Health

రోగి భార్యపై అంబులెన్స్‌లో దారుణం-CrimeNews-Sep 05 2024

రోగి భార్యపై అంబులెన్స్‌లో దారుణం-CrimeNews-Sep 05 2024

* బెంగళూరులో ఓలా ఆటో డ్రైవర్ ఒక యువతిపై అనుచితంగా ప్రవర్తించి, దుర్బాషలాడి, దాడిచేసిన ఘటన కలకలం రేపింది. బుధవారం జరిగినఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చర్చనీయాంశంగా మారింది.బాధిత యువతి ఎక్స్‌లో షేర్‌ చేసిన వివరాల ప్రకారం తన స్నేహితురాలితో కలిసి బెంగళూరు సిటీలో ఓలా ఆటో రైడ్‌ను బుక్‌ చేసుకున్నారు. తొందరగా వెళ్లాలనే ఉద్దేశంలో ఇద్దరూ ఓలా రైడ్‌ కోసం ప్రయత్నించగా ఇద్దరివీ బుక్‌ అయ్యాయి. ఇదే వివాదానికి దారి తీసింది. ముందుగా వచ్చిన ఆటోలో యువతులిద్దరూ ఎక్కి కూర్చున్నారు. ఇంతలో 15 నిమిషాలు ఆలస్యం చూపించిన రెండో ఆటోను రద్దు చేసింది.కానీ అక్కడికి చేరుకున్న రెండో ఆటోవాలా తన రైడ్‌ ఎందుకు క్యాన్సిల్‌ చేశారంటూ వాదనకు దిగాడు. అంతేకాదు పెట్రోల్ ఊరికే వస్తుందా, అంటూ రెచ్చిపోయాడు. అంతటితో ఆగలేదు దుర్భాషలాడుతూ ఆమెపై దాడికి దిగాడు ఆటో డ్రైవర్. దీంతో నన్ను చెంపపై ఎందుకు కొట్టావ్‌ అంటూ ఆమె గట్టిగా నిలదీసింది. అప్పటిదాకా చోద్యం చూస్తూ కూర్చున్న మిగిలిన డ్రైవర్లు, జోక్యం చేసుకుని అతగాడిని పక్కకు తీసుకెళ్లారు.కాగా బాధిత యువతి నితి తన నిరాశను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్‌ చేసింది. ఓలా కస్టమర్ సపోర్ట్‌ ఫిర్యాదు చేసినా, ఆటోమేటెడ్ ప్రత్యుత్తరాలు మాత్రమే అందాయి తప్ప, అంతకుమించి ఎలాంటి స్పందన లేదని ట్వీట్ చేసింది. తన స్నేహితురాలు క్లాస్ మిస్ కాకుండా చూసుకోవడానికి రెండు ఆటోలను బుక్ చేసుకోవడం మాత్రమే తమ తప్పు అని, రైడ్ రద్దుపై వివాదాలు సర్వసాధారణమైనప్పటికీ, డ్రైవర్ బెదిరింపులు, అమానుష ప్రవర్తన హద్దు మీరిందంటూ ఆగ్రహం చేసింది. అయితే దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు.

* ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్‌ కేజీవాల్‌ బెయిల్‌ పిటిషన్‌తో పాటు సీబీఐ అరెస్టును సవాల్‌ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్వల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. కేజ్రీవాల్‌ తరపున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఈడీ తరపున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్పీ రాజు వాదించారు.ఇరు వర్గాల నుంచి సుధీర్ఘ వాదనలు విన్న సుప్రీంకోర్టు.. కేజ్రీవాల​ బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌ చేసింది. ఈ నెల 10న తీర్పు వెల్లడించనుంది.ఎలాంటి ఆధారాలు లేకుండా సీబీఐ కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేసిందని అభిషేక్‌ మను సింఘ్వీ పేర్కొన్నారు. ఇది అరుదైన సంఘటనగా అభివర్ణించారు. కఠినమైన మనీలాండరింగ్‌ చట్టం కింద ఢిల్లీ ముఖ్యమంత్రి రెండుసార్లు బెయిల్‌ పొందారని, కానీ సీబీఐ ఆయన్ను ‘బీమా అరెస్టు’(ముందస్తు) చేసిందని మండిపడ్డారు.

* అంబులెన్స్‌ డ్రైవర్‌, హెల్పర్‌ దారుణానికి పాల్పడ్డారు. బ్రెయిన్‌ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న భర్తను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్తున్న భార్యపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ దారుణం నుంచి బాధితురాలు ప్రతి ఘటించడంతో నిందితులు ఆమె భర్తకు ధరించిన ఆక్సిజన్‌ మాస్క్‌ తొలగించారు. అందిన కాడికి డబ్బుల్ని దోచుకుని పరారయ్యారు.పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తరప్రదేశ్‌ సిద్ధార్థ్ నగర్ జిల్లాలో బ్రెయిన్‌ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న భర్తను అతని భార్య చికిత్స కోసం ఓ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, ఆస్పత్రి ఖర్చులు భరించలేక మరుసటి రోజే అంబులెన్స్‌లో భర్తను ఇంటికి తరలించేందుకు ప్రయత్నించింది.ఇందుకోసం ఓ అంబులెన్స్‌ను మాట్లాడుకుని ఇంటికి బయలు దేరారు బాధితురాలు, ఆమె తమ్ముడు. అర్ధరాత్రి కావడంతో మార్గం మధ్యలో అంబులెన్స్‌ డ్రైవర్‌, హెల్పర్‌ బాధిత మహిళపై దారుణానికి ఒడిగట్టేందుకు ప్రయత్నించారు. ముందు క్యాబిన్‌లో కూర్చోమని, ఆపై వేధించారు. వేధింపులకు పాల్పడడం గుర్తించిన బాధితురాలి తమ్ముడు అడ్డుకోగా.. చివరగా ఛవానీ పోలీస్ స్టేషన్ ప్రధాన రహదారిపై అంబులెన్స్‌ను ఆపారు. భర్తకు తగలించిన ఆక్సిజన్‌ మాస్క్‌ను తొలగించారు. బాధితుణ్ని బలవంతంగా కిందకు దించారు. అనంతరం డబ్బు, నగదుతో అక్కడి పరారయ్యారు.ఆక్సిజన్‌ మాస్క్‌ తొలగించడంతో అత్యవసర చికిత్స ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ దారుణ ఘటనపై మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏడీసీపీ జితేంద్ర దుబే తెలిపారు.

* కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ కుమారుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసిన సంఘటన అల్లాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ సామల వెంకటరెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అల్లాపూర్, పర్వత్‌నగర్‌లో ఉంటున్న వడ్యానం పరమేశ్వర్‌ కారు డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.అతడికి భార్య భారతి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. గత కొన్ని నెలలుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో భారతి తన భర్త పరమేశ్వర్‌ను హత్య చేయాలని నిశ్చయించుకుంది. ఈ నెల 1న రాత్రి వారిద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో కొట్టుకున్నారు. దీంతో భారతి తన కుమారితో కలిసి పరమేశ్వర్‌ తలపై ఇస్త్రీ పెట్టెతో మోదడమేగాక, వైర్‌తో మెడకు బిగించి హత్య చేసింది.ఈ విషయాన్ని కుమార్తె చూడటంతో భారతి అతడని మాదాపూర్‌లోని శ్రావణి హాస్పిటల్‌కు తీసుకెళ్లింది. పరీక్షించిన వైద్యులు పరమేశ్వర్‌ అప్పటికే మృతి చెందినట్లు నిర్దారించారు. దీంతో భారతి, కుమారుడితో సహా పారిపోయింది. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితురాలు భారతి, అమె కుమారుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

* పోలీసు అధికారినంటూ ఓ వ్యక్తి నకిలీ ఆర్‌ఎస్‌ఐ అవతారమెత్తాడు. శ్రీశైలం ఆలయంలో దర్జాగా వీఐపీ దర్శనం చేయించుకున్నాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. శ్రీశైలంఒకటో పట్టణ పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్‌కు చెందిన కుసుమ ప్రశాంత్ ఈ నెల ఒకటిన శ్రీశైలం ఆలయానికి వచ్చాడు. తాను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఆర్ఎస్సైగా పనిచేస్తున్నట్లు శ్రీశైలం పోలీసులను పరిచయం చేసుకున్నాడు. తనకు వసతి గది, వీఐపీ దర్శనం ఏర్పాటు చేయాలని కోరాడు. అది నిజమని నమ్మిన పోలీసులు కుసుమ ప్రశాంత్‌కు స్వామి, అమ్మవార్ల దర్శనం, వసతి ఏర్పాటు చేశారు. కానీ ఆ తర్వాత కుసుమ ప్రశాంత్ తీరుపై వారికి అనుమానం వచ్చింది. ఈక్రమంలో శ్రీశైలం ఒకటో పట్టణ సీఐ ప్రసాదరావు ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. అతడిని నకిలీ ఆర్ఎస్సైగా గుర్తించారు. నంద్యాల పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిందితుడిపై కేసు నమోదు చేయడంతో పాటు అతడి వద్దనున్న నకిలీ పోలీసు గుర్తింపు కార్డు, కారు, నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు సీఐ ప్రసాదరావు తెలిపారు. ప్రశాంత్ గతంలోనూ తెలంగాణలో పలు మోసాలకు పాల్పడినట్లు విచారణలో తేలిందని సీఐ తెలిపారు. నకిలీ పోలీసు అధికారిగా చెప్పుకొని ఒక వ్యక్తి నుంచి రూ.40 వేలు వసూలు చేయడంతో ఘట్‌కేసర్‌ పోలీసు స్టేషన్‌లో అతడిపై కేసు నమోదైందని చెప్పారు.

* భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. కరకగూడెం మండలం రఘునాథపాలెం సమీపంలోని అటవీ ప్రాంతంలో పోలీసులు-మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మృతుల్లో మణుగూరు ఏరియా కమిటీ కార్యదర్శి లచ్చన్న సహా ఆయన దళానికి చెందిన ఆరుగురు ఉన్నట్లు గుర్తించారు. ఈ కాల్పుల్లో గ్రేహౌండ్ కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలయ్యాయి. రఘునాథపాలెం ప్రాంతంలో గత కొంతకాలంగా ఈ దళం కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి వలస వచ్చిన ఈ దళానికి లచ్చన్న నాయకత్వం వహిస్తున్నారు. మృతుల్లో లచ్చన్నతో పాటు తులసి, శుక్రాం, రాము, దుర్గేష్‌, కోసి ఉన్నట్లు గుర్తించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z