Business

ఏపీ విద్యుత్ ఉద్యోగులకు తీపి కబురు

ఏపీ విద్యుత్ ఉద్యోగులకు తీపి కబురు

విద్యుత్‌ ఉద్యోగుల వేతన సవరణ కమిషన్‌ (పీఆర్సీ) ఖరారైంది. కొత్తగా అమల్లోకి రానున్న సింగల్‌ మాస్టర్‌ స్కేలుతో కూడిన పీఆర్సీ ఒప్పందంపై ఏపీజెన్‌కో, ఏపీట్రాన్స్‌కో, ఈపీడీసీఎల్, సీపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్‌ ఉన్నతాధికారులు, ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ పవర్‌ ఎంప్లాయిస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (ఏపీఎస్‌పీఈజేఏసీ) ప్రతినిధులు, పలు యూనియన్ల నాయకులు సంతకాలు చేసి పరస్పరం ఒప్పందాలను ఖరారు చేసుకున్నారు.

ఈ అగ్రిమెంట్‌ ప్రకారం కొత్త పీఆర్సీ గత ఏడాది ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఈ అగ్రిమెంట్‌ ప్రకారం విద్యుత్‌ సంస్థలు ఉద్యోగులకు 12 వాయిదాల్లో పీఆర్సీ బకాయిలు చెల్లిస్తాయి. కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగులకు 8 శాతం ఫిట్‌మెంట్‌ లభిస్తుంది. సింగల్‌ మాస్టర్‌ స్కేలు అనే కొత్త విధానం అమల్లోకి తేనున్న నేపథ్యంలో అధికారులు లోతుగా అధ్యయనం చేసి కొత్త స్కేళ్లు రూపొందించారు.పేస్కేళ్లలో అనామలీస్‌ ఉంటే సరిచేసేందుకు ట్రాన్స్‌కో జేఎండీ నేతృత్వంలో మూడు డిస్కంల సీఎండీలతో హెచ్‌ఆర్‌ కమిటీ ఏర్పాటు చేసినట్లు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్‌ తెలిపారు. దీంతో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేస్తూ పీఆర్సీ అగ్రిమెంట్‌పై సంతకాలు చేశారు. పెరిగిన పీఆర్సీతో 28 వేలకి పైగా ఉద్యోగులకి లబ్ధి చేకూరనుంది.