Business

ఉద్యోగులకు ఇన్ఫోసిస్ CEO హామీలు-BusinessNews-Aug 25 2024

ఉద్యోగులకు ఇన్ఫోసిస్ CEO హామీలు-BusinessNews-Aug 25 2024

* ఈ సంవత్సరం రెండు కొనుగోళ్ల తర్వాత, భారతదేశ రెండవ అతిపెద్ద ఐటీ సర్వీస్ కంపెనీ ఇన్ఫోసిస్ మరిన్ని సంస్థలను కైవసం చేసుకోవడానికి సన్నద్ధమవుతోంది. డేటా అనలిటిక్స్, ఎస్ఏఏఎస్ వంటి రంగాల్లో కొనుగోళ్లపై కంపెనీ ఆసక్తిగా చూపుతున్నట్లు ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ వెల్లడించారు.450 మిలియన్ యూరోల ప్రైస్-ట్యాగ్‌తో వచ్చిన స్కేల్ మ్యాచింగ్ ఇన్-టెక్‌కి సంబంధించి మరిన్ని కొనుగోళ్లు జరగవచ్చా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఖచ్చితంగా సాధ్యమవుతుందని పరేఖ్ అన్నారు. భారతదేశంలో ప్రధాన కార్యాలయం కలిగిన సెమీకండక్టర్ డిజైన్ సేవల సంస్థ ఇన్ సెమీ టెక్నాలజీ సర్వీసెస్‌లో 100 శాతం ఈక్విటీ షేర్ క్యాపిటల్‌ను రూ. 280 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఇన్ఫోసిస్ ఖచ్చితమైన ఒప్పందాన్ని ప్రకటించిందని వెల్లడించారు.ఏఐ ప్రభావం గురించి మాట్లాడుతూ.. ఏఐ టెక్నాలజీ క్లయింట్‌ల నుంచి బలమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇన్ఫోసిస్ కూడా ఈ రంగంవైపు వేగంగా దూసుకెళ్తోంది. కంపెనీలు జెన్ఏఐ నుంచి ప్రయోజనాలను, ఫలితాలను వినియోగించుకోవాలని.. ఇది తప్పకుండా కంపెనీ పెరుగుదలకు దోహదపడుతుందని పరేఖ్ అభిప్రాయపడ్డారు.సమయం గడిచేకొద్దీ ఏఐ టెక్నాలజీ చాలా వేగవంతం అవుతుందని చెబుతూనే.. ఇది ఎంత వేగంగా ఎలా అభివృద్ధి చెందుతుందనేది తెలియాల్సి ఉందని పరేఖ్ అన్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో ఇన్ఫోసిస్ క్లయింట్‌ల కోసం 225 జనరేటివ్ AI ప్రోగ్రామ్‌లపై పనిచేస్తున్నట్లు.. దీనికోసం 2,50,000 మంది ఉద్యోగులకు ఈ రంగంలో టర్నింగ్ ఇస్తున్నట్లు కూడా వెల్లడించారు.ఏఐ ఉద్యోగులపైన ప్రభావం చూపుతుందని చాలామంది నిపుణులు వెల్లడించారు. చెప్పినట్లుగానే చాలా లక్షల మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. కానీ ఇన్ఫోసిస్ ఉద్యోగులను తొలగించబోదని.. రిక్రూటింగ్‌ కూడా పెరుగుతూనే ఉంటుందని పరేఖ్ అన్నారు. దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో కంపెనీలో ఉద్యోగుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అయన స్పష్టం చేశారు.

* రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెప్టెంబర్ నెలలో బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. ఆర్‌బీఐ హాలిడే క్యాలెండర్ ప్రకారం.. ఈ నెలలో మొత్తం 14 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ మూసివేతలలో పబ్లిక్ సెలవులు, ప్రాంతీయ సెలవులు, రెండవ & నాల్గవ శనివారాలు.. అన్ని ఆదివారాలలో సాధారణ సెలవుదినాలు ఉన్నాయి.

►5 సెప్టెంబర్: శ్రీమంత శంకరదేవుని తిథి (అస్సాంలో బ్యాంకులు సెలవు)
►7 సెప్టెంబర్: వినాయక చవితి, శనివారం
►8 సెప్టెంబర్: ఆదివారం
►13 సెప్టెంబర్: రామ్‌దేవ్ జయంతి (రాజస్థాన్‌లో బ్యాంకులు సెలవు)
►14 సెప్టెంబర్: రెండవ శనివారం
►15 సెప్టెంబర్: ఆదివారం
►16 సెప్టెంబర్: మిలాద్-ఉన్-నబీ లేదా ఈద్-ఎ-మిలాద్ (ప్రవక్త మొహమ్మద్ పుట్టినరోజు)
►17 సెప్టెంబర్: ఇంద్ర జాత్ర (సిక్కింలో బ్యాంకులు సెలవు)
►18 సెప్టెంబర్: శ్రీ నారాయణగురు జయంతి (కేరళలో బ్యాంకులు సెలవు)
►21 సెప్టెంబర్ 21: శ్రీ నారాయణగురు సమాధి (కేరళలో బ్యాంకులు సెలవు)
►22 సెప్టెంబర్: ఆదివారం
►23 సెప్టెంబర్: బలిదాన్ డే (హర్యానాలో బ్యాంకులు సెలవు)
►28 సెప్టెంబర్: నాల్గవ శనివారం
►29 సెప్టెంబర్: ఆదివారం

బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పని చేసుకోవాలనుకునే వారు బ్యాంక్ హాలిడేస్ గమనించి ముందుగానే పనులు పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్‌లైన్ సేవలు అన్నీ అందుబాటులో ఉంటాయి.

* పూణె తయారీ కేంద్రంగా ఉన్న లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘మెర్సిడెస్ బెంజ్ ఇండియా’ పర్యావరణ ప్రమాణాలను పాటించడం లేదని మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (MPCB) ఆరోపించింది. ప్లాంట్ కార్యకలాపాలను సమగ్రంగా సమీక్షించాలని కోరింది.మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి ఎలాంటి వ్రాతపూర్వక నోటీసు అందుకోలేదని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఒక ప్రకటనలో వెల్లడించింది. అవసరమైతే ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కంపెనీ పేర్కొంది.2024 ఆగస్టు 23న నిర్వహించిన సాధారణ తనిఖీలో.. పూణేలోని చకాన్‌లోని మెర్సిడెస్ బెంజ్ అసెంబ్లీ ప్లాంట్ మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (MPCB) నిర్దేశించిన కాలుష్య నియంత్రణ మార్గదర్శకాలకు కట్టుబడి లేదని గుర్తించినట్లు బోర్డు తెలిపింది. దీంతో బెంజ్ అసెంబ్లీ ప్లాంట్ మీద తగిన చర్యలు తీసుకోవాలని ప్రాంతీయ అధికారులను ఆదేశించింది. తక్షణ చర్యగా.. రూ. 25 లక్షల బ్యాంక్ గ్యారెంటీని జప్తు చేసినట్లు వెల్లడించింది.ఆటోమోటివ్ ఇన్నోవేషన్‌లో అగ్రగామిగా ఉన్న మెర్సిడెస్ బెంజ్ స్థిరమైన ఉత్పత్తి పద్ధతుల్లో పర్యావరణ ప్రమాణాలను పాటించకపోవడం అనేది ఆందోళన కలిగించే విషయం. ఇది బ్రాండ్ మీదున్న నమ్మకాన్ని ఒమ్ముచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పర్యావరణం, సుస్థిరత పద్ధతులను నిలబెట్టడానికి.. తప్పనిసరి నిబంధనలను పాటిస్తామని, ప్రమాణాలకు కట్టుబడి ఉండటానికి కంపెనీ అధిక ప్రాధాన్యతనిస్తుందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా తెలిపింది.

* చైనాలో డిమాండ్‌ పడిపోవడంతో ఆ దేశం నుంచి ఉక్కు దిగుమతులు దేశాన్ని ముంచెత్తుతున్నాయంటూ కేంద్ర ఉక్కు శాఖ మాజీ కార్యదర్శి నాగేంద్రనాథ్‌ సిన్హా తెలిపారు. ‘‘ఫ్లాట్‌ స్టీల్‌ ఉత్పత్తుల పరంగా చూస్తే దిగుమతులు పెద్ద సమస్యగా ఉంది. చైనాలో వినియోగం పడిపోవడం మన మార్కెట్‌ను కుదిపేస్తోంది’’అని సిన్హా పేర్కొన్నారు.‘ఇండియన్‌ ఐరన్‌ ఓర్, పెల్లెట్‌’ సదస్సును ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పెరిగిపోతున్న దిగుమతులతో స్థానిక ఉక్కు ఉత్పత్తుల ధరలపై, స్టీల్‌ తయారీ సంస్థల లాభాలపై ప్రభావం పడుతుందన్నారు. ‘‘చైనా నుంచి అనుచితంగా దిగుమతులు వచ్చి పడుతున్నాయి. దీని పట్ల భారత ప్రభుత్వం సకాలంలో స్పందించాలి’’ అని అన్నారు. చైనా తదితర దేశాల నుంచి ముంచెత్తుతున్న చౌక స్టీల్‌ దిగుమతులను అడ్డుకోవాలంటూ పరిశ్రమ ఇప్పటికే ఎన్నో పర్యాయాలుగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయడం గమనార్హం.ప్రపంచ ఉక్కు ఎగుమతుల కేంద్రంగా భారత్‌ మారాలన్న లక్ష్యానికి విరుద్ధంగా.. మన దేశం నికర దిగుమతుల దేశంగా మారుతుండడం పట్ల పరిశ్రమ ఆందోళనను వ్యక్తం చేసింది. దిగుమతులపై సంకాల విధింపునకు ఏడాది, ఏడాదిన్నర సమయం తీసుకుంటే, అది దేశీ పరిశ్రమకు మేలు చేయబోదని సిన్హా అభిప్రాయపడ్డారు.

* ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ఇటీవల క్విక్ కామర్స్ సర్వీస్ ప్రారంభించింది. అంటే ఏదైనా వస్తువు బుక్ చేసుకుంటే నిమిషాల వ్యవధిలోనే డెలివరీ చేస్తారన్నమాట. బెంగళూరు వాసి ల్యాప్‌టాప్‌ బుక్ చేసుకున్న ఏడు నిమిషాల్లోనే ఫ్లిప్‌కార్ట్ అతనికి డెలివరీ చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.బెంగళూరుకు చెందిన సన్నీ గుప్తా అనే వ్యక్తి ల్యాప్‌టాప్‌ ఆర్డర్ చేసుకున్నారు. అతినికి నిమిషాల వ్యవధిలోనే డెలివరీ అయింది. ఈ అనుభవాన్ని అతడు సోషల్ మీడియాలో వివరించారు. ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ నుంచి ల్యాప్‌టాప్‌ని ఆర్డర్ చేసాను. 7 నిమిషాలలోనే డెలివరీ అయింది. బుక్ చేసుకున్నప్పటి నుంచి డెలివరీ అయ్యేవరకు పట్టిన సమయం 13 నిముషాలు మాత్రమే అని తెలుస్తోంది.చాలాకాలంగా గుప్తా ల్యాప్‌టాప్‌ తీసుకోవాలని అనుకుంటున్నట్లు, ఇందులో భాగంగానే ఏసర్ ప్రిడేటర్ ల్యాప్‌టాప్ ఆర్డర్ చేశారు. దీని ధర రూ. 95000 నుంచి రూ. 2.5 లక్షల మధ్య ఉంది. ఆర్డర్ చేసిన నిమిషాల వ్యవధిలో డెలివరీ రావడం చాలా గొప్ప విషయం. దీనికి గుప్తా ఫ్లిప్‌కార్ట్‌కు ధన్యవాదాలు తెలిపారు.గుప్తా తన అనుభవాన్ని వివరిస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. దీనిపైన పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో ఒకరు ఇది నా కొత్త భారతదేశం, ఇలాంటి సేవలు మున్ముందు ఇంకా వేగంగా ఉంటాయని అన్నారు. మరొకరు ఇది నిజంగా ఒక విప్లవం. ఫ్లిప్‌కార్ట్ విజయవంతమైతే, ఇది ఖచ్చితంగా అమెజాన్‌కు గట్టి పోటీ ఇస్తుందని అన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z