ఇజ్రాయెల్ (Israel) దాడుల్లో తీవ్రంగా నష్టపోయి.. సాయం కోసం ఎదురుచూస్తున్న పాలస్తీనాలోని గాజా (Palestina) ప్రజలను ఆదుకునేందుకు భారత్ మరోసారి సిద్ధమైంది. ఔషధాలు, విపత్తు సహాయ సామగ్రిని ఆదివారం గాజా (Gaza)కు పంపినట్లు భారత్ విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ (S Jaishankar) ఎక్స్ వేదికగా వెల్లడించారు.
భారత్ వైమానిక దళానికి చెందిన రెండవ సీ17 విమానం 32 టన్నుల సామగ్రిని తీసుకు వెళ్తోందని తెలిపారు. ఈ సామగ్రి ముందుగా ఈజిప్టులోని ఈఎల్-అరిష్ విమానాశ్రయానికి చేరుకుంటుంది. అక్కడి నుంచి రఫా సరిహద్దు గుండా గాజాకు తీసుకెళ్తారు. యుద్ధం కారణంగా అక్కడి రహదారులన్నీ పూర్తిగా ధ్వంసం అయ్యాయి. దీంతో పాలస్తీనా ప్రజలకు మానవతా సాయాన్ని చేరవేసేందుకు ఉన్న ఏకైక మార్గం రఫా సరిహద్దు మాత్రమే.ఔషధాలు, ఇతర సామగ్రితో ఇప్పటికే విమానం బయలుదేరినట్లు జైశంకర్ తెలిపారు. ‘‘పాలస్తీనా ప్రజలకు మానవతా సాయం అందించడాన్ని కొనసాగిస్తున్నాం’’ అని పోస్టు పెట్టారు. దీంతో పాటు కొన్ని ఫొటోలను కూడా షేర్ చేశారు. అక్టోబరులోనూ గాజాకు భారత్ మానవతా సాయాన్ని పంపించింది. ప్రాణాధార ఔషధాలు, గుడారాలు, శస్త్రచికిత్స వస్తువులు, శానిటరీ యుటిలిటీస్ ,టార్పాలిన్లు, స్లీపింగ్ బ్యాగ్స్, నీటి శుద్ధీకరణ మాత్రలు ఇతర వస్తువులతో కూడిన 6.5 టన్నుల సామగ్రిని గాజాకు చేర్చింది.
ఇదిలా ఉండగా.. హమాస్ ఉగ్రవాదులను ఏరిపారేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేసింది. ఉత్తర గాజానే కాకుండా దక్షణ గాజాపై కూడా ఐడీఎఫ్ దళాలు విరుచుకుపడుతున్నాయి. దీంతో గాజాలోనే అతి పెద్దదైన అల్-షిఫా ఆస్పత్రి నుంచి రోగులు, పౌరులు పశ్చిమ ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.
👉 – Please join our whatsapp channel here –