Politics

అమ్మాయి గురించి గొడవ…స్నేహితుడి హత్య-CrimeNews-June 29 2024

అమ్మాయి గురించి గొడవ…స్నేహితుడి హత్య-CrimeNews-June 29 2024

* అమ్మాయి విషయంలో గొడవపడి తోటి స్నేహితుడిని దారుణంగా హత్య చేశారు కొందరు విద్యార్థులు. ఎవరికీ తెలియకుండా మృతదేహాన్ని రైలు పట్టాలపై పారేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈ కేసును ఛేదించిన అల్లాపూర్ పోలీసులు నిందితులను శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. నిందితులంతా 20 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్‌పల్లి అల్లాపూర్‌కు చెందిన అహ్మద్, అన్వరీ బేగం కుమారుడు డానీష్(17) యూసఫ్‌గూడలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. అదే కళాశాలలో చదువుతున్న ఓ రౌడీషీటర్ కుమారుడు, మరికొంత మందితో అతనికి స్నేహం ఉంది. తనతో బంధుత్వం ఉన్న యువతితో డానీష్‌ చనువుగా ఉండడాన్ని రౌడీషీటర్‌ కుమారుడు జీర్ణించుకోలేకపోయాడు. తాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న యువతితో నువ్వెందుకు తిరుగుతున్నావంటూ పలుమార్లు గొడవపడ్డాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 22న రాత్రి 9.30 గంటలకు ఇంటి నుంచి వెళ్లిన డానీష్ తిరిగి రాలేదు. మరుసటి రోజు బోరబండ రైల్వే స్టేషన్ సమీపంలోని రైలు పట్టాలపై ఛిద్రమైన స్థితిలో అతని మృతదేహం లభించింది. హత్య కావొచ్చని మృతుడి తల్లిదండ్రులు అల్లాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేయగా.. బీరు సీసాలతో విచక్షణారహితంగా కొట్టి డానీష్‌ను అడ్డు తొలగించుకోవాలని రౌడీషీటర్ కుమారుడు మిత్రులతో కలిసి కుట్ర పన్నినట్లు తెలిసింది. ఫోన్‌ చేసి డానీష్‌ను అక్కడికి రప్పించారని పోలీసులు తెలిపారు. అతడు వచ్చాక రౌడీషీటర్‌ కుమారుడు, అతడి మిత్రులు కలిసి కొంతసేపు గంజాయి తాగి, ముందే సిద్ధంగా ఉంచుకున్న ఖాళీ బీరు సీసాలతో దాడి చేశారు. అప్పటికీ డానీష్ చనిపోకపోవడంతో గొంతుపిసికి ప్రాణాలు తీసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని రైలు పట్టాలపై పడేశారని తెలిపారు. హత్య జరిగిన ప్రదేశంలోని చరవాణి సిగ్నల్స్‌ ఆధారాలతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఐదుగురిని కోర్టులో హాజరుపరిచి.. జువైనల్ హోమ్‌కు తరలించారు.

* రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఓ ఇంజినీర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. ప్రాథమిక సమాచారం ప్రకారం… ఇజాయత్‌ అలీ అనే ఇంజినీర్‌ 20 రోజుల కిందట దుబాయ్‌ నుంచి ఇండియాకు వచ్చాడు. అతడు శనివారం ఓ నిర్మానుష్య ప్రాంతంలో దారుణ హత్యకు గురయ్యాడు. ఓ కారులో వచ్చిన గుర్తు తెలియని దుండగులు అతడి గొంతు కోసి పరారైనట్లు తెలుస్తోంది. వారిలో ఇద్దరు యువకులు కాగా.. ఓ యువతి ఉన్నట్లు సమాచారం. హత్య అనంతరం క్వాలిస్‌ వాహనాన్ని అక్కడే విడిచిపెట్టి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుల వాహనాన్ని, రెండు ఫోన్లను సీజ్‌ చేశారు. ఎందుకు ఈ దారుణానికి పాల్పడ్డారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.

* శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరంలోని రసాయన పరిశ్రమలో పేలుడు సంభవించింది. సరకా ల్యాబొరేటరీస్‌లో రియాక్టర్‌ పేలడంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. పరిశ్రమ ప్రాంగణంలో ఉన్న పలు వాహనాలకు మంటలు అంటుకొని దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలు అదుపు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

* ఇద్దరు పిల్లలతో ఆగి ఉన్న కారును ఒక వ్యక్తి చోరీ చేశాడు. (Thieves Steal Car With Children) వారి పేరెంట్స్‌కు ఫోన్ చేసి 50 లక్షలు డిమాండ్‌ చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు 20 వాహనాల్లో ఆ కారు కోసం వెతికారు. మూడు గంటల తర్వాత ఒక చోట వదిలేసిన కారులో ఉన్న పిల్లలను గుర్తించి కాపాడారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం రాత్రి 11.40 గంటల సమయంలో భార్యాభర్తలు తమ ఇద్దరు పిల్లలతో కలిసి కారులో ప్రయాణించారు. 11 ఏళ్ల కుమార్తె, మూడేళ్ల కుమారుడ్ని కారులో వదిలేసి ఇంజిన్‌ ఆన్‌లో ఉంచి స్వీట్లు కొనేందుకు షాపు వద్దకు వెళ్లారు. కాగా, ఇంజిన్‌ ఆన్‌లో ఉన్న కారులోకి ఒక వ్యక్తి ఎక్కాడు. ఇద్దరు పిల్లలతోపాటు డ్రైవ్‌ చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. స్వీట్లు కొనుగోలు చేసి వచ్చిన దంపతులు పిల్లలున్న తమ కారు మాయం కావడంతో షాక్‌ అయ్యారు. ఇంతలో పిల్లల తల్లికి ఫోన్‌ చేసిన ఆ వ్యక్తి రూ.50 లక్షలు డిమాండ్‌ చేశాడు. దీంతో మరింత ఆందోళన చెందిన భార్యాభర్తలు పోలీసులను ఆశ్రయించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z