NRI-NRT

ప్రవాసులకు నా ధన్యవాదాలు-డల్లాస్‌లో వెనిగండ్ల రాము

ప్రవాసులకు నా ధన్యవాదాలు-డల్లాస్‌లో వెనిగండ్ల రాము

2024 సాధారణ ఎన్నికల్లో తెదేపా గెలుపుకి, తన గెలుపుకి కృషి చేసిన ప్రవాసులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. ఆదివారం నాడు అర్వింగ్‌లో డల్లాస్ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఆయనకు అభినందన సభ నిర్వహించారు. ఇది అభినందన సభ కాదని, తాను తనకి సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపే సభ అని పేర్కొన్నారు. చంద్రబాబు జైలులో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ ధైర్యానికి, నిర్ణయాలను హర్షించారు. గత ప్రభుత్వ హయాంలో వ్యక్తి స్వేచ్ఛ హద్దులు దాటారని, అందుకే వైకాపా ఘోర ఓటమి చెందిందని వెల్లడించారు. గుడివాడలో తన సేవా కార్యక్రమాలను చూసి చంద్రబాబే స్వయంగా టికెట్ ఇచ్చారని, తాను ఏనాడూ ఎమ్మెల్యే కావాలని ఆశించి గుడివాడలో కార్యక్రమాలు చేయలేదన్నారు.

ఆయన ప్రసంగానికి పూర్వం ప్రవాసులు మాట్లాడారు. రాముకి విన్నపాలు, ప్రశ్నలు సంధించారు. లోకేష్ రెడ్‌బుక్ వివరాల ఆధారంగా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని, వరదలకు ఎన్నారై తెదేపా తరఫున చేపట్టాల్సిన సహాయక చర్యలు, ప్రవాసుల బాధ్యతలు, పార్టీ వారి సేవలను వినియోగించుకునే విధివిధానాలను ఖరారు చేయాలని కోరారు. సమ్యమనం ప్రధానమన్న రాము, అత్యవసర సహాయం కావాల్సిన అర్హుల జాబితాను ప్రభుత్వం నుండి తెప్పిస్తానని, ప్రవాసుల సేవలను విరివిగా వినియోగించుకుంటామని అన్నారు. ఎన్.టి.ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవాల కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి పూర్వం రాముతో పాటు ఎన్నారై తెదేపా శ్రేణులు అర్వింగ్‌లోని మహాత్మాగాంధీ స్మారకస్థలిని సందర్శించి నివాళు అర్పించారు. అనంతరం ర్యాలీగా సభాస్థలి వద్దకు వచ్చారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z