DailyDose

ముంబైలో 22.14 కిలోల బంగారం పట్టివేత-CrimeNews-May 13 2024

ముంబైలో 22.14 కిలోల బంగారం పట్టివేత-CrimeNews-May 13 2024

* హఠాత్తుగా రోడ్డు పైకి వచ్చిన వానరాన్ని తప్పించబోయి ఓ కారు ట్యాంకర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు బ్యాంకు ఉద్యోగులు తమ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్-అలీగఢ్‌ జాతీయరహదారిపై సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు… ముగ్గురు బ్యాంకు ఉద్యోగులు మేనేజర్ సౌరభ్ శ్రీవాత్సవ, క్యాషియర్లు దివ్యాన్షు, అమిత్‌లు జాతీయ రహదారిపై కారులో ప్రయాణిస్తుండగా హఠాత్తుగా ఓ వానరం వాహనానికి అడ్డుగా వచ్చింది. దానిని తప్పించబోయి వేగంగా వస్తున్న ఓ ట్యాంకర్‌ను కారుతో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన అమిత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

* ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.13.56 కోట్ల విలువైన 22.14 కిలోల బంగారం పట్టుబడింది. గత మూడు రోజుల్లో జరిపిన తనిఖీల్లో పలువురు ప్రయాణికుల నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజుల పాటు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా బంగారం స్మగ్లింగ్‌ చేస్తున్న 11 మంది ప్రయాణికులు పట్టుబడ్డారు. అక్రమ రవాణాపై 20 కేసులు నమోదయ్యాయని కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. ప్రయాణికులు బంగారు కడ్డీలను వారి లోదుస్తులు, దుస్తులు, కార్డబోర్డ్‌ షీట్‌, బెల్ట్‌ మొదలైన వాటిల్లో దాచిపెట్టి అక్రమంగా తరలించడానికి ప్రయత్నించారని అధికారులు తెలిపారు. మరో వ్యక్తి ఏకంగా మైనపు రూపంలో ఉన్న బంగారాన్ని మలద్వారంలో దాచి తరలిస్తున్నట్లుగా వారు పేర్కొన్నారు.

* కన్నడ నటుడు చేతన్‌ చంద్రకు చేదు అనుభవం ఎదురైంది. గుడికి వెళ్లి తిరిగొస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు గుంపుగా వచ్చి నటుడిపై దాడి చేశారు. అతడి కారును సైతం ధ్వంసం చేశారు. ఈ ఘటన బెంగళూరులోని కగ్గలిపురలో ఆదివారం చోటు చేసుకుంది. నటుడు సోషల్‌ మీడియాలో వెల్లడించిన వివరాల ప్రకారం.. మే 12న మాతృదినోత్సవం సందర్భంగా నటుడు చేతన్‌ చంద్ర తన తల్లిని తీసుకుని గుడికి వెళ్లాడు.

* తెలంగాణ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌ పార్లమెంట్‌ స్థానం బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదైంది. పోలింగ్‌ బూత్‌లో ముస్లిం మహిళల హిజాబ్‌ తొలగించి.. అనుచితంగా వ్యవహరించారని ఆమెపై ఆరోపణలు వచ్చాయి. దీంతో జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ ఆదేశాల మేరకు మలక్‌పేట్‌ పోలీసులు ఆమెపై నమోదు చేసినట్లు తెలిపారు. 171c, 186, 505(1)(c)ఐపిసి, అండ్ సెక్షన్ 132 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు.. తెలంగాణలో మధ్యాహ్నం 3గంటల వరకు 52శాతం పోలింగ్‌ నమోదైంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z