Politics

తెలంగాణలో అట్టహాసంగా ప్రారంభమైన రాహుల్ పాదయాత్ర

తెలంగాణలో  అట్టహాసంగా ప్రారంభమైన రాహుల్ పాదయాత్ర

తెలంగాణలోకి రాహుల్‌ ‘భారత్‌ జోడో యాత్ర’

ఘనస్వాగతం పలికిన కాంగ్రెస్‌ శ్రేణులు

హైదరాబాద్ : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన ‘భారత్‌ జోడో యాత్ర’ తెలంగాణలోకి ప్రవేశించింది. కర్ణాటకలోని రాయచూర్‌ నుంచి రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా గూడబల్లూరు సమీపంలోని కృష్ణ చెక్‌పోస్టు వద్ద రాహుల్‌ తెలంగాణలోనికి అడుగుపెట్టారు. కాంగ్రెస్‌ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికాయి. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు చేరుకోవడంతో మారుతినగర్‌ వద్ద కృష్ణా వంతెన, పరిసర ప్రాంతాల్లో సందడి వాతావరణం కనిపించింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌తో పాటు ముఖ్యనేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మధుయాష్కీ తదితరులు రాహుల్‌ వెంట నడిచారు. తెలంగాణలో ‘భారత్‌ జోడో యాత్ర’ సుమారు మూడు కిలోమీటర్ల మేర సాగింది. దీపావళి నేపథ్యంలో ఈనెల 24, 25, 26 తేదీల్లో పాదయాత్రకు రాహుల్‌ విరామం ఇవ్వనున్నారు. 26న ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన ఖర్గే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం తిరిగి ఈనెల 27వ తేదీ నుంచి నవంబరు 7 వరకు రాష్ట్రంలో యాత్ర కొనసాగనుంది. మొత్తం 12 రోజులు, 375 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. నవంబరు 7న కామారెడ్డి జిల్లా జుక్కల్‌ నియోజకవర్గంలోని మద్నూర్‌ మండలంలోని శాఖాపూర్‌ వద్ద రాష్ట్రంలో పాదయాత్ర ముగుస్తుంది.

ఐదు కిలోమీటర్లు నడిచి : భారీ స్వాగత కార్యక్రమాల అనంతరం రాహుల్‌ పార్టీ శ్రేణులు, అభిమానులతో పాదయాత్రగా బయలుదేరుతారు. ఐదు కిలోమీటర్లు పాదయాత్ర సాగించి ఉదయం 11 గంటల సమయంలో గూడబల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలోని టైరోడ్‌కు చేరుకుంటారు. టైరోడ్‌ జంక్షన్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం సమీపంలోనే ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో హైదరాబాద్‌ శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళతారు. తిరిగి ఈ నెల 27న రాష్ట్రానికి చేరుకుని పాదయాత్రను కొనసాగిస్తారు.

ఘనంగా స్వాగత ఏర్పాట్లు : ఆదివారం ఉదయం రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్రకు టీపీసీసీ ఘనంగా స్వాగతం పలికింది. స్వాగత కార్యక్రమాలతోపాటు రాహుల్‌ అక్కడే అల్పాహారం తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. అనంతరం యాత్ర కొనసాగింది. మార్గం వెంట తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బతుకమ్మలు, గిరిజన నృత్యాలు, కోలాటాలు, ఇతర కళా బృందాలతో ప్రదర్శనలు నిర్వహించారు. తొలిరోజు రాహుల్‌ ప్రసంగించే కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో జనసమీకరణ చేయాలని టీపీసీసీ నిర్ణయించింది. మొత్తంగా రాష్ట్రంలో రాహుల్‌ యాత్రకు సంబంధించి మినిట్‌ టు మినిట్‌ షెడ్యూల్‌ను రూపొందించింది. ప్రతి పాయింట్‌కు ఇన్‌చార్జులను, రోజువారీ సమన్వయకర్తలను నియమించి ఎక్కడా, ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేస్తోంది. రాహుల్‌ యాత్రలో పాల్గొనేందుకు దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన కీలక కాంగ్రెస్‌ నేతలు, ఏఐసీసీ నాయకులు తెలంగాణకు వచ్చారు.

అన్ని వర్గాలు, రంగాల వారితో మాట్లాడుతూ : రాహుల్‌ గాంధీ పాదయాత్రలో భాగంగా మేధావులు, వివిధ సంఘాల నాయకులు, వివిధ వర్గాలు, మతాలకు చెందిన పెద్దలు, రాజకీయ, క్రీడా, వ్యాపార, సినిమా రంగాల ప్రముఖులతో భేటీ కాను న్నారు. పలువురు రాహుల్‌తో కలసి యాత్రలో నడవనున్నారు. యాత్ర మధ్యలో దేవాలయాలు, మసీ దులు, చర్చిలు, ఇతర మతాలకు చెందిన ప్రార్థనా స్థలాలను కూడా సందర్శించనున్నట్టు టీపీసీసీ వర్గాలు తెలిపాయి.

యాత్ర జరిగే ప్రాంతాలివే : నారాయణపేట జిల్లాలోని మక్తల్‌ నియోజకవర్గంలో అడుగుపెట్టే రాహుల్‌ యాత్ర నారాయణపేట, దేవరకద్ర, మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్‌ నగర్, రాజేంద్రనగర్, బహుదూర్‌పురా, చార్మినార్, గోషామహల్, నాంపల్లి, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, పటాన్‌చెరు, సంగారెడ్డి, ఆందోల్, నారాయణ్‌ఖేడ్, జుక్కల్‌ అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా (ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్‌ జిల్లాల్లో) సాగనుంది. హైదరాబాద్‌లో ఆరాంఘర్, చార్మినార్, మోజంజాహి మార్కెట్, గాంధీభవన్, నెక్లెస్‌ రోడ్, బోయిన్‌పల్లి, కూకట్‌పల్లి, మియాపూర్, పటాన్‌చెరు ప్రాంతాల మీదుగా జరుగుతుంది.

ఇప్పటివరకు 2,325 కిలోమీటర్లు : సెప్టెంబర్‌ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన జోడో యాత్ర కేరళ, కర్ణాటక, ఏపీ, తిరిగి కర్ణాటక మీదుగా 45 రోజులుగా రాహుల్‌ పాదయాత్ర సాగుతోంది. ఇప్పటివరకు సుమారు 2,325 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. తెలంగాణలో విరామాలు సహా మొత్తం 16 రోజుల పాటు 375 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది.
4