NRI-NRT

ప్రతిభామూర్తుల జీవితచరిత్రలపై తానా సాహిత్య సదస్సు

తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహించే సాహిత్య సమావేశాల పరంపరలో జూన్ 30న జరిగిన 68వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం “స్ఫూర్తిదాయకమైన ప్రతిభామూర్తుల జీవితచరిత్రలు” సదస్సు ఘనంగా జరిగింది. తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర అతిథులను సాదరంగా ఆహ్వానించి సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ప్రతిభామూర్తుల జీవిత చరిత్రలు చదవడం వల్ల కేవలం వారు గడిపిన జీవితమేగాక ఆనాటి సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ పరిస్థితులు, ప్రజల జీవనవిధానం మొదలైన ఎన్నో విషయాలు తెలుస్తాయి. అంతేగాక వారు తమ జీవితాలలో ఎదుర్కొన్న సమస్యలు, ఆటుపోట్లు, వాటిని అధిగమించిన తీరు నుంచి మనం ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చు. అందువల్ల తెలుగు సాహిత్య ప్రక్రియలలో జీవితచరిత్రలు, ఆత్మకథలు కీలక భూమిక పోషిస్తాయి’’ అన్నారు.

కృష్ణా జిల్లాలోని ముదునూరు అనే గ్రామంలో ‘జీవితచరిత్రల గ్రంథాలయం’ వ్యవస్థాపకులు డా. నాగులపల్లి భాస్కరరావు ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొని తమ గ్రంథాలయ ఏర్పాటు వెనుక ఉన్న ఆశయాన్ని, అమలు జరుగుతున్న తీరుతెన్నులను వివరించారు. విశిష్ట అతిథులుగా పాల్గొన్న సుప్రసిద్ధ రచయిత్రి, విద్యావేత్త ఆచార్య డా. సి. మృణాళిని ప్రముఖ రచయిత బుచ్చిబాబు సతీమణి శివరాజు సుబ్బలక్ష్మి రచించిన “మా జ్ఞాపకాలు” అనే జీవిత చరిత్రను, బీనాదేవి పేరుతో భార్యాభర్తలు కలిసి జంటగా రాసిన అనేక రచనలను “బీనాదేవీయం” అనే గ్రంథాల్లోని పలు విషయాలను చక్కగా ఆవిష్కరించారు. ప్రముఖ రచయిత డా. జి. వి. పూర్ణచందు తెలుగువారికి తక్కువగా పరిచయమైన తమిళనాట ఆధ్యాత్మికరంగంలో ఎనలేని కృషిచేసిన తెలుగు ప్రముఖులు ‘అప్పయ్య దీక్షితులు’, ‘అల్లూరి వేంకటాద్రిస్వామి’ జీవిత చరిత్రల్లోని పలు విశేషాలను పంచుకున్నారు.

ప్రముఖ సాహితీవేత్త కిరణ్‌ప్రభ ఒక రష్యన్ యువతి కేవలం భారతీయ నృత్యకళలపై ఆసక్తితో తన పేరును ‘రాగిణీదేవి’గా మార్చుకుని ఎన్నో సాహసాలతో భారతదేశంలో అడుగుపెట్టి, అనేక సంవత్సరాలు కృషిచేసి నాట్యం నేర్చుకున్న తీరును వివరించారు. నాట్యశాస్త్రంపై ఎంతో పరిణితితో కూడిన గ్రంథాలను ఆమె రాయడం.. తన కుటుంబం మొత్తం ఏ విధంగా నాట్యకళకు జీవితాంతం అంకితం అయిందో వంటి ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. అలాగే, తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఆఖరి శ్వాస వరకు గిడుగు చేసిన ఒంటరి పోరాటాన్ని, వ్యావహారిక భాషోద్యమ పితామహుడు “గిడిగు వేంకట రామమూర్తి” గారి జీవితంలోని అనేక కోణాలను కిరణ్ ప్రభ విశ్లేషించారు. సాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇలాంటి సాహితీ సమావేశాలు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నిర్వహించడం చాలా అవసరం అన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z