Agriculture

నేడు ఏపీ కౌలు రైతులకు శుభవార్త

నేడు ఏపీ కౌలు రైతులకు శుభవార్త

దేశంలోనే తొలిసారిగా కౌలు రైతులతో పాటు దేవదాయ, అటవీ భూములను సాగు చేస్తున్న వాస్తవ సాగుదారులకు కూడా వైఎస్సార్‌ రైతు భరోసా పథకాన్ని వర్తింపచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 2023–24 సీజన్‌కు సంబంధించి తొలి విడత పెట్టుబడి సాయాన్ని గురువారం అందించనుంది.

పంట హక్కు సాగు పత్రాలు పొందిన వారిలో అర్హులైన 1,46,324 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులు, దేవదాయ భూము­లను సాగు చేస్తున్న రైతులకు ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున రూ.109.74 కోట్లు సాయం పంపిణీ చేయనున్నారు. నేడు ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి రైతుల ఖాతాలకు నేరుగా సాయాన్ని జమ చేయనున్నారు.

ఏటా మూడు దఫాల్లో..
రాష్ట్రంలో భూ యజమానులకు వైఎస్సార్‌ రైతు భరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున పెట్టు­బడి సాయాన్ని ప్రభుత్వం అందిస్తున్న విషయం తెలిసిందే. మే నెలలో రూ.7,500, అక్టోబర్‌లో రూ.4 వేలు, జనవరిలో రూ.2 వేలు చొప్పున మూడు విడతల్లో ఈ సాయాన్ని జమ చేస్తోŠంది. అదేవిధంగా దేశంలో ఎక్కడా లేనివిధంగా భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలు రైతుల కుటుంబాలతో పాటు దేవదాయ, అటవీ భూమి సాగుదారులకు కూడా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే అందచేస్తోంది.

ఐదో ఏడాది తొలి విడతగా తాజాగా అందచేస్తున్న సాయంతో కూడా కలిపితే ఇప్పటివరకు 5,38,227 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులు, 3,99,321 మంది అటవీ భూమి సాగుదారులకు (ఆర్వో­ఎఫ్‌ఆర్‌ పట్టాదారులు) మొత్తం రూ.1,122.85 కోట్ల పెట్టుబడి సాయం అందించినట్లు కానుంది. ఇక మొత్తంగా అందరికీ కలిపి ఇప్పటి వరకు పథకం ద్వారా 52.57 లక్షల రైతు కుటుంబాలకు రూ.31,005.04 కోట్ల మేర పెట్టుబడి సాయాన్ని అందించినట్లవుతోంది.