Health

ఇకపై ముఖం చూసే బీపీ, షుగర్ ఎంతుందో చెప్పేస్తారు

ఇకపై ముఖం చూసే బీపీ, షుగర్ ఎంతుందో చెప్పేస్తారు

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాబోయే రోజుల్లో థర్మల్ స్క్రీనింగ్ ద్వారా వ్యాధి నిర్ధారణ చేయవచ్చు. అంతే కాకుండా ముఖం చూసే బీపీ, షుగర్ ఎంతుందో చెప్పేసే రోజులు వస్తాయని ప్రముఖ డయాగ్నొస్టిక్‌ సెంటర్‌ ఆర్కా ల్యాబ్‌ సీఈవో గాయత్రి తెలిపారు. ఇకపై శరీరానికి సూది గుచ్చకుండా, రక్తపు బొట్టు బయటకు రాకుండా వ్యాధి ఎంటో నిర్ధారణ చేయవచ్చన్నారు. ఇలాంటి నూతన టెక్నాలజీ హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చింది. థర్మల్‌ స్క్రీనింగ్‌ డివైజ్‌ పరికరంతో రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులను సులువుగా గుర్తించవచ్చని సీఈవో గాయత్రి తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో డివైజ్‌ తయారీ, వీటి వినియోగానికి అవసరమైన సాంకేతికతను బెంగళూరు కేంద్రంగా అందిస్తున్నట్టు చెప్పారు.

నిల్చున్న చోటే ముఖ కదలికలను కెమెరా రికార్డు చేసి వాటిని ఎనలైజ్‌ చేసేందుకు రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ సాయంతో బీపీ, షుగర్‌, గుండె సంబంధిత వ్యాధులను గుర్తించడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని కిమ్స్‌తోపాటు మరికొన్ని సెంటర్లు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెండు క్లినిక్‌ల ద్వారా ఈ సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు 4వేల మందికి థర్మల్‌ స్క్రీనింగ్‌ ద్వారా వైద్య పరీక్షలు చేయగా 91 శాతం కచ్చితమైన ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. ఈ నూతన డివైజ్‌ ద్వారా రూ.100-150 లోపే హెల్త్‌ రిపోర్టు పొందవచ్చని ఆమె తెలిపారు.