Politics

ఆడపిల్లలను లక్షాధికారులను చేస్తా-NewsRoundup-Apr 23 2024

ఆడపిల్లలను లక్షాధికారులను చేస్తా-NewsRoundup-Apr 23 2024

* జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా మంగళవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా గత ఐదేళ్లలో తన ఆదాయం, అప్పులు, చెల్లించిన పన్నుల వివరాలు వెల్లడించారు. ఐదేళ్లలో ఆయన సంపాదన రూ.114,76,78,300. ఇందుకు ఆదాయపన్నుగా రూ.47,07,32,875, జీఎస్టీ కింద రూ.26,84,70,000 చెల్లించినట్టు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

* ఆడ పిల్లలకు పుట్టినిల్లు తెలుగుదేశం అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్నికలు రాగానే మోసగాళ్లు వస్తారు.. రకరకాల మాటలు చెప్తారని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గ పరిధిలోని బొండపల్లిలో మహిళలతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన వ్యక్తి దివంగత నేత ఎన్టీఆర్. కానీ జగన్ మాత్రం ఆయన చెల్లెమ్మకు ఆస్తి కాకుండా అప్పులు ఇచ్చారు అని విమర్శించారు. ‘‘మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన వ్యక్తి దివంగత నేత ఎన్టీఆర్. కానీ జగన్ మాత్రం ఆయన చెల్లెమ్మకు ఆస్తి కాకుండా అప్పులు ఇచ్చారు. ఆడబిడ్డలు బాగా చదువుకోవాలని మహిళా యూనివర్సిటీలు స్థాపించాం. మహిళలకు రాజకీయంగా అవకాశం కల్పించాం. ఆడ బిడ్డల చదువుకు తెదేపా ఎంతో కృషి చేసింది. వారిని లక్షాధికారిని చేసే బాధ్యత నాది. జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముద్దులు పెట్టాడు.. అధికారంలోకి వచ్చాక పిడిగుద్దులు కురిపిస్తున్నాడు. మీకు రూ.పది ఇచ్చి.. రూ.వంద దోచేస్తున్నారు. ఐదేళ్లలో మహిళలపై దాడులు విపరీతంగా పెరిగాయి. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక యువత రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. వైకాపా పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో నష్టపోయింది’’ అని చంద్రబాబు విమర్శించారు.

* దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన ఆప్‌ జాతీయ కన్వీనర్‌, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal), భారాస ఎమ్మెల్సీ కవిత (Kavitha) జ్యుడీషియల్‌ కస్టడీని రౌస్‌ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఈ కేసులో ఇద్దరికీ మరో 14 రోజుల పాటు కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మే 7న ఈ నేతలిద్దరినీ కోర్టు ఎదుట హాజరుపరచాలని న్యాయమూర్తి ఆదేశించారు.

* బాల్టిక్‌ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్‌ జామ్‌ (GPS Jam) సమస్యను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీని వెనక రష్యా రహస్య ఆయుధం ఉండొచ్చని తాజా కథనం పేర్కొంది. దాని పేరు టోబోల్‌ (Tobol). గతంలో నాటో తూర్పు ప్రాంతంలో నౌకల సిగ్నల్స్‌ను అడ్డుకునేందుకు ఈ సాంకేతిక ఆయుధాన్ని రష్యా (Russia) ఉపయోగించినట్లు సమాచారం.

* లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ (Congress) పార్టీపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) మరోసారి ధ్వజమెత్తారు. ఆ పార్టీ హయాంలో ప్రజలు తమ విశ్వాసాలను పాటించడానికి కూడా కష్టపడాల్సి వస్తోందన్నారు. రాజస్థాన్‌ (Rajasthan) ఎన్నికల ప్రచారంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌గాంధీ ఇటీవల చేసిన ‘సంపద పునఃపంపిణీ’ ప్రకటనను మళ్లీ ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు.

* ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ (WhatsApp) తన ప్లాట్‌ఫామ్‌ను ఆల్‌-ఇన్‌-వన్‌గా రూపుదిద్దేందుకు ప్రయత్నిస్తోంది. ఆ దిశగా కొత్త కొత్త ఫీచర్లు జోడిస్తోంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) సదుపాయాన్ని తీసుకొచ్చిన ఈ యాప్‌.. మరో కొత్త ఫీచర్‌కు సిద్ధమవుతోంది. ఇంటర్నెట్‌ లేకున్నా ఫొటోలు, వీడియోలు, ఫైల్స్‌ను షేర్‌ చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది.

* తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన రంజిత్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి బుద్ధి చెప్పాలని భారాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్ల లోక్‌సభ పరిధిలోని రాజేంద్రనగర్‌లో జరిగిన రోడ్‌ షోలో కేటీఆర్‌ ప్రసంగించారు. భారాసకు 8 నుంచి 10 సీట్లు ఇస్తే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మనం చెప్పినట్లే వింటుందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉండే ఎవరైనా మన వద్దకు రావాలంటే భారాసకు ఎక్కువ సీట్లు కావాలన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పారిపోయే పిరికిపందలకు తప్పకుండా బుద్ధి చెప్పాలని పార్టీ శ్రేణులను కోరారు.

* దేశంలో ఎన్నికలు కొనసాగుతున్న వేళ ఆయా పార్టీ అభ్యర్థుల ప్రచారాలు మరింత జోరందుకున్నాయి. మద్దతుదారులతో భారీ బహిరంగ సభలు, రోడ్‌షోలు నిర్వహిస్తున్నారు. ఇదే అదనుగా భావించిన కొందరు జేబుదొంగలు తమ చేతివాటం చూపిస్తున్నారు. టీవీ రాముడిగా పేరొందిన మేరఠ్‌ భాజపా (BJP) అభ్యర్థి అరుణ్‌ గోవిల్‌ (Arun Govil) పాల్గొన్న రోడ్‌షోలో అనేక చోరీలు చోటుచేసుకున్నాయి.

* తేజ సజ్జ (Teja Sajja) కీలక పాత్రలో ప్రశాంత్‌వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో రూపొందిన సూపర్‌ హీరో ఫిల్మ్‌ ‘హను-మాన్‌’ (Hanu Man). ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు ఈ మూవీకి కొనసాగింపుగా ‘జై హనుమాన్‌’ (Jai Hanuman) రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్‌ పనులు పూర్తవగా, త్వరలోనే ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. మంగళవారం హనుమాన్‌ జన్మోత్సవం సందర్భంగా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ‘జై హనుమాన్‌’ మూవీని ఐమ్యాక్స్‌ 3డీ ఫార్మాట్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాదు, ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌లో వచ్చే ప్రతీ సినిమానూ ఐమ్యాక్స్‌ 3డీ వెర్షన్‌లోనే తీసుకురానున్నట్లు తెలిపారు. నిప్పులు కక్కుతున్న డ్రాగన్‌ ఎదురుగా హనుమాన్‌ నిలబడి ఉన్న పోస్టర్‌ను పంచుకున్నారు. ఇప్పటివరకూ చైనా మూవీలకే పరిమితమైన డ్రాగన్‌ కాన్సెప్ట్‌ ఇప్పుడు ఇండియా సినిమాలోనూ అలరించనుంది.

* తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలో మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా జ‌రిగిన‌ సాలకట్ల వసంతోత్సవాలు. మంగళవారం కన్నులపండుగగా ముగిసిన సాలకట్ల వసంతోత్సవాలు. తొలిరోజు, రెండో రోజు శ్రీ మలయప్పస్వామి, శ్రీ రుక్మిణీ సమేత శ్రీ కృష్ణస్వామివారికి ఘనంగా వసంతోత్సవ సేవలు.

* బాపట్ల జిల్లా పర్చూరులో కూటమి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు నామినేషన్‌ సందర్భంగా ఎస్సై శివనాగిరెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు. సాంబశివరావుతోపాటు ప్రపోజర్‌, పర్చూరు మండల తెదేపా అధ్యక్షుడు ఆర్వో కార్యాలయానికి వెళ్లారు. ఈ క్రమంలో ఆయనపై ఎస్సై అసభ్య పదజాలంతో దూషించారు. ఎస్సై తీరుపై ఎమ్మెల్యే ఏలూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. బూతులు తిట్టే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఘటనపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు.

* ఈజీజెట్ విమానంలో ఓ ప్రయాణికుడు తాగిన మత్తులో ఎయిర్‌లైన్ సిబ్బంది, పోలీసులపైన దాడి చేసిన ఘటన టర్కీలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన దృశ్యాలను ఇతర ప్రయాణికులు రికార్డ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్‌గా మారింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… ఈజీ జెట్‌ విమానం టర్కీలో ల్యాండ్‌ అయిన అనంతరం మద్యం మత్తులో ఉన్న ఓ ప్రయాణికుడు విమానం పైకప్పును బాదుతూ మరో వ్యక్తితో వాదనకు దిగాడు. అతడిని వారించడానికి చూసిన టర్కీ పోలీసు అధికారి, మహిళా ఎయిర్‌లైన్‌ ఉద్యోగిపైనా దాడి చేశాడు. ఈ హఠాత్పరిణామంతో ఇతర ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. అనంతరం అధికారులు అతడిని విమానం నుంచి బయటకు పంపించారు.

* తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల సందడి కొనసాగుతోంది. ప్రధాన పార్టీల తరఫున అభ్యర్థులు నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారులకు (ఆర్వో) సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీల్లో ఆయా పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో కోలాహలం నెలకొంది. ఏపీలో పిఠాపురం జనసేన అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌, గుడివాడ అసెంబ్లీ తెదేపా అభ్యర్థిగా వెనిగండ్ల రాము నామినేషన్‌ దాఖలు చేశారు.

* బాపట్ల జిల్లా పర్చూరులో కూటమి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు నామినేషన్‌ సందర్భంగా ఎస్సై శివనాగిరెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు. సాంబశివరావుతోపాటు ప్రపోజర్‌, పర్చూరు మండల తెదేపా అధ్యక్షుడు ఆర్వో కార్యాలయానికి వెళ్లారు. ఈ క్రమంలో ఆయనపై ఎస్సై అసభ్య పదజాలంతో దూషించారు. ఎస్సై తీరుపై ఎమ్మెల్యే ఏలూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. బూతులు తిట్టే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఘటనపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z