పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ రెండో వారంలో ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 3న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. అనంతరం రెండో వారంలో పార్లమెంట్ వింటర్ సెషన్ మొదలై క్రిస్మస్ పండుగకు ముందు ముగియనుంది. పార్లమెంట్ విశ్వసనీయ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.
ఈ సమావేశాల్లో ఐపీసీ (IPC), సీఆర్పీసీ (CrPC), ఎవిడెన్స్ యాక్ట్ల సవరణలకు సంబంధించిన బిల్లులు చర్చకు రానున్నాయి. ఈ బిల్లులకు సంబంధించిన మూడు నివేదికలు ఇప్పటికే కేంద్ర హోంశాఖ స్టాండింగ్ కమిటీకి చేరాయి. అదేవిధంగా పార్లమెంట్లో పెండింగ్లో ఉన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర ఎలక్షన్ కమిషనర్ల నియామకానికి సంబంధించిన బిల్లులపై కూడా ఈ సమావేశాల్లో చర్చ జరుగనుంది.
వాస్తవానికి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రతి ఏడాది నవంబర్ మూడో వారంలో ప్రారంభమై డిసెంబర్ 25న జరిగే క్రిస్మస్ పండుగకు ముందు ముగుస్తాయి. కానీ, ఈసారి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆలస్యంగా పార్లమెంట్ వింటర్ సెషన్ మొదలవుతున్నది.