హైదరాబాద్ : పోలీసింగ్లో శాంతిభద్రతల నిర్వహణే అత్యంత కీలకమని డీజీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు. బహిరంగ సభలు, మతపర సమావేశాలు, ఊరేగింపులు తదితర సందర్భాల్లో బందోబస్తు నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణ, బందోబస్తు అంశాలపై పోలీసు కమిషనర్లు, ఎస్పీలతో ఆయన వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. తొలిసారి యూనిట్ల సారథ్య బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులకు దిశానిర్దేశం చేశారు. వివిధ రాష్ట్రాల్లో గతంలో జరిగిన దుర్ఘటనల్లో పలువురు మృతిచెందారని, అలాంటి ఘటనల నుంచి పోలీసు అధికారులు నేర్చుకోవాల్సిన పాఠాలెన్నో ఉన్నాయన్నారు. ‘‘ప్రస్తుతం రాష్ట్ర పోలీసు శాఖ యువ, సీనియర్ అధికారులతో మిళితమై ఉంది. యువ అధికారుల ప్రతిభకు సీనియర్ల అనుభవం తోడైతే పోలీసు శాఖ ఎంతో పటిష్ఠమవుతుంది. సామాన్య పౌరులకు వీలైనంత మేరకు ఇబ్బందులు తొలిగించేలా పోలీసింగ్కు ప్రాధాన్యం ఇవ్వాలి’’ అని సూచించారు. సంఘవిద్రోహక శక్తుల కట్టడి, వామపక్ష తీవ్రవాద అణిచివేత, బాంబుపేలుళ్ల నియంత్రణ, డ్రోన్ సాంకేతికత వినియోగం తదితర అంశాల గురించి సమావేశంలో వివరించారు. రాచకొండ, ఖమ్మం పోలీసు కమిషనర్లు డీఎస్ చౌహాన్, విష్ణు ఎస్ వారియర్, శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీ సంజయ్కుమార్ జైన్, ఐజీలు చంద్రశేఖర్రెడ్డి, షానవాజ్ ఖాసీం తదితరులు పాల్గొన్నారు.
పోలీసింగ్లో శాంతిభద్రతల నిర్వహణే కీలకం : డీజీపీ అంజనీకుమార్
