Agriculture

ఇండియా ఎగుమతుల్లో కీలక పరిణామం

ఇండియా ఎగుమతుల్లో కీలక పరిణామం

ప్రపంచ దేశాలు ఆర్థిక మాంద్యంతో సతమతమవుతున్నాయి. భారత్‌ మాత్రం ఎగుమతుల జోరుతో ముందుకు సాగుతోంది. గత ఏడాదికన్నా ప్రస్తుత సంవత్సరంలో అధిక ఎగుమతులు సాధించింది. చాలా దేశాల ఆర్థిక వ్యవస్థల్లో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ, ఇండియా ఎగుమతుల్లో ముందడుగు వేయడం కీలక పరిణామం.

దేశీయ వ్యవసాయోత్పత్తుల ఎగుమతులు రానున్న రోజుల్లో రెట్టింపు అవుతాయని అంచనా వేస్తున్నట్లు కేంద్ర వాణిజ్య కార్యదర్శి సునీల్‌ భర్తావాల్‌ చెప్పారు. ఇటీవల జరిగిన ‘ఇండస్‌ఫుడ్‌ షో 2024’ కార్యక్రమంలో భర్తావాల్‌ పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం రూ.4 లక్షలకోట్లుగా ఉన్న వ్యవసాయ ఎగుమతులు 2030 సంవత్సరానికల్లా దాదాపు రూ.8 లక్షలకోట్ల​కు చేరుతాయని భావిస్తున్నట్లు తెలిపారు. రెడీ-టూ-ఈట్‌ ఫుడ్‌ తదితర విభాగాల్లో అపార అవకాశాలు ఉన్నాయని, దిగుమతి దేశాల అవసరాలకు అనుగుణంగా సాంకేతిక ప్రమాణాల్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టాలని పరిశ్రమలకు సూచించారు. ఈ షోను ఆన్‌లైన్‌ ద్వారా ప్రారంభించిన వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్‌ గోయల్‌ మాట్లాడుతూ బియ్యం, గోధుమ, చక్కెర తదితర ఎగుమతులపై నియంత్రణలు విధించినప్పటికీ, వాటి ఎగుమతి పెరిగిందన్నారు.

ప్రపంచ దేశాల్లో భారత్‌ ఎనిమిదో అతిపెద్ద వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి దేశంగా ఉంది. 2022-23 మొదటి మూడు త్రైమాసికాల్లో ప్రధాన వ్యవసాయ దిగుబడులు, శుద్ధి చేసిన ఉత్పత్తుల ఎగుమతుల్లో 12శాతం వృద్ధి నమోదైంది. వీటి ఎగుమతుల్లో అమెరికా, యూఏఈ, చైనా మొదటి వరుసలో ఉన్నాయి. ప్రపంచ దేశాలు బియ్యం దిగుమతుల కోసం భారత్‌ నుంచి వివరాలు సేకరిస్తున్న సమయంలో కొత్తగా యూరప్‌ దేశాలతోపాటు ఈజిప్టు ఈ జాబితాలో చేరింది. ఈజిప్టు ఇప్పటి వరకు 25 వేల టన్నుల బియ్యం కోసం భారత్‌ను టెండరు కోరింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z