WorldWonders

అమెరికాలోని అత్యంత సంపన్న మహిళల్లో నలుగురు భారతీయులు

అమెరికాలోని అత్యంత సంపన్న మహిళల్లో నలుగురు భారతీయులు

అమెరికాలో తమదైన ముద్ర (స్వయంకృషితో ఎదిగిన మహిళలు) వేసిన తొలి 100 మంది సంపన్న మహిళల జాబితాను ‘ఫోర్బ్స్‌’ విడుదల చేసింది. ఈ జాబితాలో నలుగురు భారత సంతతి మహిళలకు చోటు దక్కింది. పెప్సికో మాజీ ఛైర్మన్‌, సీఈఓ ఇంద్రా నూయీ.. ఆరిస్టా నెట్‌వర్క్‌ ప్రెసిడెంట్‌, సీఈఓ జయశ్రీ ఉల్లాల్‌.. సింటెల్‌ సహ వ్యవస్థాపకురాలు నీర్జా సేథీ, కాన్‌ఫ్లూయెంట్‌ సహ వ్యవస్థాపకురాలు నేహా నార్ఖడే ఇందులో ఉన్నారు. వ్యక్తిగత ఆస్తుల విలువ, ఆయా కంపెనీల్లో వాటాల విలువ ఆధారంగా ఫోర్బ్స్‌ ఈ జాబితాను వెల్లడించింది.

జయశ్రీ ఉల్లాల్‌:ఫోర్బ్స్‌ రిలీజ్ చేసిన ఈ జాబితాలో జయశ్రీ ఉల్లాల్‌ 2.4 బిలియన్‌ డాలర్ల నికర ఆస్తులతో 15వ స్థానంలో నిలిచారు. 2008 నుంచి ఆరిస్టా నెట్‌వర్క్‌ ప్రెసిడెంట్‌, సీఈఓగా ఆమె బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆరిస్టాలో జయశ్రీకి 2.4 శాతం వాటా ఉన్నట్లు ఫోర్బ్స్‌ పేర్కొంది. అరిస్టా 2022లో 4.4 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది.

నీర్జా సేథీ:990 మిలియన్‌ డాలర్ల సంపదతో నీర్జా సేథీ ఈ జాబితాలో 25వ స్థానంలో ఉన్నారు. 1980లో భర్త భరత్‌ దేశాయ్‌తో కలిసి నీర్జా సింటెల్‌ను ఆమె స్థాపించారు. ఈ కంపెనీ నుంచి తన వాటా కింద 510 మిలియన్‌ డాలర్లు నీర్జా పొందినట్లు ఫోర్బ్స్‌ ప్రకటించింది.

నేహా నార్ఖడే: 520 మిలియన్‌ డాలర్ల సంపదతో నేహా నార్ఖడే ఈ జాబితాలో 50వ స్థానంలో నిలిచారు. గతంలో లింక్డ్‌ఇన్‌లో ఆమె సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేశారు. లింక్డ్‌ఇన్‌లో కీలకమైన ఓపెన్‌ సోర్స్‌ మెసేజింగ్‌ సిస్టమ్‌ అపాచీ కఫాను రూపొందించడంలో ఆమెదే కీలక పాత్ర. 2014లో లింక్డ్‌ఇన్‌కు స్వస్తి చెప్పి.. ఇద్దరు సహోద్యోగులతో కలిసి కాన్‌ఫ్లూయెంట్‌ను స్థాపించారు. ఈ సంస్థలో ఆమెకు 6 శాతం వాటా ఉన్నట్లు ఫోర్బ్స్‌ వెల్లడించింది.

ఇంద్రా నూయీ: 350 మిలియన్‌ డాలర్ల సంపదతో ఇంద్రా నూయీ 77వ స్థానంలో ఉన్నారు. 2019లో పెప్సికోకు వీడ్కోలు పలికారు. 24 ఏళ్ల పాటు పెప్సికోలో అత్యున్నత పదవుల్లో ఉన్న ఇంద్రా నూయీ.. ఆ సంస్థ ఆదాయాన్ని భారీగా పెంచారు. 2019 నుంచి ఆమె అమెజాన్‌లో బోర్డు సభ్యురాలిగా కొనసాగుతున్నారు. ఈ జాబితాలో ఏబీసీ సప్లై సహ వ్యవస్థాపకురాలు డైనీ హెండ్రిక్స్‌ (15 బిలియన్‌ డాలర్లు) మొదటి స్థానంలో నిలిచారు.