Food

కుళ్లిన మాంసంతో కీమా తయారు చేసేస్తున్నారు

కుళ్లిన మాంసంతో కీమా తయారు చేసేస్తున్నారు

ఉదయాన్నే తాజా మాంసంతో తయారు చేసిన కీమా తిందామని తిరుమలగిరికి చెందిన ఓ కుటుంబం సికింద్రాబాద్‌లోని ప్రముఖ హోటల్‌కు వెళ్లింది. సిబ్బందికి చెప్పగానే వేడి వేడి కీమాను గిన్నెల్లో వడ్డించారు. ఆ కుటుంబం తినగా.. తేడా కొట్టింది. ముద్దను నమలగానే.. పాచిపోయిన వాసనొచ్చింది. వెంటనే వాళ్లు జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు చేశారు.

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఎదురుగా ఉన్న ఆల్ఫా హోటల్‌లో కుళ్లిన మాంసంతో వంటలు తయారు చేస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల ద్వారా జీహెచ్‌ఎంసీకి ఐదు రోజుల క్రితం ఫిర్యాదు చేరింది. అధికారులు పట్టించుకోలేదు. ఆరోగ్య విభాగం అదనపు కమిషనర్‌ కార్యాలయం ఆగ్రహం వ్యక్తం చేశాకే.. అధికారులు హోటల్‌ను తనిఖీ చేసి సీజ్‌ చేశారు.

నగరంలోని ప్రముఖ హోటళ్ల నుంచి రోడ్లపై నడిచే తోపుడు బండ్ల వరకు.. దాదాపు సగం యజమానులు నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వట్లేదు. నాసిరకం టమాటా, చిల్లీ సాస్‌లు, రసాయనాలతో తయారైన అల్లం-వెల్లుల్లి ముద్ద, రంపపు పొట్టుతో తయారైన పసుపు, కషాయాన్ని తలపించే కారం పొడి, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌లో ముంచిన యాలకులు, లవంగాల వంటి మసాలా దినుసులను వంటగదికి తీసుకెళ్తున్నారు. కిలోలకొద్దీ కొనుగోలు చేసిన మాంసాన్ని రోజుల తరబడి రిఫ్రిజిరేటర్లలో భద్రపరుస్తున్నారు. కూరలు, చెట్నీలు రోజుల తరబడి నిల్వ చేస్తున్నారు. కొన్ని హోటళ్లలో ప్రత్యేక వంటల పేరుతో.. దాచిపెట్టిన బిర్యానీ వంటకాలను ఓవెన్‌లో వేడి చేసి వడ్డిస్తున్నారు. వాటిని ఆరగించిన వారు జ్వరం, వాంతులు, విరేచనాలకు గురవుతున్నారు. కల్తీ, పాచిపోయిన ఆహారంతో దీర్ఘకాలంలో ప్రజారోగ్యంపై మరింత ప్రభావం చూపనుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.