Politics

మౌలిక వసతులు కల్పించకపోవడం క్షమించరాని నేరం

మౌలిక వసతులు కల్పించకపోవడం క్షమించరాని నేరం

మరోసారి ఏపీ సర్కార్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటు పురంధేశ్వరి.. గుంటూరు పర్యటనలో ఉన్న ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రం ఇచ్చిన 1600 కోట్ల రూపాయలతో మంగళగిరి ప్రాంతంలో ఎయిడ్స్ హాస్పిటల్ నిర్మాణం చేశారు.. పది రూపాయల ఖర్చుతో అత్యంత నాణ్యమైన వైద్యం అందించేందుకు కేంద్రం ముందుకు వచ్చింది.. కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ అడ్డంగా ఉన్న విద్యుత్ తీగలు కూడా పక్కకు తొలగించలేదు, కనీసం తాగునీరు కూడా ఏర్పాటు చేయలేకపోయింది.. పేదవాళ్లకు సేవ చేసే సంస్థకు, మౌలిక వసతులు కల్పించకపోవడం క్షమించరాని నేరం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

భారత ప్రధాని నరేంద్ర మోడీ అవినీతి రహిత, సమర్థవంత పాలన అందిస్తున్నారు.. బీజేపీ పాలనలో ఒక స్కాం కూడా లేదన్నారు పురంధేశ్వరి.. అణగారిన వర్గాల వారికి మేలు చేయాలన్న భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం ఆధారంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.. కరోనా లేక పోయిన పేదలకు గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కార్యక్రమం అమలు చేస్తున్నాం.. పేదలకు భరోసా కల్పిస్తూ, ఇన్సూరెన్స్ పాలసీ, పేదలకు పక్కా గృహాలు అందిస్తున్నాం అన్నారు. ప్రత్యేక ఆంధ్ర ఏర్పడిన తర్వాత కేంద్రం పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది… ఏపీకి భారీ స్థాయిలో నిధులు కేటాయించారు.. ఏపీలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి కేంద్రమే నిధులు ఇస్తుందన్నారు.

ఇక, ఏపీ ప్రభుత్వానికి అప్పులు చేసే విషయంలో ఉన్న శ్రద్ధ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విషయంలో లేదు అని విమర్శించారు పురంధేశ్వరి.. ఒక పెద్ద పరిశ్రమ రాష్ట్రానికి రాలేదు.. మన పిల్లలకు ఉపాధి కల్పించే పరిస్థితి లేదు, రోడ్లు అధ్వానంగా ఉన్నాయి.. గ్రామీణ అభివృద్ధికి తిలోదకాలు ఇచ్చారు.. కేంద్రం ఇస్తున్న నిధులను దారి మళ్లించి జేబులు నింపుకోవడం తప్ప వైసీపీ నాయకులకు అభివృద్ధి మీద దృష్టి లేదంటూ ధ్వజమెత్తారు. ఏపీ నీడ్స్ జగన్ పేరుతో ప్రజల దగ్గరికి వెళ్తున్న నాయకులు ప్రజలకు వాస్తవాలు చెప్పాలని సూచించారు. గ్రామ సచివాలయాలు ఏర్పాటు కూడా కేంద్రం ఇస్తున్న ఉపాధి హామీ పథకం కింద నిర్మించారు అనే విషయాన్ని ప్రజలు గుర్తించుకోవాలన్నారు. అమరావతి రాజధాని రైతులు ఇచ్చిన భూములకు కౌలు కూడా ఇవ్వడం లేదు.. అమరావతి వెళ్లిపోయింది అనే బాధతో ఆందోళన చేస్తున్న మహిళలను, పోలీసులు అడ్డుపెట్టుకొని ఈ ప్రభుత్వం వేధించిందన్నారు. అమరావతి రాజధానిగా ఉంటుందన్న ఆలోచనతో 20 వేల కోట్ల రూపాయలతో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనంతపురం- అమరావతి హైవే రోడ్డును 28 వేల కోట్ల రూపాయలతో కేంద్రం ఖరారు చేసింది.. చివరకు ఆ రోడ్లకు భూములు సేకరించే పని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సరిగా చేయడం లేదన్నారు. విభజన సమయంలో ఎన్జీరంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ లాం లో ఏర్పాటు చేసేందుకు నిధులు ఇచ్చారు.. గతంలో టీడీపీ సరిగా పట్టించుకోకపోవడం వల్ల 350 కోట్ల నిధులు వెనక్కి వెళ్లాయని.. ఒంగోలు జాతి పసుసంపదను అభివృద్ధి చేసేందుకు మరిన్ని పరిశోధనలు జరగాలని ఆకాక్షించారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z