‘గురు’ సినిమాతో అందరికీ చేరువయ్యారు నటి ‘రితికా సింగ్’ (Ritika Singh). ప్రస్తుతం రజనీకాంత్ (Rajinikanth) హీరోగా టి.జి జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో ‘తలైవా 170’ (వర్కింగ్ టైటిల్) నటిస్తున్నారు. దీని చిత్రీకరణలో రితికా సింగ్కు గాయాలయ్యాయి. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టా వేదికగా తెలిపారు. ఫైట్ సీన్ను చిత్రీకరిస్తుండగా గాయపడినట్టు పేర్కొన్నారు.
‘జాగ్రత్తగా ఉండమని సెట్లో అందరూ చెబుతూనే ఉన్నారు. కానీ, గాజు అద్దాన్ని నేను సరిగ్గా పట్టుకోలేకపోయాను. దాంతో ఇలా జరిగింది. అంతా క్షణాల్లో జరిగిపోయింది. కొన్నిసార్లు రెప్పపాటులో జరిగే వాటిని మనం ఆపలేం. ఈ గాయం వల్ల నేను షూటింగ్ నుంచి విరామం తీసుకుంటున్నా. ప్రస్తుతానికి నొప్పి లేదు. అయినా కొన్ని గాజు ముక్కలు లోతుగా దిగాయి. అందుకే ఆసుపత్రికి వెళ్లాను. పూర్తిగా తగ్గిన తర్వాత తిరిగి షూటింగ్లో పాల్గొంటాను’ అని రితికా తన ఇన్స్టాలో పంచుకున్నారు.
ఇక రజనీకాంత్ 170వ (Thalaivar 170) సినిమాగా ఇది తెరకెక్కుతోంది. అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతోన్న ఈ చిత్రంలో మంజూ వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. అలాగే అగ్ర కథానాయకులు కూడా ఇందులో భాగం కానున్నారు. అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి ఈ సినిమాలో కీలకపాత్రల్లో కనిపించనున్నారు. కార్మికుల జీవితాల నేపథ్యంలో సాగనున్నట్లు సమాచారం. 2024 ఏప్రిల్లో దీన్ని విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.
👉 – Please join our whatsapp channel here –