Business

టోల్‌ప్లాజాల వద్ద NHAI సరికొత్త సాంకేతికత-BusinessNews-Sep 02 2024

టోల్‌ప్లాజాల వద్ద NHAI సరికొత్త సాంకేతికత-BusinessNews-Sep 02 2024

* సెబీ చీఫ్‌ మాధభి పురీ బచ్‌ (Madhabi Puri Buch) వ్యవహారంలో కాంగ్రెస్‌ పార్టీ చేసిన ఆరోపణలపై ఐసీఐసీఐ బ్యాంక్‌ (ICICI bank) స్పందించింది. బ్యాంక్‌ నుంచి రిటైరయ్యాక ఆమెకు తాము ఎలాంటి వేతన చెల్లింపులూ చేయడం లేదని పేర్కొంది. ఎంప్లాయీ స్టాక్‌ ఆప్షన్లూ కేటాయించలేదని తెలిపింది. సెబీ చీఫ్‌గా ఉన్న మాధబి పురీ బచ్‌కు ఐసీఐసీఐ బ్యాంక్‌ రూ.16.8 కోట్ల మేర వేతనంగా చెల్లించిందంటూ కాంగ్రెస్‌ పార్టీ ఈ ఉదయం ఆరోపించిన నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంక్‌ ఈ విధంగా స్పందించింది.

* స్టాక్‌ మార్కెట్‌లో మదుపర్ల పెట్టుబడి తీరుతెన్నులపై స్టాక్‌ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) ఆసక్తికర నివేదికను వెల్లడించింది. ఐపీఓలో షేర్లు అలాట్‌మెంట్‌ జరిగిన వారంలోనే 54 శాతం విలువైన షేర్లను మదుపర్లు విక్రయిస్తున్నట్లు సెబీ అధ్యయనంలో తేలింది. నష్టాలు వచ్చినప్పటితో పోలిస్తే లాభాలు వచ్చినప్పుడు ఈ తరహా విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నట్లు సెబీ గుర్తించింది. ఐపీఓల్లో రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం పెరుగుతుండడం, కొన్ని ఐపీఓలు అంచనాలకు మించి ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అవుతున్న వేళ సెబీ ఈ అధ్యయనం నిర్వహించింది. ముఖ్యంగా మెయిన్‌బోర్డ్‌ ఐపీఓల విషయంలో మదుపర్ల ప్రవర్తన అంచనా వేసేందుకు దీన్ని చేపట్టింది. ఇందుకోసం 2021 ఏప్రిల్ నుంచి 2023 డిసెంబర్‌ మధ్య 144 ఐపీఓల డేటాను విశ్లేషించింది. మొత్తం రూ.2.13 లక్షల కోట్లు ఆయా సంస్థలు మార్కెట్‌ నుంచి సమీకరించగా.. 65 శాతం షేర్లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా విక్రయంచినవే కావడం గమనార్హం. అంటే కంపెనీలకు వెళుతోంది కేవలం 35 శాతమేనన్నమాట!

* టోల్‌ప్లాజాల వద్ద ఎటువంటి ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా వాహనాలు ముందుకు వెళ్లేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) సరికొత్త విధానాన్ని అనుసరించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం తొలుత దేశవ్యాప్తంగా రద్దీగా ఉండే 100 టోల్‌ప్లాజాలను జీఐఎస్‌-ఆధారిత సాఫ్ట్‌వేర్‌తో పర్యవేక్షించనుంది. ఇక్కడ ట్రాఫిక్‌తోపాటు ఇతర అంశాలను విశ్లేషిస్తూ.. వాహనదారులకు ఎప్పటికప్పుడు అలర్ట్‌లు జారీ చేయనుంది. నేషనల్‌ హైవే హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1033 వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ ద్వారా రద్దీగా ఉండే 100 టోల్‌ప్లాజాలను ఎన్‌హెచ్‌ఏఐ తొలుత ఎంపిక చేసింది. టోల్‌ప్లాజాల పేరు, ప్రదేశంతోపాటు ఎన్ని మీటర్ల మేర అక్కడ ట్రాఫిక్‌ ఉంది, నిరీక్షణ సమయం, వాహనాల వేగం వంటి వివరాలను జీఐఎస్‌ సాఫ్ట్‌వేర్‌ అందిస్తుంది. వాహనాల క్యూ నిర్దేశిత పరిమితి కంటే ఎక్కువగా ఉంటే.. రద్దీ హెచ్చరికలు, లేన్ డిస్ట్రిబ్యూషన్‌ వంటి సిఫార్సులు చేస్తుంది.

* మహీంద్రా & మహీంద్రా ఈ ఆగస్టులో మొత్తం తన టోకు అమ్మకాలు 9% వార్షిక వృద్ధిని నమోదు చేసి 76,755 యూనిట్లకు చేరుకున్నాయి. దేశీయ ప్రయాణీకుల వాహన అమ్మకాలు 16% పెరిగి 43,277 యూనిట్లకు చేరుకున్నాయి. గతేడాది ఇదే సమయంలో ఈ అమ్మకాలు 37,270 మాత్రమే. కంపెనీ మొత్తం ఎగుమతులు గత నెలలో 26% పెరిగి 3,060కు చేరాయి. గతేడాది ఆగస్టులో ఎగుమతులు 2,423. క్రితం ఏడాది ఆగస్టులో ట్రాక్టర్‌ విక్రయాలు 21,676గా ఉంటే, ఈ ఏడాది ఆగస్టులో 1% పెరిగి 21,917కు చేరాయని M&M తెలిపింది. ఈ ఏడాది రుతుపవనాలు ఆశాజనకంగా ఉండడంతో ట్రాక్టర్‌ అమ్మకాల్లో వృద్ధి అవకాశాలు మరింత పెరుగుతాయని మహీంద్రా & మహీంద్రా ఫార్మ్‌ ఎక్విప్‌మెంట్‌ సెక్టార్‌ ప్రెసిడెంట్‌, హేమంత్‌ సిక్కా తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z