Sports

2023:ఆసియా కబడ్డీ ఛాంపియన్‌గా భారత్‌ జట్టు

2023:ఆసియా కబడ్డీ ఛాంపియన్‌గా భారత్‌ జట్టు

ఏషియన్‌ కబడ్డీ చాంపియన్‌షిప్‌ 2023 టైటిల్‌ను భారత్‌ కైవసం చేసుకుంది. దక్షిణకొరియాలోని బుసాన్‌ వేదికగా శుక్రవారం ఇరాన్‌తో జరిగిన ఫైనల్లో భారత్‌ 42-32 తేడాతో ఓడించింది. కాగా భారత్‌కు ఆసియా కప్‌ టైటిల్‌ నెగ్గడం ఇది ఎనిమిదోసారి కావడం విశేషం. జూన్‌ 27న ప్రారంభమైన టోర్నీలో మూడురోజుల పాటు ఆరు మ్యాచ్‌లు జరిగాయి. టాప్‌-2లో నిలచిన భారత్‌, ఇరాన్‌లు ఫైనల్లో పోటీపడ్డాయి.భారత కెప్టెన్ పవన్ షెహ్రావత్ 10 పాయింట్లతో సత్తాచాటాడు. ఇక, ఈ మ్యాచ్ తొలి ఐదు నిమిషాల వెనుకబడిన టీమిండియా ఆ తర్వాత సత్తాచాటింది. 10వ నిమిషంలో పవన్, ఇనాందార్ సక్సెస్‍ఫుల్ రైడ్‍లతో మ్యాచ్ భారత్ వైపునకు తిరిగింది. అప్పటి నుంటి టీమిండియా చెలరేగింది. ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి భారత్ 23-11తో ఆధిక్యంలో నిలిచింది.

అయితే, ఆ తర్వాత పోరు హోరాహోరీగా సాగింది. ఓ దశలో పాయింట్లు 38-31కు చేరాయి. అయితే, మళ్లీ భారత్ పుంజుకుంది. 42-32 తేడాతో మ్యాచ్‍ను కైవసం చేసుకొని.. ఆసియన్ చాంపియన్‍షిప్ టైటిల్‍ను దక్కించుకుంది. ఇక భారత కబడ్డీ జట్టుకు తదుపరి ఆసియా గేమ్స్ కీలకంగా ఉంది. సెప్టెంబర్ 23 నుంచి చైనాలోని హాంగ్‍జవూ వేదికగా ఆసియా గేమ్స్ స్పోర్ట్స్ ఈవెంట్ జరగనుంది.