Agriculture

‘మిర్చి’కి తెగుళ్ల పోటు

‘మిర్చి’కి తెగుళ్ల పోటు

రాష్ట్రంలో మిర్చి పంటకు నల్ల తామర, ఆకుముడత, మచ్చ, కాయకుళ్లు, కొమ్మ ఎండు, వేరుకుళ్లు తెగుళ్లు సోకుతున్నాయి. చలికాలం ఆరంభం నుంచి తెగుళ్ల ఉద్ధృతి వల్ల కాత, పూత దెబ్బతినడంతో పాటు కాయలు రాలిపోతున్నాయి. కొమ్మలు ఎండుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 18 జిల్లాల్లో 9 లక్షల ఎకరాల్లో మిర్చి సాగవుతోంది. ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో అత్యధికంగా సాగు చేస్తున్నారు. వీటితో పాటు మంచిర్యాల, కరీంనగర్‌, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్‌, నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, సిద్దిపేట జిల్లాల్లోనూ పంట సాగవుతోంది. గత నాలుగేళ్లుగా మంచి ధర పలుకుతుండటంతో.. పంట సాగుపై రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు.

సాధారణ రకంతో పాటు తేజ, చపాటా, వండర్‌హాట్‌, యూస్‌ తదితర రకాలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. చపాటాకు గతేడాది భౌగోళిక గుర్తింపు(జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌) కూడా దక్కింది. ప్రస్తుత సీజన్‌లో నిరుడు సెప్టెంబరులో పంట వేయగా.. ఎదుగుదల దశలో తెగుళ్ల బెడద మొదలైంది. ఈసారి చలి ఎక్కువగా ఉండటంతో వాటి తీవ్రత పెరిగింది. కొన్నిచోట్ల ఆకుముడత, మచ్చ తెగుళ్ల వల్ల పంటలో ఎదుగుదల లేదు. ఆకులు పెళుసుగా మారడం, కొమ్మలు ఎండిపోవడం, కాయ ఎండిపోవడం, రాలిపోవడం జరుగుతోంది. కాయ ఎదిగిన తర్వాత నల్లతామరతో రంగు మారి రాలిపోవడంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఈసారి దిగుబడులు భారీగా తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు మూడు లక్షల ఎకరాల్లో పంటపై తెగుళ్ల ప్రభావం ఉంది.

ఈ ఏడాది విత్తనాల ధరలు, సాగు వ్యయం, కూలీల ఖర్చులు పెరగడం వల్ల ఎకరానికి రూ.లక్ష వరకు ఖర్చయిందని.. ప్రస్తుతం పెట్టుబడి కూడా తిరిగొచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెగుళ్ల నివారణకు నిర్దిష్ట పురుగు మందులు లేకపోవడంతో ఇతర పంటలకు వాడేవే రైతులు వాడుతున్నారు. పంట యాజమాన్య పద్ధతులపై రైతులకు అధికారులు పెద్దగా దిశానిర్దేశం చేయకపోవడంతో ప్రైవేటు కంపెనీలు లాభాల కోసం అనేక రకాల పురుగు మందులను సిఫారసు చేస్తుండడంతో వాటిని వాడి మరింత నష్టపోతున్నారు. పంట వేసిన మొదట్లో ఆకు ముడత వైరస్‌కు వాహకంగా ఉండే తెల్లదోమ, నవంబరు తర్వాత నల్లతామర(త్రిప్స్‌ వైరస్‌) వల్ల దిగుబడి గణనీయంగా తగ్గుతోందని మహబూబాబాద్‌ జిల్లా మల్యాలలోని ఉద్యాన పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త భాస్కర్‌ తెలిపారు.

రూ.లక్ష పెట్టుబడి పెట్టి ఎకరం విస్తీర్ణంలో మిర్చి వేశాను. అక్టోబరు వరకు పంట బాగుంది. ఆ తర్వాత వరుసగా తెగుళ్లు మొదలయ్యాయి. పంట రోజుకు కొంత దెబ్బతింటూ వచ్చింది. చీడపీడల నివారణకు వివిధ రకాల మందులు వాడినా ఫలితం లేదు.

మేం మూడెకరాల్లో మిర్చి సాగు చేశాం. చీడపీడలు తీవ్రం కావడంతో ఒక్క ఎకరం మాత్రమే పంట చేతికొచ్చింది. నిరుడు 50 మంది కూలీలను పెట్టి పంట ఏరితే.. ఇప్పుడు పది మందే సరిపోయారు. గతేడాది రూ.4 లక్షల వరకు ఆదాయం వచ్చింది. ఈసారి పెట్టిన పెట్టుబడి రూ.2 లక్షలు కూడా చేతికొచ్చే పరిస్థితి లేదు. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z