DailyDose

స్కూటీలో ₹87లక్షలు…మార్గదర్శి సిబ్బందిపై కేసు-CrimeNews-Apr 07 2024

స్కూటీలో ₹87లక్షలు…మార్గదర్శి సిబ్బందిపై కేసు-CrimeNews-Apr 07 2024

* విప్లవ గీతాలకు ఆకర్షితుడై, నమ్మిన సిద్ధాంతం కోసం 23 ఏళ్ల క్రితం అడవిబాట పట్టిన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం అంకుషాపూర్‌కు చెందిన మావోయిస్టు అన్నె సంతోష్‌ అలియాస్‌ సాగర్‌ ప్రస్థానం ముగిసింది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లా ఊసూర్‌ బ్లాక్‌ పూజారి కాంకేర్‌ సమీపంలోని కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో శనివారం పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో అన్నె సంతోష్‌ అలియాస్‌ సాగర్‌ మృతి చెందాడు. ఈ మేరకు బీజాపూర్‌ పోలీసులతో పాటు కాటారం డీఎస్పీ గడ్డం రామ్మోహన్‌రెడ్డి.. సంతోష్‌ మృతిని నిర్ధారించారు.

* నగరంలోని పాతబస్తీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్పుకుని ఆర్‌ఎస్‌ఐ బాలేశ్వర్‌ ఆత్మహత్యకు చేసుకున్నాడు. కాగా, బాలేశ్వర్‌ నాగర్‌ కర్నూల్‌కు చెందిన వ్యక్తి అని తెలిసింది.

* ప్రేమించిన అమ్మాయి దక్కలేదనే మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మనోహరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. శనివారం ఎస్‌ఐ కరుణాకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మనోహరాబాద్‌ మండలం కాళ్లకల్‌ గ్రామానికి చెందిన భ్యాగరి స్వామి చిన్న కుమారుడు ప్రశాంత్‌(24) ఓ పరిశ్రమలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడు ప్రేమించిన అమ్మాయికి ఆరు నెలల కిందట వివాహం కావడంతో తాగుడుకు బానిసయ్యాడు. శుక్రవారం ప్రశాంత్‌ కుటుంబ సభ్యులతో కలిసి అల్లాపూర్‌లోని తన అక్క ఇంటికి ఫంక్షన్‌కు వెళ్లాడు. అక్కడ అందరిని కలిసి తిరిగి ఇంటికొచ్చిన ప్రశాంత్‌ జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకు ముందు తన సెల్‌ఫోన్‌లో తాను ఎవరినైనా బాధిస్తే క్షమించాలని, అందరినీ వీడి పోతున్నాని మేసేజ్‌ చేశాడు. ఇది గమనించిన మిత్రులు ఇంటి వద్దకు వెళ్లి చూడగా సీలింగ్‌కు ఉరి వేసుకొని కనిపించాడు. మృతుడి తండ్రి స్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

* మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ కంపెనీ సిబ్బందిపై ద్వారకా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల రెండో తేదీన నగరంలోని సీతంపేట మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ శాఖ అకౌంట్‌ అసిస్టెంట్‌ వి.లక్ష్మణరావు, ఆఫీస్‌ బాయ్‌ శ్రీను స్కూటీలో రూ.51,99,800 నగదుతోపాటు రూ.36,88,677 విలువైన 51 చెక్కులు తీసుకువెళ్తుండగా.. ద్వారకానగర్‌ మొదటి లైన్‌లో పోలీసులు తనిఖీలు చేస్తూ పట్టుకున్నారు. పొంతన లేని సమాధానాలు చెప్పడం, ఎటువంటి ఆధారాలు చూపకపోవడంతో పోలీసులు ఆ నగదు, చెక్కులను ఎన్నికల అధికారులకు అప్పగించారు. దీనిపై ఎన్నికల అధికారులు, ప్లయింగ్‌ స్క్వాడ్‌ టీమ్‌ ఫిర్యాదు మేరకు సెక్షన్‌ 188 ప్రకారం మార్గదర్శి సిబ్బంది వి.లక్ష్మణరావు, శ్రీనులపై ద్వారకా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు రూ.50 వేలకు మించి నగదు తీసుకువెళ్లడానికి వీలులేదని ద్వారకా సీఐ ఎస్‌.రమేష్‌ తెలిపారు.

కంపెనీలో పని ఒత్తిడి (Angry With Work Pressure) చేయడంతోపాటు అందరి ముందు దూషిస్తున్న సీనియర్‌ పట్ల ఇద్దరు ఉద్యోగులు పగ పెంచుకున్నారు. గూండాలతో అతడ్ని హత్య చేసేందుకు ప్రయత్నించారు. ఈ వీడియో క్లిప్‌ వైరల్‌ కావడంతో పోలీసులకు దొరికిపోయారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. ఉమాశంకర్, వినేష్ అనే ఇద్దరు ఒక మిల్క్ ప్రొడక్ట్ కంపెనీలో పని చేస్తున్నారు. ఆడిటర్‌గా పని చేస్తున్న సురేష్‌ తమపై పని ఒత్తిడి పెంచడంతో వారు ఆగ్రహంతో రగిలిపోయారు. అలాగే సీనియర్‌ అధికారుల ముందు తమను దూషిస్తున్న సురేష్‌పై వారు పగ పెంచుకున్నారు. అతడ్ని చంపేందుకు కొందరు గూండాలను నియమించారు. మార్చి 31న కళ్యాణ్‌ నగర్‌ సమీపంలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై బైక్‌పై వెళ్తున్న సురేష్‌తో కొందరు వ్యక్తులు ఘర్షణకు దిగారు. అంతా చూస్తుండగా రాడ్లతో అతడ్ని కొట్టారు. చనిపోయాడని భావించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. స్థానికులు చొరవ చూపి సురేష్‌ను ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఒక వాహనంపై అమర్చిన కెమెరాలో ఇది రికార్డైంది. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. చాలా మంది ఈ వీడియో క్లిప్‌ను పోలీసులకు షేర్‌ చేశారు. దీంతో స్పందించిన పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు జరిపారు. చివరకు అసలు విషయం తెలుసుకున్నారు. ఈ నెల 5న నిందితులైన ఉమాశంకర్‌, వినేష్‌తోపాటు సందీప్‌, మరో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z