NRI-NRT

రేవంత్ 2024 ఆగష్టు అమెరికా పర్యటన షెడ్యూల్ వచ్చేసింది

రేవంత్ 2024 ఆగష్టు అమెరికా పర్యటన షెడ్యూల్ వచ్చేసింది

రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి శనివారం అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటనకు బయలుదేరనున్నారు. ఈ నెల 14 వరకు ఈ పర్యటన కొనసాగనుంది. సీఎం వెంట సీఎస్‌ శాంతికుమారి, ఐటీ, పరిశ్రమలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్, పరిశ్రమలశాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు వెళ్లనున్నారు. మరోవైపు 4న మంత్రి శ్రీధర్‌బాబు, 5న మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా అమెరికా పర్యటనకు బయలుదేరుతారు. వీరు అక్కడ రేవంత్‌ బృందంతో కలుస్తారు. 9వ తేదీ వరకు న్యూయార్క్, వాషింగ్టన్, డల్లాస్, శాన్‌ ఫ్రాన్సిస్కో నగరాల్లో పర్యటించి పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అవుతారు. ఈ సందర్భంగా పలు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలున్నాయి. అమెరికాలోని ప్రవాస భారతీయులతోనూ సమావేశమవుతారు. 10న అమెరికా నుంచి బయలుదేరి 11న దక్షిణ కొరియాలోని సియోల్‌ నగరానికి చేరుకుంటారు. అక్కడా ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతారు. 14న రాష్ట్రానికి తిరిగొస్తారు. రేవంత్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జనవరి 15 నుంచి 19 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్నారు. పెట్టుబడుల కోసం విదేశాల్లో పర్యటించడం ఇదే తొలిసారి.

*** సీఎం పర్యటన సాగుతుందిలా..

3న హైదరాబాద్‌ నుంచి అమెరికాలోని న్యూయార్క్‌కు చేరుకుంటారు.

4న న్యూజెర్సీలో ఒక కార్యక్రమంలో పాల్గొంటారు.

5న న్యూయార్క్‌లో కాగ్నిజెంట్‌ సీఈవోతో, సిగ్నా సీనియర్‌ అధికారి, ఆర్‌సీఎం, టీబీసీ, కార్నింగ్, జోయిటస్‌ సంస్థల ప్రతినిధులు, ఆర్గా సీఈవో రామకృష్ణ, పీ అండ్‌ వో సంస్థ సీవోవో శైలేష్‌ జెజురికర్, ర్యాపిడ్‌ 7 ప్రతినిధులతో భేటీ అవుతారు.

6న పెప్సికో, హెచ్‌సీఏ ఉన్నతాధికారులతో సమావేశమైన తరువాత న్యూయార్క్‌ నుంచి వాషింగ్టన్‌ చేరుకుంటారు. ఇక్కడ ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సమావేశమవుతారు. అనంతరం డల్లాస్‌కు వెళ్తారు.

7న ఛార్లెస్‌ స్క్వాబ్‌ హెడ్, మహాత్మాగాంధీ మెమోరియల్‌ ప్లాజా సందర్శన, ఐటీ సేవల సంస్థలతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఉంటాయి.

8న కాలిఫోర్నియాలో ట్రినెట్‌ సీఈవో, ఆరమ్, ఆమ్‌జెన్, రెనెసాస్, అమాట్‌ సంస్థల ప్రతినిధులతో సమావేశం, సెలెక్ట్‌ టెక్‌ యూనికార్న్స్‌ ప్రతినిధులతో ఇష్టాగోష్ఠి, సెమీ కండక్టర్‌ రంగానికి చెందిన పలు సంస్థలతో రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొంటారు.

9న గూగుల్‌ సీనియర్‌ ప్రతినిధులతో భేటీ, స్టాన్‌ఫోర్డ్‌ బయోడిజైన్‌ సెంటర్‌ సందర్శన, అమెజాన్‌ వైస్‌ ప్రెసిడెంట్, జెడ్‌ స్కేలర్‌ సీఈవో, ఎనోవిక్స్, మోనార్క్‌ ట్రాక్టర్స్, థెర్మోఫిషర్‌ సైంటిఫిక్‌ ప్రతినిధులను కలుస్తారు.

10న అమెరికా నుంచి బయలుదేరి 11న సియోల్‌ చేరుకుంటారు.

12న సియోల్‌లో యూయూ ఫార్మా, కొరియన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ టెక్స్‌టైల్స్‌ ఇండస్ట్రీ, ఎల్‌ఎస్‌ హోల్డింగ్స్, హ్యుందాయ్‌ మోటార్స్‌ ప్రతినిధులతో, పలువురు ఆ దేశ ఉన్నతాధికారులతో సమావేశమవుతారు.

13న హాన్‌ రివర్‌ ప్రాజెక్టుపై డిప్యూటీ మేయర్‌ జూ యంగ్‌ టాయ్‌తో భేటీ, కొరియా బ్యూటీ ఇండస్ట్రీ ప్రతినిధులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం, సామ్‌సంగ్, ఎల్‌జీ సంస్థల ప్రతినిధులతో చర్చలు, హాన్‌ రివర్‌ ఫ్రంట్‌ సందర్శన ఉంటాయి.

14న హైదరాబాద్‌కు రాక.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z