జూన్ 22న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం పరిసరాల్లో అమరవీరుల స్మారక స్థూపాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. తుది మెరుగులు కూడా దిద్దారు. ఈ స్మారక భవనాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు రేపు లాంఛనంగా ప్రారంభించనున్నారు. అమరవీరుల స్మారక స్థూపం, ట్యాంక్ బండ్ ప్రారంభోత్సవం సందర్భంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వాహనాల రాకపోకల వల్ల ట్రాఫిక్ స్తంభించే అవకాశం ఉంది. సాధారణ ప్రజలకు అసౌకర్యాలను తగ్గించేందుకు కొన్ని ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి. వాహనాల అంతరాయం లేకుండా వెళ్లేందుకు కింది ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయి. ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్, లుంబినీ పార్క్ వంటి ప్రదేశాలను జూన్ 22న ప్రారంభోత్సవం దృష్ట్యా మూసివేయనున్నారు.
రూ.177.5 కోట్లతో నిర్మించబడిన ఈ మెమోరియల్లో అమరవీరుల ఫోటోల ప్రదర్శన కోసం 10,000 చదరపు అడుగుల హాలు, రెండు లక్షల చదరపు అడుగుల బేస్మెంట్ పార్కింగ్, 500-సామర్థ్యం గల కన్వెన్షన్ సెంటర్, ఆడియో విజువల్ థియేటర్, రూఫ్టాప్ రెస్టారెంట్, ఇతర ఫీచర్లు ఉన్నాయి. ఇది అతిపెద్ద స్టెయిన్లెస్ స్టీల్ సీమ్లెస్ ఫినిషింగ్ స్ట్రక్చర్ అని అధికారులు తెలిపారు. ఇప్పటికే ప్రారంభోత్సవ కార్యక్రమానికి జరుగుతున్న ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి పరిశీలించారు. స్మారక చిహ్నం ప్రారంభోత్సవానికి ముందు 175 అడుగుల ఎత్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నుండి స్మారక చిహ్నం వరకు 5,000 మంది కళాకారులతో ర్యాలీ నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా జరిగే సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ప్రారంభోత్సవానికి మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు సహా పలువురు ప్రముఖులు హాజరవుతారని, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు. కోతల్లేని విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని, వేదికను సముచితంగా అలంకరించాలన్నారు. రాష్ట్ర 10వ ఆవిర్భావ దినోత్సవం 21 రోజుల ఉత్సవాల ముగింపు సందర్భంగా స్మారక చిహ్నం ప్రారంభోత్సవం భారీ ఎత్తున నిర్వహించేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను కోరారు.