NRI-NRT

చికాగోలో హైదరాబాద్ యువకుడు మృతి

చికాగోలో హైదరాబాద్ యువకుడు మృతి

కాటేదాన్‌కు చెందిన ఓ యువకుడు అమెరికాలోని చికాగోలో ఈతకు వెళ్లి మృతి చెందాడు. గత శనివారం (21న) జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అతడి మృతదేహం శనివారం(27 వతేదీ) రాత్రి హైదరాబాద్‌ చేరుకోగా ఆదివారం ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే… మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకులకు చెందిన గోపాల్‌రెడ్డి, సమంత దంపతులు 25 ఏళ్ల క్రితం కాటేదాన్‌కు వచ్చి స్థిరపడ్డారు. వారికి ఇద్దరు ఆడపిల్లలు, కుమారుడు అక్షిత్‌రెడ్డి(26) ఉన్నారు. గోపాల్‌రెడ్డి డీసీఎం డ్రైవర్‌. ఇద్దరు కుమార్తెలకు వివాహాలు చేయగా కుమారుడిని ఉన్నత చదువుల కోసం మూడేళ్ల క్రితం అమెరికా పంపించారు. చికాగోలో ఉంటూ ఎమ్మెస్‌ పూర్తిచేసిన అక్షిత్‌రెడ్డి అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. రెండు నెలల్లో కుమారుడు వస్తే డిసెంబరులో పెళ్లి చేయాలని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అక్షిత్‌రెడ్డి గత శనివారం సాయంత్రం ఇద్దరు స్నేహితులతో కలిసి చికాగోలోని లేక్‌మిశిగన్‌లో ఈతకు వెళ్లాడు. ఒకరు ఒడ్డున ఉండగా ఇద్దరు చెరువులోకి దిగారు. చెరువు మధ్యలోని ఓ రాయి వద్దకు వెళ్లాలని వారు నిర్ణయించుకున్నారు. అతి కష్టమ్మీద రాయివరకు స్నేహితుడు చేరుకోగా అక్షిత్‌రెడ్డి మధ్యలోనే అలిసిపోయాడు. దీంతో వెనక్కి వస్తుండగా మునిగిపోయాడు. స్నేహితుడు సైతం తిరిగి వచ్చే క్రమంలో చెరువులో మునిగిపోగా.. స్థానికులు కాపాడారు. పోలీసులు గాలించి అక్షిత్‌రెడ్డి మృతదేహాన్ని వెలికి తీశారు. శనివారం రాత్రి అక్షిత్‌రెడ్డి మృతదేహం కాటేదాన్‌కు చేరుకుంది. ఆదివారం అడ్డాకులలో అంత్యక్రియలు పూర్తిచేశారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z