Agriculture

నేడు రంగారెడ్డి జిల్లాలో విజయ మెగా డైరీ ప్రారంభం

నేడు రంగారెడ్డి జిల్లాలో విజయ మెగా డైరీ ప్రారంభం

రాష్ట్రంలో పాల ఉత్పత్తి, ప్రాసెసింగ్‌ పెంపుదలే లక్ష్యంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన విజయ మెగా డెయిరీ ప్లాంట్‌ ప్రారంభానికి సిద్ధమైంది. రంగారెడ్డి జిల్లా రావిర్యాల గ్రామ (ఇమారత్‌ కంచ) పరిధిలోని 40 ఎకరాల విస్తీర్ణంలో రూ.250 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. ఈ మెగా డెయిరీని గురువారం రాష్ట్ర మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డ్‌ (ఎన్‌డీడీబీ) సహకారంతో రోజూ 5 లక్షల నుంచి 8 లక్షల లీటర్ల పాల ప్రాసెసింగ్‌ సామర్థ్యంతో దేశంలోనే అత్యాధునిక, పూర్తిస్థాయి ఆటోమిషన్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీతో దీనిని నిర్మించారు. ఈ డెయిరీ నిర్వహణకు మొత్తంగా సోలార్‌ విద్యుత్తునే వినియోగించనున్నారు. సోలార్‌ విద్యుదుత్పత్తి వ్యవస్థతోపాటు, వ్యర్థాల వినియోగంతో విద్యుత్తును ఉత్పత్తి చేసేలా ఏర్పాట్లు కూడా చేశారు. ఈ మెగా డెయిరీ ఏర్పాటుతో రాష్ట్రంలోని సుమారు లక్ష మంది పాడి రైతులకు ప్రయోజనం కలుగనున్నది. సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవతోనే విజయ డెయిరీ వృద్ధిలోకి వచ్చిందని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు.