రణ్బీర్ కపూర్ (Ranbir Kapoor), అలియా భట్ నటించిన ‘బ్రహ్మాస్త్రం: శివ-పార్ట్1’ మంచి టాక్ను సొంతం చేసుకుంది. దీంతో దేవ్: పార్ట్-2పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా దీనికి సంబంధించిన కీలక అప్డేట్ను రణ్బీర్ కపూర్ పంచుకున్నారు. అలాగే మొదటి భాగంపై కూడా ఆసక్తికర కామెంట్స్ చేశారు.‘‘బ్రహ్మాస్త్రం పార్ట్2కు సంబంధించిన రైటింగ్ వర్క్ జరుగుతోంది. దీని గురించి గతవారమే అయాన్ ముఖర్జీ నాతో చర్చించారు. మొదటి భాగంతో పోలిస్తే.. ఈ భాగం 10రెట్లు ఆసక్తిగా ఉండనుంది. ప్రస్తుతం అయాన్ ముఖర్జీ ‘వార్-2’ పనుల్లో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాదిలో ‘వార్-2’ పూర్తవుతుంది. దాని తర్వాత 2025 ప్రారంభంలో ‘బ్రహ్మాస్త్రం-2’ షూటింగ్ మొదలుపెట్టాలని భావిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులన్నీ పూర్తయ్యాయి. మొదటి భాగంపై వచ్చిన కొన్ని విమర్శలను టీమ్ దృష్టిలో పెట్టుకుంది. అందులో శివ, ఇషాల మధ్య కెమిస్ట్రీ సరిగా లేదని డైలాగులు మెరుగ్గా ఉండొచ్చని కొందరు భావించారు. వాటన్నిటినీ పరిగణనలోకి తీసుకున్నాం. అలాగే నిర్మాణపరమైన లోపాలను కూడా సరిచేసుకోవాలని ప్రయత్నిస్తున్నాం’’అని చెప్పారు.అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన ‘బ్రహ్మాస్త్రం’ గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కళ్లు చెదిరే గ్రాఫిక్స్ హంగులతో ఆకట్టుకుంది. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, నాగార్జున వంటి స్టార్ నటులు ఇందులో కీలకపాత్రల్లో కనిపించారు. అలాగే దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమాను స్వయంగా సమర్పించారు. ఇక ఈ చిత్రం మొత్తం మూడు భాగాల్లో రానుంది.
👉 – Please join our whatsapp channel here –