* రేపు తిరుమలలో బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో రేపు బ్రేక్ దర్శనాలను చేసింది. తిరుమంజనం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఏటా నాలుగు సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తిరుమంజనం పూర్తైన తర్వాత పూజలు నిర్వహించి.. భక్తుల్ని మధ్యాహ్నం 12 గంటల తర్వాత దర్శనానికి అనుమతించనున్నారు.
* ఈ నెల 20న కాంగ్రెస్ లో చేరనున్న జూపల్లి!
TS: కాంగ్రెస్లో చేరే విషయమై ఆ పార్టీ నేత భట్టి విక్రమార్కతో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సమావేశమయ్యారు. ఈ నెల 20న నాగర్ కర్నూల్ కొల్హాపూర్ సభలో కాంగ్రెస్లో చేరనున్నట్లు పరోక్షంగా తెలిపారు. ఈ క్రమంలో ప్రియాంక సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. MLC దామోదర్ రెడ్డి, మాజీ MLA గురునాథ్ రెడ్డితో సహా 14 నియోజకవర్గాల నుంచి కీలక నేతలు కాంగ్రెస్లో చేరనున్నట్లు జూపల్లి పేర్కొన్నారు.
* పెండింగ్ బిల్లుల అంశంపై తెలంగాణ రాజ్భవన్ క్లారిటీ
పెండింగ్ బిల్లుల అంశంపై గత కొంత కాలంగా ప్రగతి భవన్, రాజ్భవన్ మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధిని అడ్డుకునే విధంగా గవర్నర్ బిల్లులను పెండింగ్లో పెడుతున్నారంటూ అధికార పార్టీ నేతలు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్పై గత కొన్నిరోజులుగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. తాజాగా ఈ పెండింగ్ బిల్లుల అంశంపై రాజ్భవన్ వివరణ ఇచ్చింది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వద్ద ఎలాంటి బిల్లులు పెండింగ్లో లేవని స్పష్టం చేసింది. గతంలోనే 3 బిల్లులను గవర్నర్ ఆమోదించారని వెల్లడించింది. మరో 2 బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపారని పేర్కొంది. మిగిలిన బిల్లులపై వివరణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి పంపినట్లు పేర్కొంది.
* రేపు సింహాచలం ఆలయం దర్శనం నిలిపివేత
రేపు సింహాచలం ఆలయంలో దర్శనాలు నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. సింహాచలం గ్రామదేవతలైన ఉమామహేశ్వరి పాదాలమ్మ, బంగారమ్మ పండగలు మంగళవారం నిర్వహించనున్న నేపథ్యంలో మధ్యాహ్నం 2.30 గంటల వరకే భక్తులకు దర్శనాలు ఉంటాయి. ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి భక్తులను తిరిగి దర్శనానికి అనుమతించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
* జమ్మూలో కంపించిన భూమి
జమ్మూ కశ్మీర్లో భూకంపం ప్రకంపనులు సృష్టించింది. దోడా జిల్లాలో 4.9 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. 2023 జూలై 10సోమవారం ఉదయం 5 గంటల38 నిమిషాలకు భూకంపం సంభవించింది.అయితే ఎలాంటి నష్టం జరగ లేదని అధికారులు తెలిపారు. గత నెల జూలైలోనూ దోడా జిల్లాలో పలుమార్లు భూకంపం సంభవించింది. ఓ వైపు భారీ వర్షాలతో కల్లోలంగా ఉన్న జమ్మూ కశ్మీర్లో భూకంపం రావడం అలజడి రేపుతోంది. జూన్ 13న జిల్లావ్యాప్తంగా 5.4 తీవ్రతతో భూకంపం సంభవించడంతో ఇళ్లు సహా డజన్ల కొద్దీ భవనాలు బీటలు వారాయి.
* రెండున్నర కోట్ల సొంత ఖర్చుతో పాఠశాల నిర్మించిన కేటీఆర్
మంత్రి కేటీఆర్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. తన నానమ్మ ఫై ప్రేమతో.. రూ. రెండున్నర కోట్ల సొంత ఖర్చుతో పాఠశాల నిర్మించి వార్తల్లో నిలిచారు. కేటిఆర్ నాన్నమ్మ వెంకటమ్మ సోంతూరు బీబీపేట మండలం కోనపూర్. కాగా గత ఏడాది మే 10 వ తేదీన కామారెడ్డి జిల్లా కోనపూర్లో పర్యటించారు కేటీఆర్. ఆ సమయంలోనే తన సోంత డబ్బులతో పాఠశాల భవనానికి శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి రెగ్యూలర్గా మానిటర్ చేస్తూనే ఉన్నారు.గ్రామ శివారులోని ఎకరం భూమిలో కేటీఆర్ రూ.2.40 కోట్లు వెచ్చించి ఈ సర్కారు పాఠశాలని సర్వాంగ సుందరంగా నిర్మించారు. సకల వసతులతో కార్పొరేట్ బడి లా కనిపిస్తున్నది. బాల, బాలికల కోసం ప్రత్యేకంగా వేర్వేరుగా మరుగుదొడ్లు కట్టించారు. ప్ర తి తరగతి గదిలో ఫర్నిచర్ను సమకూర్చారు. కార్పొరేట్తరహా కుర్చీలు, బెంచీలను ఏర్పాటు చేస్తున్నారు. సమావేశాలకు ప్రత్యేకంగా మరో గదిని కూడా అందుబాటులోకి తీసుకువచ్చా రు. విద్యార్థుల ఉల్లాసం కోసం ప్రత్యేకంగా ఆటవస్తువులను ఏర్పాటు చేశారు.
* ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాలు
దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఢిల్లీలోపాటు రాజధాని ప్రాంతంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వానలకు నగరంలో యమునా (Yamuna River) నదికి వరద (Floods) పోటెత్తింది. నదిలో వరద ప్రవాహం ప్రమాద స్థాయికి చేరింది. అయితే హస్తినకు మరో ముప్పు పొంచిఉన్నది. రెండు రోజుల్లో ఢిల్లీని భారీ వరద తాకనుంది. ఇప్పటికే రాజధానిలో కురుస్తున్న వర్షాలతో ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోయాయి. వీటికి ఎగువ రాష్ట్రం నుంచి వచ్చే వరద తోడవనుంది.హర్యానాలో (Haryana) కుండపోతగా వర్షాలు కురుస్తుండటంతో ప్రభుత్వం హత్నికుండ్ బ్యారేజీ (Hathnikund barrage) గేట్లను ఎత్తివేసింది. తద్వారా లక్షా 5 వేల 453 క్యూసెక్కుల నీటిని ఆదివారం సాయంత్రం 4 గంటలకు దిగువకు విడుదల చేస్తున్నది. ఇది రెండు రోజుల్లో ఢిల్లీని తాకనుంది. అంటే మంగళవారం మధ్యాహ్నం వరకు యమునా నది ప్రమాద స్థాయికి మించి ప్రవహించనుంది. నగరంలోని ఓల్డ్ రైల్వే బ్రిడ్జి (Old Railway Bridge) వద్ద ప్రస్తుతం 203.18 మీటర్ల మేర వరద ప్రవహిస్తున్నదని సెంట్రల్ వాటర్ కమిషన్ (Central Water Commission) తెలిపింది. బ్రిడ్జి ప్రమాద స్థాయి 204.5 మీటర్లు అని అధికారులు తెలిపారు.
* పదేళ్లపాటు అటానమస్ గా OU ఇంజనీరింగ్ కళాశాల
TS: ఓయూలోని ఇంజనీరింగ్ కళాశాల ఏకంగా పదేళ్లపాటు UGC స్వయం ప్రతిపత్తి హోదాను సాధించింది. 1917లో ఈ కాలేజీని స్థాపించగా.. ఇప్పటికీ రెండు సార్లు అటానమస్ గుర్తింపు పొందింది. ఓయూకు న్యాక్ ఏ గుర్తింపు, ఇంజనీరింగ్ కళాశాలలో అన్ని బ్రాంచీలకు ఆరేళ్లపాటు నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ గుర్తింపు వంటి అంశాలను UGC పరిగణనలోకి తీసుకుంది. 2022-23 విద్యాసంవత్సరం నుంచి 2031-32 వరకు ఈ గుర్తింపు ఉండనుంది.
* టీడీపీ నేతల మాటలు జోకర్ల మాటల్ని తలపిస్తాయి
తూర్పు నియోజకవర్గంలో టీడీపీ నేతలు చేపట్టిన బస్సు యాత్ర అట్టర్ ఫ్లాప్ అయ్యిందని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జీ దేవినేని అవినాష్ విమర్శించారు. అసలు ఆ యాత్రలో టీడీపీ నేతల్ని పట్టించుకునే వారే లేరని ఎద్దేవా చేశారు. యాత్ర ఫ్లాప్ అవ్వడంతో.. టీడీపీ నేతలు పిచ్చిపట్టినట్టుగా వ్యవహరించారని దుయ్యబట్టారు. వైసీపీ నేతలను రెచ్చగొట్టే విధంగా.. 5వ డివిజన్లోని వైసీపీ కార్యలయం ముందు నానా హంగామా చేశారని మండిపడ్డారు. ఆఫీస్ వద్ద మందు తాగి, వైసీపీ నేతల్ని రెచ్చగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రోత్సాహంతోనే.. టీడీపి నేతలు ఆ విధంగా ప్రవర్తించారని ఆరోపించారు.
* పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్న వైస్సార్సీపీ నేతలు
ఏపీలో తాజాగా పవన్ కళ్యాణ్ రెండవ విడత వారాహి విజయయాత్రలో వాలంటీర్ల పై చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేగింది. పవన్ కళ్యాణ్ వాలంటీర్ల పై అనుచిత వ్యాఖ్యలు చేశారని తీవ్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ తీరుపై వైస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు.పవన్ కళ్యాణ్ మహిళా వాలంటీర్లను అవమానించాడని మంత్రి వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. ఏలూరు వారాహియాత్ర సభలో పవన్ చేసిన వ్యాఖ్యలు దారుణమని ఖండించారు. మహిళలకు పవన్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వాలంటీర్ల వ్యవస్థ దేశంలోనే ఎంతో గుర్తింపు పొందిందని అన్నారు. వాలంటీర్లను జనం తమ కుటుంబంలో సభ్యులుగా చూస్తున్నారని, పవన్ కళ్యాణ్ను జనం క్షమించరని ఆయన అన్నారు.