అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ భాజపా (BJP) మేనిఫెస్టోను కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit shah) శనివారం రాత్రి హైదరాబాద్లో విడుదల చేశారు. ‘మన మోదీ గ్యారంటీ.. భాజపా భరోసా’ పేరుతో మేనిఫెస్టోను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే పథకాలు చక్కగా అమలవుతాయన్నారు. (Telangana Elections) గతంలో వాజయ్పేయీ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను ఏర్పాటు చేసినా ఎలాంటి వివాదాలు లేవని, తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ సరిగా వ్యవహరించలేదని విమర్శించారు. ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణకు కేంద్రం రూ.2.15 లక్షల కోట్లు ఇచ్చిందన్నారు. తెలంగాణకు పసుపు బోర్డు, గిరిజన వర్సిటీని ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించారన్నారు. తెలుగు రాష్ట్రాలకు 3 వందేభారత్ రైళ్లు కేటాయించామని గుర్తు చేశారు. కరోనా సమయంలో దేశమంతా ఉచితంగా రేషన్ ఇచ్చామన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. కాళేశ్వరం రూపంలో నిధులన్నీ కేసీఆర్కు చేరాయని అమిత్ షా ఆరోపించారు.
మేనిఫెస్టోలోని కీలక అంశాలివే..
* ధరణి స్థానంలో ‘మీ భూమి’ యాప్
* పెట్రోల్, డీజిల్పై వ్యాట్ తగ్గింపు.
* భారాస ప్రభుత్వం కుంభకోణాలపై విచారణకు కమిటీ ఏర్పాటు.
* గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక నోడల్ విభాగం ఏర్పాటు.
* ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రతి నెలా 1న వేతనాలు, పింఛన్లు.
* మత రిజర్వేషన్లు తొలగించి.. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెంపు.
* ఉమ్మడి పౌరస్మృతి ముసాయిదా కమిటీ ఏర్పాటు.
* అర్హత కలిగిన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు.
* ఎరువులు, విత్తనాల కొనుగోలు కోసం రూ.2,500 ఇన్పుట్ సబ్సిడీ.
* పీఎం ఫసల్బీమా యోజన కింద రైతులకు ఉచిత పంటల బీమా.
* వరికి రూ.3,100 మద్దతు ధర.
* పసుపు కోసం మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఏర్పాటు.
* ఆసక్తిగల రైతులకు ఉచితంగా దేశీ ఆవుల పంపిణీ.
* నిజామాబాద్ను టర్మరిక్ సిటీగా అభివృద్ధి.
👉 – Please join our whatsapp channel here –