Politics

సునీల్ యాదవ్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు

సునీల్ యాదవ్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్‌కు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. సునీల్‌ యాదవ్‌ తండ్రి కృష్ణయ్య పులివెందులలో మరణించడంతో అంతిమ సంస్కారాలకు రెండు వారాల మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని హైకోర్టును సునీల్‌ యాదవ్‌ కోరారు. పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు శని, ఆదివారం, తర్వాత ఈనెల 17,18 తేదీల్లో ఇద్దరు ఎస్కార్ట్‌ సిబ్బంది, వాహనంతో పులివెందుల వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. వాహనం, ఎస్కార్ట్ సిబ్బంది ఖర్చును సునీల్ యాదవే భరించాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న సునీల్‌ యాదవ్‌ మధ్యంతర బెయిల్‌ గడువు ముగియగానే కోర్టులో లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించింది. పూర్తి బెయిల్‌ ఇవ్వాలంటూ సునీల్‌ యాదవ్‌ గతంలో దాఖలుచేసిన పిటిషన్‌పై ఇవాళ వాదనలు జరిగాయి. దర్యాప్తు పూర్తయినందున బెయిల్‌ ఇవ్వాలని నిందితుడి తరఫు న్యాయవాది కోరగా.. దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున జైల్లోనే ఉంచాలని సీబీఐ వాదించింది. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు.. సునీల్‌ యాదవ్‌ బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌ చేసింది.