Editorials

నాగపంచమి ప్రత్యేకత

నాగపంచమి ప్రత్యేకత

శ్రావణ శుద్ధ పంచమి / నాగ పంచమి
నాగపంచమి విశిష్టత

సాక్షాత్తు పరమేశ్వరుడే “నాగపంచమి”నాడు భక్తులు ఆచరించాల్సిన విధులను పార్వతీ దేవికి వివరించినట్లుగా స్కాందపురాణం చెబుతోంది…

శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుడిని పూజించడం ఆచారం,
నాగ పంచమి రోజున నాగప్రతిమకు పంచామృతము, జాజి, సంపెంగ, గన్నేరు వంటి పుష్పాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసి, పాయసము నివేదించాలని ముక్కంటి.. శక్తి మాతకు వివరించినట్లు ఆ పురాణం పేర్కొంటుంది.

ముఖ్యంగా నాగపంచమి రోజున నాగేంద్రునికి పాలు, మిర్యాలు, పూలు పెట్టి పూజిస్తారు.

ఇంట్లో వెండి, రాగి, రాతి చెక్కలతో చేసిన నాగ పడిగెలకు భక్తులు అభిషేకం చేస్తారు.

సంతానం కలిగించే పుత్రదైకాదని సంతానం లేని భార్యభర్తలు భక్తి శ్రద్దలతో శ్రావణ శుక్ల 11వరోజైన ఏకాదశి రోజున ప్రత్యేక పూజలు చేసి ఉపవాసం చేసినట్లైతే సంతానభాగ్యం కలుగుతుందని పెద్దలు చెబుతారు…

దేవతారాధన, జపం, స్తోత్ర పారాయణం వంటివి చేయడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయని విశ్వాసం.

నాగపంచమి విశిష్టత

పూర్వకాలంలో ఒకానొక గ్రామంలో ఒక ధనవంతురాలు ఉండేది.
ఆమెకు ధనగర్వం గాని అహంకారం గాని లేని సుగుణవతి, విద్యా వినయంగల సౌజన్యురాలు. పెద్దలపట్ల వినయవిదేయతలతోను పనివారి పట్ల కరుణ, దయ సానుబూతిగల సద్గుణ సంపన్నురాలు .
ఈ సుగుణ వతికి ఒక తీరని బాధ వుండేది, చెవిలో చీము కారుతుండేది.
రాత్రులందు సర్పం కలలో కనబడి కాటు వేయబోతుండేది.
అందువల్ల ఆమె మనస్సులో ఎంతో కలవరపడుతుండేది.
ఎన్ని పూజలు చేసినా ఎన్ని శాంతులు చేయించినా కలలో పాములు కనబడడం కాటు వేయడం తగ్గలేదు.
తనకు కనబడిన వారందరికీ తన బాధలు చెప్పుకుని తరుణోపాయం చెప్పమని వేడుకునేది.
ఒకనాడు ఒక సాధువు వాళ్ళ ఊరుకు వచ్చాడు.
ఆ సాధువు త్రికాలజ్ఞానుడని విని అతని వద్దకు వెళ్ళి తన ఇంటికి పాద పూజకు ఆహ్వానించింది…

అతిధి మర్యాదలు పాద పూజలు సమారాధన గడిచాక ఆమె తన బాధలను చెప్పి ఇందుకు గల కారణమేమై ఉంటుందని, ఇవి తొలగే మార్గామేమిటని వినయపూర్వకముగా వేడుకున్నది.
అందుకు ఆ సాధువు తీవ్రంగా ఆలోచించి ఇది నీకు సర్పదోషంవల్ల సంభవించింది.
ఏమిచేసినా నాగేంద్రుని అనుగ్రహం నీకు సిద్దించడం లేదంటే, దానికి గల కారణం నీ వ్యాధి, భయాందోళనలు తొలగాలన్నదే నీ లక్షంగానే సుస్థిర భక్తితో ఆరాధించి శ్రద్దని చూపనందువల్ల నీకీ దుస్థితి నిన్నింకా వేధిస్తుంది.

నీవు గత జన్మలో నాగపూజ చేసే వారిని ఆక్షేపణ చేయడం నీవు పూజలు చేయకపోగా చేసేవారిని చెడగొట్టడం, చులకన చేయడం నీవు చేసిన మహాపరాధం అని తెలిపెను.

నాగేంద్రుడు దయామయుడు, తనను నమ్మినవారిని ఉద్దరించే కరుణా సముద్రుడు కనుక నీ విషయం పట్ల విశ్వాసముంచి నాగ పంచమి నోము నోచినట్లయితే నీ కలతలు తొలగుతాయి.
చెవి చక్క బడుతుందని చెప్పి ఆ వ్రత విధానము దాని నియమాలను గురించి వివరించి వెళ్ళిపోయెను.

ఆ సాధువు ఉపదేశించిన వ్రత విధాన క్రమమున ఎంతో భక్తి శ్రద్దలతో నాగపంచమి నోము నోచి ఆ వ్రత ప్రబావం వల్ల తన భయాందోళన లు తొలగి సంతోషముగా వున్నది.