DailyDose

తిరుపతిలో ₹2కోట్లకు కిడ్నాప్-CrimeNews-July 29 2024

తిరుపతిలో ₹2కోట్లకు కిడ్నాప్-CrimeNews-July 29 2024

* ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. ప్రతాప్‌గఢ్‌ జిల్లాలోని హతిగావ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోగల ఛోట్కీ ఇబ్రహీంపూర్‌ గ్రామానికి చెందిన పంచాయతీ పెద్దలు అనాగరికంగా వ్యవహరించారు. పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే కారణంతో ముగ్గురు పిల్లల తల్లి అయిన వివాహితను చెట్టుకు కట్టేశారు. ఆమె మెడలో చెప్పుల దండ వేశారు. ముఖానికి పూర్తిగా నలుపు రంగు సిరా పూశారు. జట్టు కత్తిరించారు. మైనర్‌లు అయిన తన ముగ్గురు పిల్లల కళ్ల ముంగిటే ఈ తతంగం అంతా చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బాధితురాలి భర్త బతుకుదెరువు కోసం ముంబైకి వెళ్లాడు. మహిళ స్వగ్రామంలోనే ఉండి పిల్లలను పోషించుకుంటోంది. ఈ క్రమంలో ఆమె మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంపై గ్రామంలో ఆగ్రహం పెల్లుబికింది. దాంతో విషయం గ్రామంలోని పంచాయతీ పెద్దల దృష్టికి వెళ్లింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పంచాయతీ పెద్దలు ముంబైలో ఉన్న బాధితురాలి భర్తకు విషయం చెప్పారు. వెంటనే పంచాయతీకి రావాలని పిలిపించారు. భర్త, ముగ్గురు పిల్లల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. భర్త వివాహేతర సంబంధం నిజమేనని రుజువు చేశారు. ఆపై ఆమెను చెట్టుకు కట్టేసి మెడలో చెప్పుల దండ వేయాలని, ముఖానికి నల్లరంగు పూయాలని, జుత్తు కత్తిరించాలని తీర్పు చెప్పారు.

* డబ్బుల విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఆగ్రహించిన భర్త కత్తితో భార్యపై దాడి చేశాడు. అయితే తల్లిని రక్షించే క్రమంలో తండ్రి కత్తితో పొడవడంతో కుమార్తె మరణించింది. (Man Stabs Daughter) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. శనివారం అర్ధరాత్రి తర్వాత నజాఫ్‌గఢ్ ప్రాంతానికి చెందిన దంపతులైన అబాస్‌ అలీ, సుఫియా మధ్య డబ్బు విషయంలో గొడవ జరిగింది. ఆగ్రహించిన అబాస్‌ తన భార్య సుఫియా తలపై కత్తితో పొడిచాడు. కుమార్తె అయిన 22 ఏళ్ల రష్మీనా ఖాతూన్ తల్లిని కాపాడేందుకు ప్రయత్నించింది. దీంతో కుమార్తె తలపైనా కత్తితో తండ్రి పొడిచాడు. ఈ నేపథ్యంలో ఆమె స్పృహతప్పి పడిపోయింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా ఆ యువతి చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. గాయపడిన యువతి తల్లికి చికిత్స అందిస్తున్నారు.

* అన్నమయ్య జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. మదనపల్లి నవోదయ కాలనీకి చెందిన రెడ్డి ప్రవీణ్‌పై నాటు తుపాకీతో బావ దివాకర్‌ కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడు.. మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. మదనపల్లి మండలం వలసపల్లి పంచాయతీ నవోదయ కాలనీలో దివాకర్‌, అతని స్నేహితులతో కలిసి ఆదివారం రాత్రి ఫుల్లుగా మద్యం తాగాడు. మత్తు ఎక్కువ కావడంతో దివాకర్‌ అతని స్నేహితులతో గొడవ పడ్డాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఆనంద్‌ అనే వ్యక్తి ఎందుకు అల్లరి చేస్తున్నారని ప్రశ్నించాడు. దీంతో ఆవేశానికి లోనైన దివాకర్‌.. ఆనంద్‌తో వాగ్వాదానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో గొడవ మరింత ముదిరింది.

* తిరుపతి జిల్లా భాకరాపేటలో కిడ్నాప్‌ కేసును పోలీసులు ఛేదించారు. ఈనెల 24న చిన్నగొట్టిగల్లు మండలం చెరువుమందరపల్లిలో భాస్కర్‌ అనే వ్యక్తిని కిడ్నాప్‌ చేసిన ఘటన కలకలం రేపింది. భాస్కర్‌ కుమారుడు రెడ్డి కిరణ్‌ను కిడ్నాపర్లు రూ.2కోట్లు డిమాండ్‌ చేశారు. తన తండ్రిని కిడ్నాప్‌ చేశారంటూ కిరణ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. నలుగురు నిందితులను భాకరాపేట వద్ద అరెస్టు చేశారు. వారి నుంచి డమ్మీ పిస్టల్‌, మత్తు సిరంజీలు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.

* మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. దుండగులు ఓ మహిళను గొలుసులతో బంధించి జిల్లాలోని నిర్మానుష్య అటవీ ప్రాంతంలో వదిలి వెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోనుర్లి గ్రామశివార్లలో ఓ గొర్రెల కాపరి గొర్రెలను మేపుతుండగా మహిళ అరుపులు వినిపించాయి. చుట్టుపక్కల వెతకగా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

* వైఎస్సార్‌ జిల్లా దువ్వూరు మండలం చల్లబసాయపల్లెలోని తెలుగుగంగలో గల్లంతైన ముగ్గురు యువకుల మృతదేహాలు దొరికాయి. రహంతుల్లా, షాహిద్, ముదాఫీర్ మృతదేహాలను గజ ఈతగాళ్లు వెలికితీశారు. జలాశయం-1లో ప్రొద్దుటూరుకు చెందిన వీరు ఆదివారం ఇంట్లో చెప్పి తెలుగుగంగ జలాశయం వద్దకు వెళ్లారు. సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు జలాశయం వద్దకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. అక్కడ యువకులకు సంబంధించిన దుస్తులు, చెప్పులు ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టి వీరి మృతదేహాలను బయటకు తీశారు

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z