం పింఛను, వడ్డీ జమవుతున్న బ్యాంకు లో ఆదాయం పన్ను (ఐటీ) చట్టం 12బీబీఏ సెక్షన్ ప్రకారం వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. దీంతోపాటే సెక్షన్ 87ఏ ప్రకారం ఐటీ రిబేట్ వివరాలనూ సమర్పించాలి. డిక్లరేషన్ను సమర్పించిన తర్వాత వివరాలను బ్యాంకు అధికారులు పరిశీలించి పన్ను పరిధిలోకి ఆదాయం వస్తే పన్నును మినహాయించుకుంటారు. 75 ఏండ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఆదాయం పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు నుంచి బడ్జెట్లో మినహాయింపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే డిక్లరేషన్ను ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఏటా సీనియర్ సిటిజన్లు ఇవ్వాల్సిందే. ఈ డిక్లరేషన్ ఫామ్ ఐటీఆర్ ఫామ్ మాదిరిగానే చాలా వివరంగా ఉంటుంది. మరో రకంగా చెప్పాలంటే 75 ఏండ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు బ్యాంకే ఇక ఐటీ శాఖ.
* గ్రాసరీ వస్తువుల డెలివరీ స్కీం పూర్తిగా నిలిపేయాలని ఫుడ్ అగ్రిగేటర్ జొమాటో నిర్ణయించింది. సరుకుల పంపిణీకి తాము అనుసరిస్తున్న పాలసీ సత్ఫలితాలనివ్వడం లేదని పేర్కొంది. సకాలంలో కస్టమర్ల అవసరాలను తీర్చలేకపోతున్నామని, తక్కువ టైంలో సరుకులు సరఫరా చేస్తామన్న హామీని అమలు చేయలేకపోతున్నట్లు తెలిపింది. అందువల్లే గ్రాసరీ వస్తువుల డెలివరీ ఈ నెల 17 నుంచి పూర్తిగా నిలిపేయాలని నిర్ణయించామన్నది.