* మార్కెట్లకు పండుగల జోష్
దేశంలో పండుగ సీజన్ కొనసాగుతున్నది. రాబోయే రోజుల్లో పెళ్లిళ్ల సీజన్ మొదలుకానున్నది. ఈ క్రమంలో దేశంలోని మార్కెట్లన్నీ సందడిగా మారనున్నాయి. అయితే, ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి రూ.8.5లక్షల కోట్ల టర్నోవర్ ఉంటుందని.. 60కోట్లకుపైగా వినియోగదారులు కొనుగోళ్లు జరుపనున్నట్లు అంచనా. విశేషం ఏటంటే ఈ సారి చైనీస్ ఉత్పత్తులు విక్రయించడం లేదని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే రూ.90వేలకోట్ల ఆన్లైన్ వ్యాపారం కంటే దుకాణాల్లోనే వ్యాపారం తొమ్మిది రెట్లు అధికంగా జరుగునుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) జనరల్ సెక్రటరీ ప్రవీణ్ ఖండేల్వాల్ పేర్కొన్నారు.ఇంతకు ముందు చైనీస్ వస్తువులకు డిమాండ్ తగ్గిందని, గతంలో వినియోగదారులు ఆయా ఉత్పత్తులను కావాలని డిమాండ్ చేసే వారని.. వాటిని కొనుగోలు చేయడం మానేశారని పేర్కొన్నారు. రక్షాబంధన్తో మొదలైన పండుగ సీజన్లో దాదాపు రూ.3లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని, ఆ తర్వాత పెళ్లిళ్ల సీజన్లో రూ.4.25లక్షల కోట్లు, క్రిస్మస్తో పాటు న్యూ ఇయర్లో రూ.2.25లక్షల కోట్ల వ్యాపారం జరుగనున్నది.దీంతో దేశ రిటైల్ పరిశ్రమ కొత్త ఊపునిచ్చినట్లేనని.. దాంతో మార్కెట్ సెంటిమెంట్ పెరగడంతో పాటు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. క్యాటరింగర్పై అత్యధికంగా జనం 30శాతం ఖర్చు చేస్తుండగా.. వ్యాపారంలో దాదాపు 8శాతం బంగారం, వెండిపై.. 10శాతం బహుమతులు, ఆరుశాతం అలంకరణ వస్తువులు, 30శాతం ఫుడ్, క్యాటరింగ్, 10శాతం ఎలక్ట్రానిక్స్పై ఖర్చు చేస్తున్నట్లు క్యాట్ చైర్మన్ బీసీ భారతీయా తెలిపారు. 10శాతం బట్టలు, 5శాతం ఫర్నిషింగ్, ఆరుశాతం ఈవెంట్ మేనేజ్మెంట్, 10శాతం ఇతర వస్తువుల కొనుగోలుపై వినియోగదారులు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
* నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
భారీ నష్టాలతో స్టాక్మార్కెట్లు భారీ నష్ట3లతో ముగిశాయి. సెన్సెక్స్ 826 పాయింట్ల నష్టంతో 64,572 వద్ద ముగిశాయి. నిఫ్టీ 261 పాయింట్ల నష్టంతో 19,281 వద్ద ముగిసింది. 2 నుంచి 3 శాతం వరకు మెటల్, ఐటీ, రియాల్టీ, విద్యుత్, ఇంధన రంగాల షేర్లు నష్టపోయాయి. 1 నుంచి 2 శాతం వరకు ఆటో, బ్యాంక్, FMCG, ఫార్మా రంగాల షేర్లు నష్టపోయాయి.
* నేడు గ్యాస్ సిలిండర్ ధరలు
వాణిజ్య, గృహ వినియోగ సిలిండర్ ధరను ప్రతి నెల ఒకటో తేదీన సమీక్షించి సవరిస్తుంటారు.నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. అయితే ఇటీవల చాలా రోజులకు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించి కాస్త ఊరటనిచ్చారు.హైదరాబాద్: రూ. 955,వరంగల్: రూ. 974,విశాఖపట్నం: రూ. 912,విజయవాడ: రూ. 927,గుంటూర్: రూ. 944.
* ఇన్ఫోసిస్ దసరా బొనాంజ
దసరా వేడుకల సందర్భంగా దేశీ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) ఉద్యోగులకు తీపికబురు అందించింది. నవంబర్ 1 నుంచి ఉద్యోగులకు వేతన పెంపు చేపట్టనుంది. కంపెనీ హెచ్ఆర్ చీఫ్ షజి మ్యాథ్యూ టౌన్హాల్ మీటింగ్ సందర్భంగా ఈ విషయం వెల్లడించారు. గత కొద్దినెలలుగా ఇన్ఫోసిస్ వార్షిక వేతన పెంపును వాయిదా వేస్తున్న క్రమంలో కంపెనీ ఈ ప్రకటన చేయడంతో టెకీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఇన్ఫోసిస్ సహజంగా సీనియర్ మేనేజ్మెంట్ దిగువన ఉద్యోగులకు ఏటా ఏప్రిల్లో, ఇతరులకు జులైలో వేతన పెంపు చేపడుతుంది. ఐటీ పరిశ్రమలో ప్రతికూల పరిస్ధితుల దృష్ట్యా ఈ ఏడాది వేతన పెంపును కంపెనీ వాయిదా వేస్తూ వచ్చింది. వేతన పెంపును వాయిదా వేసేందుకు కంపెనీలో నెలకొన్న సామర్ధ్య లేమి కారణమని ఇన్వెస్టర్ కాల్ సందర్భంగా ఇన్ఫోసిస్ సీఎఫ్వో నిలంజన్ రాయ్ చెప్పుకొచ్చారు.ఈ చర్యలతో కంపెనీ మార్జిన్లలో 50 బేసిస్ పాయింట్ల మెరుగుదల సాధ్యమైందని అన్నారు. ఇక ఈ ఏడాది వేతన పెంపుతో పాటు ఉద్యోగుల సేవలను మెరుగైన రీతిలో వాడుకోవడం, ఈ ఏడాది క్యాంపస్ రిక్రూట్మెంట్కు చెక్ పెట్టడం వంటి చర్యలు ఇన్ఫోసిస్ చేపడుతోంది.
* ఎఫ్ఎంసీజీ ప్రొడక్టులకు తగ్గిన డిమాండ్
ధరలు ఎక్కువగా ఉండటం (ఇన్ఫ్లేషన్), వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో సెప్టెంబరు క్వార్టర్లో గ్రామీణ ప్రాంతాల్లో సబ్బులు, షాంపూలు, బిస్కెట్ల వంటి ఎఫ్ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్) ప్రొడక్టులకు గిరాకీ తగ్గింది. ఈ పరిశ్రమకు ఆపరేటింగ్ వాతావరణం కఠినంగానే ఉంది. టీ, డిటర్జెంట్ వంటి మాస్ మార్కెట్ ఉత్పత్తుల విషయంలో చిన్న, ప్రాంతీయ/స్థానిక కంపెనీల నుంచి విపరీతమైన పోటీ ఉంటోంది. అయితే జూన్ క్వార్టర్లో మాత్రం ఈ కంపెనీలు భారీగా సంపాదించాయి.హెచ్యూఎల్, ఐటీసీ, నెస్లే వంటి ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీలు గోధుమ, మైదా, చక్కెర, బంగాళాదుంప, కాఫీ మొదలైన కొన్ని వస్తువుల ధరలు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశాయి. వర్షాలు లేకపోవడంతో గ్రామీణ డిమాండ్పై ఇన్ఫ్లేషన్ ప్రభావం చూపింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితుల కారణంగా “ధరలపై ప్రతికూల ప్రభావం” పడుతుందని నెస్లే ఇండియా కూడా తెలిపింది. వర్షాల లోటు వల్ల మొక్కజొన్న, చక్కెర, నూనె గింజలు, సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిపై ప్రభావం ఉంటుందని, ధరలు పెరగవచ్చని నెస్లే ఇండియా పేర్కొంది. అయితే సెప్టెంబర్ క్వార్టర్లో పట్టణ మార్కెట్లో అమ్మకాలు బాగానే ఉన్నాయని ఈ సంస్థలు తెలిపాయి. ఆధునిక కమర్షియల్ ఛానెల్స్, పెద్ద ప్యాక్లు ఎక్కువగా కొనడం ఇందుకు కారణాలు. ఎఫ్ఎంసీజీ తయారీదారులకు ఈ–కామర్స్ కూడా ఎంతో మేలు చేస్తోంది.
* పండుగ సీజన్లో ఆ కార్లపై ఆఫర్ల జాతర
ఈ పండుగ సీజన్లో సిట్రియెన్ సీ3 ఐదేళ్ల పొడిగించిన వారెంటీతో పాటు ఇతర ప్రయోజనాలతో కలిపి రూ. 99,000 తగ్గింపును అందిస్తుంది. అలాగే ఈ కారు కొనుగోలుపై ఆకర్షణీయమైన ఈఎంఐ సదుపాయాలు కూడా ఉన్నాయి. సీ 3 కారు గతేడాది లాంచ్ అయ్యింది. ఈ కారు ధర రూ. 6.16 లక్షల నుంచి రూ. 8.92 లక్షల వరకూ ఉంటుంది. ఈ కారు రెండు ఇంజిన్ ట్రిమ్లతో లభిస్తుంది.గ్రాండ్ ఐ10 నియోస్ అనేది హ్యుందాయ్ కంపెనీకు చెందిన ఎంట్రీ-లెవల్ కారు. ఈ పండుగ సీజన్లో ఈ కారు దాదాపు రూ. 50,000 తగ్గింపుతో వస్తుంది. ఈ డీల్లో రూ.30,000 క్యాష్ ఆఫర్, రూ.10,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉన్నాయి. సెలెక్టివ్ వేరియంట్లపై కార్పొరేట్ డీల్స్ కూడా ఉన్నాయి. గ్రాండ్ ఐ10 నియోస్ ప్రారంభ ధర రూ. 5.84 లక్షల నుంచి రూ. 8.51 లక్షల వరకు ఉంటుంది.రెనాల్ట్ క్విడ్ 2015లో రిలీజైంది. ఈ కారు మార్కెట్లో మంచి ఆదరణ పొందింది. ఈ కారు రూ.50,000 వరకు తగ్గింపును అందిస్తుంది. ఇందులో రూ.20,000 క్యాష్ ఆఫర్, మరో 20,000 ఎక్స్ఛేంజ్ పాలసీ, రూ.10,000 వరకు కార్పొరేట్ బోనస్ ఉన్నాయి. ఈ కారు ధర రూ. 4.70 లక్షల నుంచి రూ. 6.45 లక్షల వరకు ఉంటుంది.మారుతి సుజుకి సెలెరియోపై కూడా అదిరిపోయే తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. సెలెరియోను 2021లో విడుదలైంది. పెట్రోల్, సీఎన్జీ వేరియంట్స్పై రూ. 59,000 వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. రూ. 35,000 క్యాష్ డిస్కౌంట్తో పాటు రూ. 20,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్, రూ. 4,000 కార్పొరేట్ ఆఫర్లు ఉన్నాయి. కస్టమర్లు అక్టోబర్ 2023లో సెలెరియోను బుక్ చేసుకుంటే ఈ బండిల్ డీల్ను ఎంచుకోవచ్చు. ఈ కారు ప్రారంభ ధర రూ. 5.37 లక్షల నుంచి రూ. 7.15 లక్షల వరకు ఉంటుంది.అత్యంత ప్రజాధరణ పొందిన కంపెనీల్లో మొదటిదైన మారుతి సుజుకీ రిలీజ్ చేసిన ఇగ్నిస్ కారు అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ సీజన్లో ఈ కారు రూ. 70,000 తగ్గింపుతో వస్తుంది. ఇందులో రూ. 35,000 నగదు ఒప్పందంతో పాటు రూ. 25,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్, రూ. 10,000 కార్పొరేట్ బోనస్ ఉన్నాయి. ఇగ్నిస్ మారుతి ప్రీమియం బ్రాండ్ నెక్సా కింద అందుబాటులో ఉంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 5.84 లక్షల నుంచి రూ. 8.30 లక్షల మధ్య లభించింది. ఈ కారు 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా 5-స్పీడ్ ఏఎంటీతో వస్తుంది.
* నేడు పెట్రోల్ డీజిల్ ధరలు
ప్రస్తుతం మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు గరిష్ఠ స్థాయిల్లోనే కొనసాగుతున్నాయి. దీంతో వాహనదారులపై అదనపు భారం పడుతోందని చెప్పవచ్చు .గత కొన్ని నెలలుగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పెట్రోల్ – డీజిల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి.హైదరాబాద్..లీటర్ పెట్రోల్ ధర రూ.109.66,లీటర్ డీజిల్ ధర రూ.98.31,విశాఖపట్నం..లీటర్ పెట్రోల్ ధర రూ. 110.48,లీటర్ డీజిల్ ధర రూ. 98.విజయవాడ..లీటర్ పెట్రోల్ ధర రూ. 111.76.
* దేశంలోనే తొలి సీఎన్జీ బైక్
కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్(సీఎన్జీ) తక్కువ ధర, పూర్తి పర్యావరణ హిత ఇంధనం. పైగా అధిక మైలేజీ ఇస్తుంది. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిళ్లకు మంచి ప్రత్యామ్నాయంగా మారింది. ఎలక్ట్రిక్ వాహనాలతో సవాళ్లను ఎదుర్కోలేని వారు ఈ సీఎన్జీ వాహనాలవైపు మొగ్గుచూపుతున్నారు. పైగా ఈ సీఎన్జీ వాహనాలు డ్యూయల్ ఫ్యూయల్ వేరియంట్లుగా మార్కెట్లోకి వస్తున్నాయి. అంటే సీఎన్జీతో పాటు పెట్రోల్ తో కూడా కారు నడుస్తుంది. అంటే కారులో ఉండే ఒకే ఇంజిన్ అటు సీఎన్జీతో పాటు పెట్రోల్ కూడా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ తరహా కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటి వరకూ ఈ సీఎన్జీ వేరియంట్లో కార్లు, బస్సులు, ఆటోలు ఎక్కువగా మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. ఇప్పటి వరకూ ద్విచక్ర వాహనాల్లో సీఎన్జీ వేరియంట్ ఏదీ లేదు. అయితే రానున్న కొద్ది రోజుల్లో బజాజ్ కంపెనీ నుంచి ఓ సీఎన్జీ బైక్ రానుందని తెలుస్తోంది. ఇప్పటికే దానికి సంబంధించిన అభివృద్ధి పనులు కూడా పూర్తి చేసినట్లు సమాచారం. అది కూడా బజాజ్ 110 సీసీ ప్లాటినా బైక్ ఈ సీఎన్జీ వేరియంట్లో రానున్నట్లు చెబుతున్నారు. ఇది కూడా డ్యూయల్ ఫ్యూయల్ వేరియంట్ గానే తీసుకొస్తున్నారు. అంటే సీఎన్జీతో పాటు పెట్రోల్ పై కూడా ఈ బైక్ నడవగలుగుతుంది.
👉 – Please join our whatsapp channel here –