DailyDose

ఖమ్మం చేరుకున్న రాహుల్ గాంధీ-TNI నేటి తాజా వార్తలు

ఖమ్మం చేరుకున్న రాహుల్ గాంధీ-TNI నేటి తాజా వార్తలు

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. శ్రీనివాసుని దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండి ఏటీసీ కౌంటర్ బయట వరకు క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 82,999 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వేంకటేశ్వరుని హుండీకి రూ.4.27 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.

షిరిడీ ఆలయానికి అదనపు భద్రత

మహారాష్ట్రలోని షిరిడీ ఆలయానికి అదనపు భద్రత ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర సెక్యూరిటీ ఫోర్స్ ఆధ్వర్యంలో ఆలయ భద్రత కోసం 74 మంది జవాన్లను మోహరించారు. బాంబే హైకోర్టు అనుమతితో ఆలయ గభారా, ఐదు ప్రవేశ ద్వారాల వద్ద 74 మంది జవాన్లను విధుల్లో ఉంచారు. వీరితో పాటు 100 మంది మహారాష్ట్ర పోలీసులు కూడా సెక్యూరిటీ విధులు నిర్వహిస్తారు.

* మహా’ రాజకీయాల్లో మరో కుదుపు.. మంత్రిగా అజిత్‌ పవార్‌ ప్రమాణం

మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీలో విపక్షనేతగా ఉన్న నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ కీలక నేత అజిత్‌ పవార్‌ అధికార  పక్షంలో చేరారు. ముఖ్యమంత్రి శిందేతో భేటీ అనంతరం.. తన మద్దతుదారులు 9 మందితో కలిసి గవర్నర్‌ను కలిశారు. వెనువెంటనే మంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

* యూనిఫాం సివిల్ కోడ్ కు వ్యతిరేకం కాదు, కానీ”.. మాయావతి కీలక వ్యాఖ్యలు

దేశవ్యాప్తంగా ‘యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ)’పై చర్చ నడుస్తోంది. గత వారం ప్రధాని నరేంద్రమోడీ భోపాల్ లో జరిగిన ఓ సమావేశంలో యూసీసీ అమలుపై కీలక వ్యాఖ్యలు చేయడంతో దేశంలోని ఇతర ప్రధాన ప్రతిపక్షాలు దీనిపై కామెంట్స్ చేస్తున్నాయి. ఇప్పటికే ఆప్, ఉద్ధవ్ ఠాక్రే శివసేన వంటి పార్టీలు దీనికి మద్దతు తెలిపుతున్నాయి. అయితే తాజాగా ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం మాయవతి కూడా తాను యూనిఫాం సివిల్ కోడ్ కు వ్యతిరేకం కాదని అన్నారు. అయితే బీజేపీ, కేంద్ర ప్రభుత్వం దేశంలోని అమలు చేస్తున్న పద్ధతే సరిగ్గా లేదని ఆమె ఆరోపించారు.

తెలంగాణ బీజేపీ ఎన్నికల కమిటీ సారథిగా ఈటల..?

త్వరలో ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాలపై బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి సారించింది. దీనికి సంబంధించి ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ రూపొందించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోని సీనియర్‌ నాయకులకు కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీలో అంతర్గత తగదాలు నాయకుల మధ్య విభేదాలు చక్కదిద్దేలా బీజేపీ అధిష్ఠానం వ్యూహాన్ని రూపొందించినట్టు తెలుస్తోంది. తెలంగాణకు సంబంధించి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్న హైకమాండ్‌ – రాష్ట్ర అధ్యక్ష మార్పు ఉన్నా లేకున్నా పార్టీపరంగా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రానున్న ఎన్నికల కోసం ప్రత్యేకంగా ఎలక్షన్‌ కమిటీ ఏర్పాటు చేయాలని బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. టికెట్ల కేటాయింపు, ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాలకు కీలకంగా వ్యవహరించే ఈ కమిటీ బాధ్యతలు సీనియర్‌ నేత ఈటల రాజేందర్‌కు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఈటలకు ఢిల్లీ పెద్దల నుంచి సంకేతాలు వచ్చినట్టు సమాచారం. ఈ మధ్యే ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలతో ఈటల సమావేశమైన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి వచ్చిన ఆ సంకేతాలను బట్టే ఈటల నిన్న ట్వీట్‌ చేసినట్టు తెలుస్తోంది

రేణుకా చౌదరి ఫైర్

ఖమ్మం జిల్లాలో ఈ రోజు కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అయితే సభకు వచ్చే వాహనాలను బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుంటోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.రోడ్డుపై అడ్డుగా ఉన్న బారికేడ్లను తొలగించిన రేణుకా చౌదరి.. ‘‘మా ప్రజలు, మేము వెళ్తున్నాం.. నువ్వు ఎవడ్రా ఆపడానికి? బారికేడ్లు పెడితే భయపడిపోయి ఆగిపోతామా? పిచ్చి భ్రమలు. ఎవడ్రా మమ్మల్ని ఆపేది” అంటూ శివాలెత్తారు.

రాహుల్ గాంధీ నేటి విజయవాడ పర్యటన షెడ్యూల్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు ఆదివారం విజయవాడ రానున్నారు. రాహుల్ పర్యటన షెడ్యూల్ వివరాలను పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు విడుదల చేసారు. సాయంత్రం 4.40కి ప్రత్యేక విమానంలో రాహుల్ విజయవాడ చేరుకుని హెలికాప్టర్ ద్వారా ఇక్కడ నుండి ఖమ్మం 5.20కి చేరుకుంటారు. ఖమ్మం బహిరంగసభ అనంతరం సాయంత్రం 7 గంటలకు అక్కడ బయలుదేరి రాత్రి 9.15కి విజయవాడ

గన్నవరం ఎయిర్పోర్టుకు రాహుల్ గాంధీ

ఏపీలోని గన్నవరం ఎయిర్పోర్టుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేరుకున్నారు. ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆయనకు స్వాగతం పలికారు. కాసేపట్లో అక్కడినుంచి ఖమ్మం సభకు ప్రత్యేక హెలికాప్టర్లో చేరుకుంటారు. ఇప్పటికే ఖమ్మంకు భారీగా కార్యకర్తలు తరలివచ్చారు.

ఖమ్మం చేరుకున్న రాహుల్ గాంధీ

TS: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఖమ్మం చేరుకున్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు పలువురు నేతలు రాహుల్క ఘనస్వాగతం పలికారు. కాంగ్రెస్ జనగర్జన సభలో పాల్గొననున్న రాహుల్.. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు

ఖమ్మం కాంగ్రెస్ సభలో ఆరుగురికే ప్రసంగించే అవకాశం

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల యుద్ధం మరికొన్ని నెలల్లో మొదలుకానుంది. దీంతో పార్టీలన్నీ వ్యూహాలకు పదును పెట్టి పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తున్నాయి. అంతేకాకుండా ఎవరికి వారిగా గెలిచే అభ్యర్థులపై దృష్టిపెట్టాయి. ఇక ఈసారి ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్.. గతానికి భిన్నంగా ముందడుగు వేస్తోంది. ఇప్పటికే కీలక నేతలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేలా ప్లాన్ వేసి.. సక్సెస్ అయింది. ఈ నేపథ్యంలో పొంగులేటి, జూపల్లి చేరికతో పాటు.. భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సభ సందర్భంగా.. ఇవాళ ఖమ్మం వేదికగా భారీ సభను తలపెట్టింది. ఇదే వేదిక నుంచి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల శంఖారావం పూరించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. దీనికోసం ఫుల్ స్ట్రాటెజీతో ముందుకు వెళ్తోంది. ఈ సభలో కేవలం ఆరుగురు నేతలకు మాత్రమే ప్రసంగించే అవకాశం లభించనుంది. రాహుల్ గాంధీ తోపాటు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేణుకా చౌదరి మాత్రమే ప్రసంగించనున్నట్లు సమాచారం. ఈ సభలో రాహుల్ గాంధీ ఎన్నికల మ్యానిఫెస్టోను కూడా ప్రవేశపెడతారని.. పలు హామీలు సైతం ఇస్తారని పేర్కొంటున్నారు.