Politics

గంజాయి నిర్మూలనపై ఒక్క రోజైనా సీఎం సమీక్ష నిర్వహించారా?

గంజాయి నిర్మూలనపై ఒక్క రోజైనా సీఎం సమీక్ష నిర్వహించారా?

రాష్ట్రంలో అన్ని రంగాలను సీఎం జగన్‌ రివర్స్‌ గేర్‌లో పెట్టారని.. ఆయన మాత్రం దేశంలోనే అత్యంత ధనవంతుడిగా ఎదిగారని తెదేపా అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. వైకాపా ప్రభుత్వ పాలనలో పేదలు సంక్రాంతి పండగను కూడా చేసుకోలేని పరిస్థితి తలెత్తిందని విమర్శించారు. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు పండగ సమయంలో ఉచితంగా సరకులిచ్చామని గుర్తుచేశారు. తమ హయాంలో పేదల కోసం అన్న క్యాంటీన్‌లను తీసుకొచ్చి రూ.5కే పేదల కడుపు నింపామని చెప్పారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో నిర్వహించిన ‘రా.. కదలి రా’ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

‘‘పేదల బలహీనతను ఆసరా చేసుకుని వైకాపా ప్రభుత్వం దోచుకుంటోంది. అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధమని జగన్‌ చెప్పారు. నిషేధం చేయకపోతే ఓట్లు అడగనన్నారు. ఇవాళ అనేక రకాల మద్యం తీసుకొచ్చి పేదలను దోచుకుంటున్నారు. జగన్‌ అప్పుల పాపారావు.. విపరీతంగా అప్పులు చేశారు. రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్‌గా మార్చేశారు. పిల్లలకు దాన్ని అలవాటు చేశారు. గంజాయి నిర్మూలనపై ఒక్క రోజైనా సీఎం సమీక్ష నిర్వహించారా?

వైకాపా అధికారంలోకి వచ్చాక 9సార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచారు. ఇప్పుడు కరెంటు రాదు.. ధరలు మాత్రం పెరుగుతూనే ఉంటాయి. తెదేపా తప్పకుండా అధికారంలోకి వస్తుంది.. ఛార్జీలు తగ్గిస్తాం. సౌర, పవన విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకొస్తాం. వినూత్న ఆలోచనలు, పద్ధతులతో ఖర్చులు తగ్గించే ప్రయత్నం చేస్తాం. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా యువతను మోసం చేశారు. తెదేపా అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు ఇస్తాం. నిరుద్యోగులకు రూ.3వేల భృతి చెల్లిస్తాం. జగన్‌ చెప్పేవన్నీ అసత్యాలే. అధికారంలోకి వచ్చాక పింఛన్‌ రూ.3వేల ఇస్తామని.. జగన్‌ మాట తప్పారు. 2019లో తెదేపా అధికారంలోకి వచ్చి ఉంటే మొదటి నుంచే రూ.3వేలు ఇచ్చేవాళ్లం. వైకాపాకు ఓటేస్తే మళ్లీ అందరినీ బానిసలుగా మారుస్తారు’’ అని చంద్రబాబు అన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z