సరిగ్గా 15 ఏళ్ల క్రితం ఇదే రోజున భారత్ అత్యంత హేయమైన ఉగ్రదాడిని ఎదుర్కొందని ప్రధాని మోదీ (PM Modi) గుర్తుచేశారు. ఆ దాడి నుంచి కోలుకుని, ధైర్యంగా ఉగ్రవాదాన్ని అణచివేయడం భారత్ సామర్థ్యానికి నిదర్శనమని తెలిపారు. ముంబయి ఉగ్రదాడి జరిగి 15 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆ నాటి ఘటన గురించి ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ (Mann Ki Baat)లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ఘటనలో చనిపోయిన వారికి నివాళి అర్పించారు. ఈ దాడిలో అమరులైన వారి త్యాగాలను దేశం ఎప్పటికీ మర్చిపోదని అన్నారు. ‘‘నవంబరు 26 ఉగ్రదాడిని దేశం ఎప్పటికీ మరువదు. ఆ రోజు దేశం అత్యంత దారుణమైన ఉగ్రదాడిని ఎదుర్కొంది. ఆ దాడితో ముంబయి వణికిపోయింది. కానీ, దేశం ఆ ఉగ్రదాడి నుంచి పూర్తి సామర్థ్యంతో కోలుకుని, ధైర్యసాహసాలతో ఉగ్రవాదాన్ని అణచివేస్తోంది’’ అని ప్రధాని మోదీ అన్నారు.
బెజ్జిపురం యూత్ క్లబ్ సేవలు ప్రశంసనీయం
నైపుణ్యాభివృద్ధి ప్రాముఖ్యాన్ని ప్రపంచం మొత్తం గుర్తించింది. ఒక వ్యక్తికి మనం నైపుణ్యంలో శిక్షణ ఇస్తున్నామంటే వారికి మనం ఉపాధి కల్పిస్తున్నట్లేనని ప్రధాని మోదీ అన్నారు. ఈ సందర్భంగా గత నాలుగు దశాబ్దాలుగా నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇస్తున్న ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా బెజ్జిపురం యూత్ క్లబ్ సేవలను ప్రధాని ప్రశంసించారు.
మేకిన్ ఇండియాకు మద్దతు పెరిగింది
దేశ ప్రజలంతా తమ విధులను సరిగా నిర్వహించడం వల్ల దేశాన్ని అభివృద్ది పథంలోకి తీసుకెళ్లొచ్చని ప్రధాని తెలిపారు. గత పండగ సీజన్లో దేశంలో స్థానిక ఉత్పత్తులకు సంబంధించి రూ.4 కోట్ల వ్యాపారం జరిగిందని, భారత్లో తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేయాలనే స్పృహ ప్రజల్లో పెరిగిందనేందుకు ఇది నిదర్శనమని అన్నారు. అలాగే, పండగ సీజన్ కొనుగోళ్లలో ఎక్కువగా యూపీఐ ద్వారా చెల్లింపులు చేయడం డిజిటల్ చెల్లింపుల్లో దేశం సాధించిన పురోగతికి తార్కాణమని ప్రధాని పేర్కొన్నారు.
దేశంలోని కొన్ని ఉన్నత కుటుంబాల వారు విదేశాల్లో వివాహ వేడుకలు చేసుకోవడాన్ని ప్రధాని ప్రస్తావించారు. ‘‘ఈ పెళ్లిళ్ల సీజన్లో దేశ వ్యాప్తంగా రూ. 5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. పెళ్లి షాపింగ్లో స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రజలకు నా విజ్ఞప్తి. చాలా కాలంగా వివాహం కోసం ఇతర దేశాలకు వెళ్లడం నన్ను కలవరపెడుతోంది. దీని గురించి నా కుటుంబసభ్యులతో (దేశ ప్రజలు) కాకపోతే ఇంకెవరితో చెప్తాను. విదేశాల్లో పెళ్లి చేసుకోవడం అవసరమా? దాని గురించి మీరంతా ఒకసారి ఆలోచించాలి. పేద కుటుంబాల వారు కూడా తమ పిల్లలకు ‘లోకల్ ఫర్ వోకల్’ ప్రాధాన్యం గురించి చెబుతున్నారు. విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకునే ఉన్నత కుటుంబాల వారు దీని గురించి ఆలోచించాలని నా విజ్ఞప్తి. మీరు భారత్లో వివాహాలు చేసుకోవడం వల్ల ‘లోకల్ ఫర్ వోకల్’కు ఎంతో మద్దతు ఇచ్చినట్లవుతుంది’’ అని ప్రధాని తెలిపారు.
ప్రతి జిల్లాలో అమృత్ సరోవర్లు
ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్లలో నీటి ఎద్దడి కూడా ఒకటి. ప్రజలంతా సమష్టిగా కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చనేందుకు ఉదాహరణ గుజరాత్లోని అమ్రేలిలో నిర్మించిన అమృత్ సరోవర్. వీటిని దేశంలోని ప్రతి జిల్లాలో నిర్మించాలని ప్రధాని మోదీ కోరారు.
నవంబరు 26కు మరో ప్రాముఖ్యత కూడా ఉందని మోదీ గుర్తుచేశారు. 1949లో ఇదే రోజున భారత రాజ్యాంగం ఆమోదం పొందిందని తెలిపారు. ‘‘2015లో డా బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాలను మనం నిర్వహించుకున్నాం. అప్పుడే నవంబరు 26ను రాజ్యాంగ దినోత్సవంగా జరపాలనే ఆలోచన వచ్చింది. దాన్ని అమలు చేశాం’’ అని ప్రధాని వెల్లడించారు.
👉 – Please join our whatsapp channel here –