Movies

రవితేజ సినిమా టీజర్‌పై ఏపీ హైకోర్టు అభ్యంతరం

రవితేజ సినిమా టీజర్‌పై ఏపీ హైకోర్టు అభ్యంతరం

‘టైగర్‌ నాగేశ్వరరావు’ సినిమా టీజర్‌లో వాడిన పదప్రయోగం ఓ సామాజిక వర్గాన్ని, స్టువర్టుపురం ప్రాంత వాసులను అవమానించేదిగా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. సెంట్రల్‌ బోర్డు ఫిల్మ్‌ సర్టిఫికెట్‌ లేకుండా టీజర్‌ ఎలా విడుదల చేస్తారని అభ్యంతరం తెలిపింది. సమాజం పట్ల బాధ్యతగా ఉండొద్దా? అని సినీ నిర్మాణ సంస్థను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇలాంటి టీజర్‌ ద్వారా సమాజానికి ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించింది. చిత్ర నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌కు నోటీసులు జారీచేసింది. మరోవైపు ముంబయిలోని సెంట్రల్‌ బోర్డు ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ ఛైర్‌పర్సన్‌ను వ్యాజ్యంలో ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్‌కు సూచించింది. అభ్యంతరాలపై ఛైర్‌పర్సన్‌కు ఫిర్యాదు చేసుకునేందుకు పిటిషనర్‌కు వెసులుబాటు ఇచ్చింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌, జస్టిస్‌ ఏవీ శేషసాయితో కూడిన ధర్మాసనం బుధవారం ఈమేరకు ఉత్తర్వులిచ్చింది. టైగర్‌ నాగేశ్వరరావు సినిమా ఎరుకల సామాజికవర్గ మనోభావాలను కించపరిచేదిగా ఉందని, స్టువర్టుపురం గ్రామప్రజల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉందంటూ చుక్కా పాల్‌రాజ్‌ హైకోర్టులో పిల్‌ వేశారు. బుధవారం జరిగిన విచారణలో పిటిషనర్‌ తరఫున న్యాయవాదులు అంకాళ్ల పృథ్వీరాజ్‌, శృంగారపాటి కార్తీక్‌ వాదనలు వినిపించారు.