Politics

తెలంగాణ బీజేపీ మేనిఫెస్టో విడుదల

తెలంగాణ బీజేపీ మేనిఫెస్టో విడుదల

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ భాజపా (BJP) మేనిఫెస్టోను కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా (Amit shah) శనివారం రాత్రి హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘మన మోదీ గ్యారంటీ.. భాజపా భరోసా’ పేరుతో మేనిఫెస్టోను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే పథకాలు చక్కగా అమలవుతాయన్నారు. (Telangana Elections) గతంలో వాజయ్‌పేయీ ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలను ఏర్పాటు చేసినా ఎలాంటి వివాదాలు లేవని, తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్‌ సరిగా వ్యవహరించలేదని విమర్శించారు. ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణకు కేంద్రం రూ.2.15 లక్షల కోట్లు ఇచ్చిందన్నారు. తెలంగాణకు పసుపు బోర్డు, గిరిజన వర్సిటీని ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించారన్నారు. తెలుగు రాష్ట్రాలకు 3 వందేభారత్‌ రైళ్లు కేటాయించామని గుర్తు చేశారు. కరోనా సమయంలో దేశమంతా ఉచితంగా రేషన్‌ ఇచ్చామన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. కాళేశ్వరం రూపంలో నిధులన్నీ కేసీఆర్‌కు చేరాయని అమిత్‌ షా ఆరోపించారు.

మేనిఫెస్టోలోని కీలక అంశాలివే..

* ధరణి స్థానంలో ‘మీ భూమి’ యాప్‌
* పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గింపు.
* భారాస ప్రభుత్వం కుంభకోణాలపై విచారణకు కమిటీ ఏర్పాటు.
* గల్ఫ్‌ బాధితుల కోసం ప్రత్యేక నోడల్‌ విభాగం ఏర్పాటు.
* ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రతి నెలా 1న వేతనాలు, పింఛన్లు.
* మత రిజర్వేషన్లు తొలగించి.. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెంపు.
* ఉమ్మడి పౌరస్మృతి ముసాయిదా కమిటీ ఏర్పాటు.
* అర్హత కలిగిన కుటుంబాలకు కొత్త రేషన్‌ కార్డులు.
* ఎరువులు, విత్తనాల కొనుగోలు కోసం రూ.2,500 ఇన్‌పుట్‌ సబ్సిడీ.
* పీఎం ఫసల్‌బీమా యోజన కింద రైతులకు ఉచిత పంటల బీమా.
* వరికి రూ.3,100 మద్దతు ధర.
* పసుపు కోసం మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ ఫండ్‌ ఏర్పాటు.
* ఆసక్తిగల రైతులకు ఉచితంగా దేశీ ఆవుల పంపిణీ.
* నిజామాబాద్‌ను టర్మరిక్‌ సిటీగా అభివృద్ధి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z