NRI-NRT

చికాగో మహిళను భారత్ తరలించేందుకు ఏర్పాట్లు

చికాగో మహిళను భారత్ తరలించేందుకు ఏర్పాట్లు

ఆకలితో అలమటిస్తూ అమెరికా వీధుల్లో బతుకీడుస్తున్న హైదరాబాదీ మహిళను ఆదుకునేందుకు చికాగోలోని భారతీయ కాన్సులేట్ ముందుకొచ్చింది. ఆమెకు వైద్య సాయం అందించడంతో పాటూ భారత్‌కు విమానంలో తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని శనివారం ప్రకటించింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగ్గానే ఉన్నట్టు వెల్లడించింది.

‘‘మిస్ సయీదా జైదీని కలిశాం. సాయం చేసేందుకు రెడీగా ఉన్నట్టు చెప్పాము. ఇది మాకు ఎంతో ఆనందం కలిగించింది. ఆమెకు వైద్య సాయంతో పాటూ భారత్‌కు తరలించేందుకు సిద్ధంగా ఉన్నాము. ఇండియాలోని ఆమె తల్లితో కూడా మాట్లాడాం. అయితే, ఆమె ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం సయీదా ఆరోగ్యం మెరుగ్గా ఉంది’’ అని కాన్సులేట్ ట్వీట్ చేసింది. పైచదువుల కోసం అమెరికా వెళ్లిన సయీదా జైదీ వీధుల పాలైనట్టు గతం వారం వెలుగులోకి వచ్చింది. ఆమె వస్తువులన్నీ దొంగతనానికి గురయ్యాయని, ఆమె తీవ్ర డిప్రెషన్‌లో కూరుకుపోయినట్టు బయటపడింది. మజ్లిస్ బచావో తెహ్రీక్ పార్టీ ప్రతినిధి అంజద్ ఉల్లా ఖాన్ యువతి దుస్థితి గురించి తొలిసారిగా ప్రపంచానికి తెలియజేశారు. దీంతో, యువతి తల్లి తమకు సాయం చేయాలంటూ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు లేఖ రాశారు. ఈ విషయంలో వెంటనే కల్పించుకుని బిడ్డను స్వదేశానికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.