Devotional

శ్రీవారి ఆలయంలో శ్రీ పద్మావతి అమ్మవారి వాహన సేవలు

శ్రీవారి ఆలయంలో శ్రీ పద్మావతి అమ్మవారి వాహన సేవలు

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవ వాహన సేవల తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వాహన సేవలను వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి తెలిపారు. తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో మంగ‌ళ‌వారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీటీడీ ఛైర్మన్ కరుణాకర రెడ్డి మీడియాతో మాట్లాడారు. అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ముందుగా జరిగే కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించినట్లు తెలిపారు. నవంబరు 9న అంకురార్పణ, 10న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. 14న అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన గజవాహన సేవకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఎక్కువ మంది భక్తులు దర్శించుకునేలా అధికారులు చక్కటి ప్రణాళికల్ని రూపొందించారని స్పష్టం చేశారు. 18న పంచమితీర్థానికి విశేషంగా భక్తులు తరలివచ్చి కోనేరులో పుణ్యస్నానాలు చేస్తారని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. దాదాపు రూ.9 కోట్లతో పంష్కరిణిని ఆధునీకరించి నీటితో నింపారని వెల్లడించారు. ఇకపోతే మంగళవారం ఆలయంలో ఉదయం 6 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించారు.ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.

15 పరదాలు విరాళం…….ఇకపోతే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి చైర్మన్ కరుణాకర రెడ్డి చేతుల మీదుగా భక్తులు 15 పరదాలను విరాళంగా అందించారు. హైదరాబాద్‌కు చెందిన స్వర్ణ కుమార్ రెడ్డి 11, గుంటూరుకు చెందిన అరుణ్ కుమార్, పద్మావతి, తిరుచానూరుకు చెందిన పవిత్ర,రజిని ఒక్కొక్కటి చొప్పున నాలుగు పరదాలను విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు యానాదయ్య, నాగసత్యం, సుబ్బరాజు, జేఈవో వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, విజివో బాలిరెడ్డి, ఏఈవో రమేష్, పాంచరాత్ర ఆగమసలహాదారుశ్రీనివాసాచార్యులు, సూపరింటెండెంట్లు శ్రీవాణి, శేషగిరి, అర్చకులు బాబుస్వామి, వేంపల్లి శ్రీను స్వామి, మణికంఠ స్వామి, సీఐ శివప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z