Politics

పొన్నాలతో కేటీఆర్‌ భేటీ

పొన్నాలతో కేటీఆర్‌ భేటీ

సీనియర్‌ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు భారాస నుంచి ఆహ్వానం అందింది. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన పొన్నాల లక్ష్మయ్య ఇంటికి శనివారం భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ వెళ్లి.. పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ఎమ్మెల్యే దానం నాగేందర్‌, దాసోజు శ్రవణ్‌తో కేటీఆర్‌.. హైదరాబాద్‌లోని పొన్నాల నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా పొన్నాల నివాసం వద్దకు ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. జనగామ గడ్డ.. పొన్నాల అడ్డా అంటూ నినాదాలు చేశారు.

పొన్నాలకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తాం: మంత్రి కేటీఆర్‌

మాజీ మంత్రి పొన్నాలతో భేటీ అనంతరం కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి పీసీసీ అధ్యక్షుడు, సీనియర్‌ రాజకీయ వేత్త పొన్నాల లక్ష్మయ్యను సీఎం కేసీఆర్‌ సూచన మేరకు భారాసలోకి ఆహ్వానించాం. పొన్నాల ఆదివారం సీఎం కేసీఆర్‌ను కలుస్తారు. జనగామలో జరిగే బహిరంగ సభలో భారాసలో చేరాలని కోరగా సుముఖత వ్యక్తం చేశారు. ఆదివారం సీఎంతో మాట్లాడిన తర్వాత తన నిర్ణయం ప్రకటిస్తానని పొన్నాల చెప్పారు. బలహీనవర్గాలకు చెందిన అనేక మంది నాయకులకు ఇప్పటికే సీఎం కేసీఆర్‌ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. పొన్నాల లక్ష్మయ్యకు పార్టీలో సముచిత గౌరవం, ప్రాధాన్యం ఇస్తామని సీఎం చెప్పారు. 1960లోనే అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేసి.. నాసా లాంటి అంతర్జాతీయ సంస్థల్లో ఇంజినీర్‌గా పనిచేసిన వ్యక్తి పొన్నాల. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఆహ్వానం మేరకు కాంగ్రెస్‌ పార్టీలో చేరి సుదీర్ఘకాలం పాటు ప్రజాసేవ చేశారు’’ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

రేవంత్‌రెడ్డి ఎన్ని పార్టీలు మారలేదు..
‘‘వయసులో పెద్ద, అనుభవంలో పెద్ద, బలహీన వర్గాలకు చెందిన సీనియర్‌ నాయకుడిని పట్టుకుని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తూలనాడిన విధానం దిగజారుడు సంస్కారానికి నిదర్శనం. చచ్చే ముందు పార్టీ మారడం అనడమేంది? ఎవరు ఎప్పుడు చనిపోతారో ఎవరికి తెలుసు? ఇది మంచి పద్ధతి కాదు. ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఎన్ని పార్టీలు మారాడు? మొదట భాజపా- ఆర్‌ఎస్‌ఎస్‌, తర్వాత టీఆర్‌ఎస్‌, ఆ తర్వాత తెలుగుదేశం, ఇప్పుడు కాంగ్రెస్‌.. రేపు.. ఏ పార్టీలోకి వెళ్తారో ఎవరికీ తెలియదు. అలాంటి వ్యక్తి కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే చూసే వాళ్లు నవ్వుకుంటున్నారు. కనకపు సింహాసనంపై ఓటుకు నోటు కేసు దొంగను కూర్చోబెట్టారు. కాంగ్రెస్‌ పార్టీ.. సీనియర్‌ నేతలకు కనీసం అపాయింట్‌ మెంట్‌, గౌరవం కూడా ఇవ్వడంలేదు’’ అని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు.

👉 – Please join our whatsapp channel here

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z