Devotional

మోడేరా సూర్య దేవాలయం చూసి వద్దాం రండి.

మోడేరా సూర్య దేవాలయం చూసి వద్దాం రండి.

🌞🙏సూర్య దేవాలయం – మోఢేరా గుజరాత్🙏🌞

అన్ని దేవాలయాలలో కన్నా సూర్యభగవానుని దేవాలయం చాలా అరుదైనదని చెప్పాలి. అయితే సూర్యభగవానుని దేవాలయం అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది కోణార్క్ సూర్యదేవాలయం
.మన రాష్ట్రం విషయానికొస్తే అరసివెల్లి కూడా ఎంతో చరిత్ర వుంది. స్కంద,బ్రహ్మ పురాణాలలో కూడా ప్రస్తావనకు నోచుకున్న అరుదైన ప్రాంతంలో వెలసిన మోఢేరా టెంపుల్ విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

అహమ్మదాబాద్ నుంచి 100కి.మీ లలో వున్న పుష్పవతి నది ఒడ్డున ఈ దేవాలయం వుంది.

ఈ ఆలయాన్ని క్రీ.పూ. 1022, 1063లో చక్రవర్తి భీందేవ్ సోలంకి నిర్మించారు. క్రీ.పూ. 1025, 1026 ప్రాంతంలో సోమనాథ్ మరియు చుట్టుపక్కల వున్న ప్రాంతాలను విదేశీ ఆక్రమదారుడైన మహమ్మద్ గజనీ తన ఆధీనంలోకి తీసుకున్నట్టు ఆ దేవాలయంలోని గర్భగుడిలో ఒక గోడపై నిర్మించబడి వుంది.

గజనీ ఆ ప్రాంతాలను ఆక్రమించుకోవడంతో సోలంకీలు తమ పూర్వవైభవాన్ని కోల్పోయారు

సోలంకి సామ్రాజ్యానికి రాజధానిగా చెప్పుకునే ‘ అహిల్‌వాడ్ పాటణ్ ‘ కూడా తన గొప్పతనాన్ని, వైభవాన్ని పూర్తిగా కోల్పోనారంభించింది

తమ పూర్వవైభవాన్ని కాపాడుకునేందుకు సోలంకి రాచరికపు కుటుంబం మరియు వ్యాపారులు ఓ జట్టుగా ఏర్పడి అందమైన ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు

సోలంకి కుటుంబీకులు సూర్య వంశస్థులు. వారు సూర్యుడ్ని తమ కులదేవతగా కొలిచేవారు.

కాబట్టి వారి ఆరాధ్య దైవమైన సూర్యుడ్ని కొలిచేందుకు ఓ అందమైన సూర్య మందిరాన్ని నిర్మించాలనుకున్నారు. ఈ విధంగా మోఢేరా సూర్యదేవుని ఆలయం నిర్మితమైంది.

శిల్పకళలకు కాణాచి అయిన ఈ ఆలయంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రత్యేకమైన విశేషం ఒకటుంది. అదేంటంటే ఈ ఆలయ నిర్మాణంలో సున్నం ఏ మాత్రం ఉపయోగించకపోవటం.

ఇరానీ శిల్పకళా శైలిలో రెండు భాగాలుగా ఈ ఆలయాన్ని భీందేవ్ నిర్మించారు.

ఇందులో తొలి భాగం గర్భగుడి కాగా, రెండవది సభామండపం, మందిర గర్భగుడి లోపల పొడవు 51అడుగుల 9అంగుళాలు.అలాగే వెడల్పు 25అడుగుల 8అంగుళాలుగా నిర్మించడం జరిగింది

మందిరంలోని సభామండపంలో మొత్తం 52స్తంభాలు వున్నాయి. ఈ స్థంభాలపై అత్యధ్బుతమైన కళాఖండాలు,పలు దేవతల చిత్రాలను చెక్కారు.

రామాయణం, మహాభారతంలోని ప్రధాన విషయాలను ఇక్కడ చెక్కారు.

స్తంభాల కింది భాగంలో చూస్తే అష్ట కోణాకారంలోను అదే పైభాగంలో చూస్తే గుండ్రంగా కనపడతాయి.

సూర్యోదయం జరిగిన వెంటనే తొలి సూర్యకిరణం ఆలయగర్భగుడిలోకి ప్రవేశించేలా ఆలయ నిర్మాణం చేపట్టారు.

సభామంటపానికి ఎదురుగా విశాలమైన మడుగు వుంది. దీనిని ప్రజలు సూర్యమడుగు లేదా రామ మడుగు అని పిలుస్తారు.

అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకునే సమయంలో సూర్యమందిరాన్ని పూర్తిగా ధ్వంసం చేసాడు.

మందిరంలోని విగ్రహాలను తునాతునకలు చేసేసాడు.ప్రస్తుతం భారతీయ పురావస్తుశాఖ ఈ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకుని సంరక్షిస్తోంది.

స్కాందపురాణం మరియు బ్రహ్మ పురాణాలననుసరించి ప్రాచీనకాలంలో మోఢేరా చుట్టుపక్కల వున్న ప్రాంతాలను ధర్మరణ్య అని పిలిచారు

శ్రీరాముడు రావణున్ని సంహరించిన తరువాత తన పాపాలకు ప్రాయశ్చిత్యం చేసుకొనేందుకు అలాగే బ్రహ్మహత్యా పాపం నుంచి బయటపడేందుకు తగిన పవిత్రమైన స్థానం చూపించమని తన గురువైన వశిష్టుడ్ని అడిగాడని పురాణాలు చెప్తున్నాయి.

ఇక్కడికి ఎలా చేరుకోవాలి

రోడ్డు మార్గం అహ్మదాబాద్‌ నుంచి 102 కిలోమీటర్ల దూరంలో ఉంది. అహ్మదాబాద్‌ నుంచి ఈ ప్రాంతానికి చేరుకునేందుకు బస్సు మరియు టాక్సీల సౌకర్యం ఉంది.

రైలు మార్గం

అహ్మదాబాద్‌ వరకు రైలు మార్గం గుండా వెళ్లవచ్చు.

ఓం శ్రీ సూర్య దేవాయ నమః🌞