Movies

నేడు రఘువరన్ బీటెక్ రీరిలీజ్

నేడు రఘువరన్ బీటెక్ రీరిలీజ్

ధనుష్ హీరోగా నటించిన ‘రఘువరన్ బీటెక్’ సినిమాను శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ తెలుగులో విడుదల చేశారన్న సంగతి తెలిసిందే. జనవరి 1, 2015న విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. నిజానికి ఈ సినిమా తమిళంలో జులై 18, 2014లోనే ‘వేలై ఇళ్ళ పట్టదారి’గా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. విద్యార్థుల భవితవ్యం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా, కాన్సెప్ట్ నచ్చడంతో ‘స్రవంతి’ రవికిశోర్ తెలుగులో విడుదల చేశారు. ఇక ఈ సినిమా అప్పట్లో తెలుగు ప్రేక్షకులకూ సినిమా నచ్చడమే కాదు, ధనుష్ కంటూ మార్కెట్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడీ సినిమాను శుక్రవారం నాడు అంటే (ఆగస్టు 18న) రీ రిలీజ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ… రెండు తెలుగు రాష్ట్రాల్లో వందకు పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. ఆంధ్ర, సీడెడ్, నైజాం… ప్రతి ఏరియాలో బుకింగ్స్ ఓపెన్ చేయడమే ఆలస్యం హౌస్ ఫుల్స్ అవుతున్నాయని ‘స్రవంతి’ రవికిశోర్ చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలో ‘రఘువరన్ బీటెక్’ రీ రిలీజ్ సందర్భంగా ‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ ”కొన్ని సినిమాలను ఎవర్ గ్రీన్ మూవీస్ అంటుంటామని, అటువంటి చిత్రమే ‘రఘువరన్ బీటెక్’ అని అన్నారు. ప్రతి తరంలోని విద్యార్థులకు కనెక్ట్ అయ్యే సినిమా ఇదన్న ఆయన స్టూడెంట్స్, వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్, కెరీర్ స్ట్రగుల్స్ గురించి బాగా డిస్కస్ చేశారని అన్నారు. ప్రముఖ దర్శకుడు కిశోర్ తిరుమల తెలుగు డైలాగ్స్ రాయగా డబ్బింగ్ డైలాగ్స్ తరహాలో కాకుండా ఆయన రాసిన మాటలన్నీ ఒరిజినల్ సినిమాకు రాసినట్టు రాశారని అప్పట్లో మంచి పేరు వచ్చింది. ప్రజెంట్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన అనిరుధ్ కెరీర్ స్టార్టింగ్‌లో చేసిన సినిమాల్లో ఇదీ ఒకటి. ఎక్స్‌ట్రాడినరీ సాంగ్స్ అందించగా రీ రికార్డింగ్ కూడా అద్భుతంగా ఉందని మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదు. ధనుష్ సరసన అమలాపాల్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో సురభి కీలక పాత్రలో నటించారు. ధనుష్ తల్లిదండ్రులుగా శరణ్య, సముద్రఖని నటించిన ఈ సినిమాలో వివేక్, హృషికేష్, అమితాష్ ప్రధాన్ ఇతర కీలక పాత్రల్లో నటించగా వేల్ రాజ్ దర్శకత్వం వహించారు.