విజయ్ (Vijay) కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘లియో’(LEO) అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబరు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఓ ఆసక్తికర చర్చ సామాజిక మాధ్యమాల వేదికగా నడుస్తోంది.
2005లో విడుదలైన హాలీవుడ్ ఫిల్మ్ ‘ఏ హౌస్ ఆఫ్ వైలెన్స్’ను స్ఫూర్తిగా తీసుకుని ‘లియో’ను తీర్చిదిద్దినట్లు టాక్. తాజాగా యూకేలో ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో ‘లియో’కు పలు కట్స్ చెప్పడంతో నాలుగు నిమిషాల నిడివి తగ్గింది. ఈ క్రమంలోనే ప్లాట్లైన్ కూడా రివీల్ చేశారు. ‘చరిత్రలో అత్యంత క్రూరమైన హింసా సామ్రాజ్యంలో గడిపిన ఓ వ్యక్తి కొన్ని కారణాల వల్ల దాని నుంచి బయటకు వచ్చేస్తాడు. ప్రస్తుతం కెఫేను నడుపుకొంటూ కుటుంబంతో హాయిగా జీవిస్తున్న అతడి జీవితంలో కొందరు హంతకులు ప్రవేశిస్తారు. వాళ్ల రాకతో అతడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? ఇంతకీ లియోదాస్ గతంలో ఏం చేసేవాడు? ఆ హింసా సామ్రాజ్యం నుంచి ఎలా బయటపడ్డాడు? మళ్లీ కత్తిపట్టాడా? లేదా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
మరోవైపు ఈ సినిమాలో రామ్చరణ్ అతిథి పాత్రలో నటిస్తారని టాక్ వినిపిస్తోంది. ‘విక్రమ్’లో రోలెక్స్లా ‘కోబ్రా’ పేరుతో ఆయన పాత్రను పరిచయం చేస్తారని చెబుతున్నారు. అయితే, దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి స్పష్టతా లేదు. నిజంగా ఈ సినిమాలో రామ్చరణ్ నటిస్తున్నారా? లేదా? తెలియాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే. ఇక తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలవుతున్న ‘లియో’లో త్రిష, అర్జున్, సంజయ్ దత్, గౌతమ్ వాసుదేవ్ మేనన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమిళంలో ఈ సినిమాను ఐమ్యాక్స్ వెర్షన్లోనూ విడుదల చేస్తున్నారు.
👉 – Please join our whatsapp channel here