ScienceAndTech

“X” ఇక ఉచితం కాదు

“X” ఇక ఉచితం కాదు

ట్విటర్‌లో (ప్రస్తుతం ఎక్స్‌) ఇప్పటికే ఎన్నో మార్పులు చేపట్టిన ఆ సంస్థ అధినేత ఎలాన్‌ మస్క్‌ తాజాగా మరో మార్పునకు సిద్ధమవుతున్నారు. ఇకపై ఎక్స్‌ వాడాలంటే ప్రతి యూజర్‌ ఎంతో కొంత చెల్లించాల్సిందే. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుతో చర్చిస్తున్న సందర్భంగా తన మనసులో మాటను బయటపెట్టారు. ఎక్స్‌ను వాడే వారు ప్రతి నెలా ‘స్వల్ప మొత్తం’ చెల్లించాల్సి ఉంటుందని మస్క్‌ పేర్కొన్నారు. ఈ నిర్ణయం వెనక ఓ కారణం ఉందని మస్క్‌ తెలిపారు. ఎక్స్‌లో ఉన్న బాట్స్‌ను తొలగించేందుకు ఇదే సరైన మార్గమని చెప్పారు. ప్రస్తుతం ఎక్స్‌లో 550 మిలియన్‌ నెలవారీ యూజర్లు ఉండగా.. సగటున రోజుకు 100-200 మిలియన్‌ పోస్టులు పెడుతుంటారని చెప్పారు. ఇందులో బాట్స్‌ కూడా ఉన్నాయని చెప్పారు. బాట్స్‌ను తొలగించాలంటే స్వల్ప మొత్తంలోనైనా ఫీజు వసూలు చేయడం అవసరమంటూ మస్క్‌ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. దీనివల్ల బాట్స్‌కు అడ్డుకట్ట వేయడానికి వీలవుతుందన్నారు. ట్విటర్‌ కొనుగోలు సమయంలోనూ బాట్స్‌ గురించి మస్క్‌ ప్రస్తావించిన సంగతి తెలిసిందే.