Editorials

ఈరోజు భాను సప్తమి , భాను సప్తమి అంటే ఏమిటి ?

ఈరోజు భాను సప్తమి , భాను సప్తమి అంటే ఏమిటి ?

ఈ నియమాలు ప్రతి ఆదివారానికి వర్తిస్తుంది

ఆదివారం రోజు సప్తమి తిధి రావడం వలన దీనిని భాను సప్తమి అంటారు. ఇది చాలా గొప్ప యోగం. సాధారణంగా ఆదివారం రోజు అనేక నియమాలు పాటించాలని ధర్మశాస్త్రం చెబుతోంది. వాటిలో ప్రధానంగా చూస్తే… మొదట సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవడం రెండవది ఆదివారం రోజు అభ్యంగన స్నానం చేయకూడదు , ఈ రోజు కేవలం తలస్నానం మాత్రమే చేయాలి. మూడవది ఒంటికి , తలకు నూనె పెట్టుకోరాదు. నాల్గవది ఉల్లి , వెల్లుల్లి , మద్యము , మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఐదవది బ్రహ్మచర్యం పాటించాలి.

నవగ్రహాలకు అధిపతి సూర్యభగవానుడు. ఆయన అనుగ్రహం ఉంటే మనకు అసాధ్యమైనది అంటూ ఏదీ ఉండదు. సుర్యారాధనతో విద్యా , వ్యాపారాభివృద్ధి జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. అవివాహితులకు వివాహమవుతుంది. సంతానం కలుగుతుంది. మనఃశ్శాంతి లభిస్తుంది. సూర్యారాధనతో లభించనిది అంటూ ఏదీ ఉండదు.

ఈ భానుసప్తమి అనేది సూర్యునికి సంబంధించిన ఒక పర్వదినము లాంటిది , గొప్ప యోగము. ఈ రోజు చేసే స్నానం , దానము , జపము , హోమము లక్ష రెట్ల ఫలితాన్ని ఇస్తుందని శాస్త్ర వచనం. ఈ రోజున ఆవుపాలతో చేసిన పరమాన్నము శ్రీ సూర్య భగవానునికి నివేదన చేస్తారు.

సూర్యోదయానికి పూర్వం నిద్రలేచి స్నానోదకాలు చేయక , ఆహార నియమాలు పాటించని వారికి అనారోగ్యం చేసి రోగాలు వస్తాయని , దరిద్రం పడుతుందని శాస్త్రవచనం. ఈ విషయాన్ని పరమశివుడే సూర్యాష్టకంలో చెబుతారు.

ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్ధినే
సప్త జన్మ భవేద్రోగీ జన్మ కర్మ దరిద్రతా
స్త్రీ తైల మధు మాంసాని హస్త్యజేత్తు రవేర్ధినే
న వ్యాధి శోక దారిద్ర్యం సూర్య లోకం స గచ్ఛతి

భావం:- తినకూడని పదార్ధాలు , మద్యము , మాంసము మొదలైనవి తినేవాడు ఏడు జన్మల పాటు రోగాలతో బాధపడతారు. ఆజన్మాంతం దరిద్రం ఉంటుంది. స్త్రీ సమాగమము , తైలం రాసుకోనుట , మద్య మాంసాలను ఆదివారం విడిచిపెట్టినవానికి శోకం , వ్యాధి , దారిద్ర్యం ఉండదు , వారు సరాసరి సూర్యలోకనికి వెళతారు.
ఈ నియమాలు ఒక్క భానుసప్తమికే పరిమితం కాదు ప్రతి ఆదివారం విధిగా పాటించమని పరమశివుడుF చేసుకోమని దుర్వినియోగం చేయవద్దని సూచన.

ఈ రోజు సూర్యుని అనుగ్రహం కోసం సూర్యాష్టకం , ఆదిత్య హృదయం , సూర్య ద్వాదశ నామాలు పఠించడం శ్రేష్ఠం. సూర్యనమస్కారాలు చేయడం వలన ఎన్నో శుభఫలితాలను , ఇష్ట కామ్యసిద్ధిని ఇస్తాయి.

శ్రీ రామచంద్రుడంతటి వాడు రావణున్ని యుద్దంలో జయించడానికి సూర్యదేవుని ప్రార్ధించాడు ఇది అందరికీ తెలిసినదే ప్రతి రోజు ఎవరైతే సూర్యోదయ సమయంలో సూర్యనమస్కారాలు చేస్తారో వారికి అన్నింటా విజయం కలుగుతుంది.